Site icon NTV Telugu

Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

Malla Reddy

Malla Reddy

ఆ మాజీ మంత్రి కుటుంబం నుంచి మరో పొలిటికల్‌ ఎంట్రీ ఉండబోతోందా? తన రాజకీయ వారసురాలిగా కోడల్ని బరిలో దింపాలనుకుంటున్నారా? నియోజకవర్గాల పునర్విభజన లెక్కలు కూడా ఆ ఫ్యామిలీకి కలిసి రాబోతున్నాయా? కానీ… అసలు ఎంట్రీ పాయింట్‌లోనే ఆ ఎక్స్‌ మినిస్టర్‌ కమ్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే ట్విస్ట్‌ ఇవ్వబోతున్నారా? కోడల్ని తాను ఉన్న పార్టీ నుంచి కాకుండా పక్క పార్టీలో చేర్పించాలనుకుంటున్నారా? ఎవరా నేత? ఏంటా కథ? దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌ క్లియర్‌ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పునర్విభజన తర్వాతే ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారన్న విషయంలో క్రమంగా క్లారిటీ వస్తోంది. ఈ క్రమంలోనే…. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల పొలిటికల్‌ ఎంట్రీ ఎపిసోడ్‌ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం మేడ్చల్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. అదే పార్టీ నుంచి పక్కనే ఉన్న మల్కాజ్‌గిరి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడాయన కోడలు ప్రీతిరెడ్డి గురించిన చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. కుటుంబ, మల్లారెడ్డి విద్యాసంస్థల వ్యవహారాల్లో యాక్టివ్‌గా ఉంటున్న ప్రీతి రాజకీయాల మీద ఆసక్తిగా ఉన్నారు.గత పార్లమెంటు ఎన్నికల్లోనే మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారామె. కుటుంబ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రీతి రెడ్డి కూడా పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకవేళ గులాబీ పార్టీ నుంచి కుదరకపోతే కాషాయ కండువా కప్పుకుని కమలం గుర్తు మీద పోటీ చేస్తారని కూడా తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. కానీ… అవేవీ వర్కౌట్‌ అవలేదు. ఇక ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందని అంటున్న క్రమంలో… ప్రీతిరెడ్డి యాక్టివిటీ మరోసారి చర్చల్లోకి వస్తోంది. అయితే… బీఆర్‌ఎస్‌ నుంచి కాకుండా బీజేపీ తరపునే ఈసారి ఆమెపోటీ చేయవచ్చన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

దానికి తోడు అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి కూడా తన కోడలు బీజేపీ నుంచి పోటీ చేసే అంశాన్ని కొట్టి పారేయలేదు. ఆమె బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తుందని చెప్పిన మల్లారెడ్డి…. ఒకవేళ కుదరకుంటే ఆమె వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే నేనెలా అడ్డు చెప్పగలనని రివర్స్‌లో ప్రశ్నించారు. పార్టీ ఏదైనాసరే…. ఈసారి మాత్రం తన కుటుంబం నుంచి నలుగురు ఐదుగురు ప్రజాప్రతినిధులు ఉండడం ఖాయమని కూడా కుండబద్దలు కొట్టేశారాయన. దానికి తోడు తాను హిందుత్వవాదినని గతంలో ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు ప్రీతిరెడ్డి. అలాగే… తనకి ఇష్టమైన రాజకీయ నేత నరేంద్రమోడీ అని కూడా క్లారిటీ ఇచ్చేశారామె. దీంతో… మల్లారెడ్డి కోటలు బీజేపీ వైపు మొగ్గుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే సమయంలో మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా ఈసారి పోటీ చేస్తారని, నియోజకవర్గాల పునర్వనిభజన భార్యాభర్తలిద్దరికీ కలిసి వస్తుందన్న అంచనాలున్నాయి.

 

భద్రారెడ్డి కూడా కుదిరితే బీఆర్‌ఎస్‌ లేదంటే బీజేపీ నుంచి బరిలో దిగవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి మహిళా రిజర్వేషన్‌ కోటా ప్రకారం సీట్లు ఉంటాయి కాబట్టి… తన కూతుర్ని కూడా రాజకీయ రంగంలోకి దింపేందుకు మల్లారెడ్డి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆవిధంగా పార్టీ ఏదైనాసరే… ఒకే ఇంటి నుంచి ఐదుగురు నేతలు ఈసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకే పార్టీ తరపున ఇంతమంది ఒకే కుటుంబ సభ్యులకు టిక్కెట్లు కుదరకపోవచ్చుకాబట్టి… బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే ఉండవచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ప్రీతిరెడ్డి మాత్రం ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, అదీకూడా ఎక్కువ శాతం బీజేపీ చతరపునే ఉండవచ్చని అంటున్నాయి మల్లన్న సన్నిహిత వర్గాలు. కుటుంబ సభ్యులందరూ ఒకే పార్టీలో ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని మల్లారెడ్డి వేసిన రివర్స్‌ క్వశ్చన్‌ ఆయన మనసులో ఏముందో చెప్పకనే చెప్పినట్టయిందనిన విశ్లేషణలు సైతం ఉన్నాయి. చివరికి ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గుతారో చూడాలి.

Exit mobile version