Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

  • 2024లో సత్తెనపల్లి టిక్కెట్‌ దక్కక తీవ్ర నిరాశ
  • ఇన్నాళ్ళు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో కార్యక్రమాలు
  • 2029లో ఎలాగైనా పోటీ చేయాలన్న టార్గెట్‌తో కోడెల శివరామ్‌
  • షాకిస్తూ.. ఉన్న పార్టీ పదవి కూడా తీసేసిన అధిష్టానం
Kodela Shivaram

Kodela Shivaram

తెలుగుదేశం పార్టీలో కోడెల వారసత్వ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందా? శివప్రసాదరావు కుమారుడికి పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందా? విషయాన్ని గ్రహించే… శివరామ్‌ గేమ్‌ మార్చారా? సరికొత్త స్కెచ్‌తో తన ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నారా? పార్టీ తనను గుర్తించాలంటే రివర్స్‌ స్ట్రాటజీనే కరెక్ట్‌ అనుకుంటున్నారా? ఇంతకీ ఏం చేస్తున్నారు కోడెల శివరామ్‌? దాని గురించి పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఏపీ పాలిటిక్స్‌లో… ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో కోడెల శివప్రసాదరావుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయాక కొడుకు శివరామ్‌కు కూడా మంచి ప్రాధాన్యత దక్కుతుందని చాలామంది భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా… అప్పట్లో శివరామ్‌ బాధ్యత నాదేనని ప్రకటించారు. కానీ… టైం గడిచేకొద్దీ పరిస్థితులు మారిపోయాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శివరాంకు సత్తెనపల్లి టీడీపీ టిక్కెట్‌ ఇస్తారని ప్రచారం జరిగినా… అనూహ్యంగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెర మీదికి వచ్చారు. దీంతో కోడెల అనుచరుల్లో అసంతృప్తి మొదలైంది. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక శివరాంకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి లభించింది. శివరామ్‌ కూడా గతంలో తండ్రి ప్రాతినిధ్యం వహించిన నర్సరావుపేట, సత్తెనపల్లిలో నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఎలాగైనా 2029లో పోటీ చెయ్యాలన్న టార్గెట్‌తో పనిచేస్తున్న శివరామ్‌కు తాజాగా ఇంకో షాక్‌ తగిలింది. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో కోడెల శివరాంకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. అప్పటివరకూ ఉన్న రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ప్రత్యామ్నాయంగా ఇంకో పదవి కూడా ఇవ్వలేదు. దీంతో శివరాంకు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపులేని పరిస్థితి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక మంది నేతలల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించిన, రాజకీయంగా ఊతమిచ్చిన కోడెల శివప్రసాదరావు కొడుక్కే ఇప్పుడు పార్టీలో కనీస ప్రాధాన్యత లేకపోవడంపై ఆయన వర్గీయుల్లో నిరాశ పెరుగుతోందట. అదే సమయంలో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు పార్టీలో మంచి ప్రాధాన్యత దక్కుతోంది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కన్నాను నియమించడం, కోడెల శివరాంకు ఉన్న పదవిని తొలగించడం పుండుమీద కారం చల్లినట్లుగా మారిందని అంటున్నారు. దీంతో ఇక లాభం లేదనుకుని పార్టీలో ఉనికి కోసం శివరామ్‌ రివర్స్ స్ట్రాటజీ అప్లయ్‌ చేస్తున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు. ఇటీవల పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికాశుక్లాను కలిశారు శివరామ్‌. రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్ప కొండకు వచ్చే భక్తులకు సౌకర్యాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. వైద్య సదుపాయం కల్పించడంతో పాటు కొండ మీద పర్మినెంట్‌గా డాక్టర్‌ను నియమించాలని కోరారాయన. అంతవరకూ బాగానే ఉన్నా… ఆ తర్వాతి వ్యవహారం గురించే ఇప్పుడు పల్నాడు జిల్లాలో చర్చ జరుగుతోంది.

సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు శివరామ్‌. ఈ అడ్డగోలు వ్యవహారాలతోతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని చెప్పారు. అక్రమ మైనింగ్‌ని ఆపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఇదే ఇప్పుడు పల్నాడు పొలిటికల్ హాట్‌ అయింది. కోడెల శివరాం ఎవరిని టార్గెట్ చేసుకుని కలెక్టర్‌కు అలా ఫిర్యాదు చేశారన్న చర్చలు జరుగుతున్నాయి. నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేసుకునే ఫిర్యాదు చేసి ఉంటారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. సేమ్‌ టైం… అటు నర్సరావుపేట, ఇటు సత్తెనపల్లిలో రాజకీయ ఉనికి కోసమే శివరాం ఇలా పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఫిర్యాదులు చేశారన్న వాదన సైతం బలపడుతోంది. పార్టీ అధికారంలో ఉండి, సొంత ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అరాచకాలు జరుగుతున్నాయంటూ.. అదే పార్టీకి చెందిన నాయకుడు ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడాన్ని ప్రత్యేకంగానే చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అక్రమ మైనింగ్‌ జరుగుతోందా లేదా అన్న సంగతి కాసేపు అలా ఉంచితే… ఇన్నాళ్ళు కామ్‌గా ఉండి… పార్టీ పదవి కూడా పోయాక శివరామ్‌ ఇలా కంప్లయింట్‌ ఇస్తున్నారంటే అది కచ్చితంగా టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నమేనన్నది కొందరి విశ్లేషణ. దీనికి హై కమాండ్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందోనని జిల్లా టీడీపీ వర్గాలు కూడా ఉత్కంఠగా చూస్తున్నాయి.