చెక్డ్యామ్ మీదుగా నీళ్ళకు బదులు రాజకీయం ప్రవహిస్తోంది. నీటి ఊటకు బదులు పొలిటికల్ ఊట తెగ ఊరిపోతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మొత్తం మీరే చేశారంటూ… పరస్పరం వేలెత్తి చూపించుకుంటున్నాయి. ఒక చెక్ డ్యామ్ కోసం అధికార, ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏంటా స్టోరీ? ఖమ్మం నగరంలోని మున్నేరు నదిపై ప్రకాశ్ నగర్ దగ్గర దాదాపు ఏడున్నర కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. 200 మీటర్ల పొడవు, మూడు మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన చెక్ డ్యామ్ కూల్చివేతతో ఇందులోకి పాలిటిక్స్ ఎంటరయ్యాయి. ఆ నిర్మాణం వల్ల నగరానికి ప్రమాదం పొంచి ఉందన్న సాంకేతిక నిపుణుల సలహా మేరకే కూల్చివేశారని, అదీకూడా ప్రభుత్వ అధికారుల సూచనల మేరకేనని చెబుతోంది అధికార పార్టీ. దీంతో ఇప్పుడిది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్గా మారిపోయింది. 2021లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు…అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ ఇక్కడ చెక్ డ్యామ్ కట్టించారు. దీన్ని మున్నేరు మీద నిర్మించడం వల్ల అక్కడ నీళ్ళు నిలబడి ఆ ప్రభావంతో ఖమ్మం త్రీ టౌన్ ఏరియా, రూరల్ ఏరియాల్లో మంచినీటి కొరత రాకుండా ఉంటుందని అంచనా వేశారు. అన్ని రకాల సాంకేతి అనుమతులు తీసుకుని, అన్ని కోణాల్లో పరిశీలించాకే… నాడు నిర్మాణం పూర్తయిందని చెబుతున్నారు గులాబీ నాయకులు. అదలా ఉంటే…. 2023లో వచ్చిన వరదలు ఖమ్మం నగరాన్ని వణికించాయి. వరద నీటిలో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా అప్పుడే చెక్ డ్యామ్ మీదికి అందరి దృష్టి మళ్ళింది. ఈ చెక్ డ్యామ్ వల్లే త్రీ టౌన్ ఏరియా మునిగిపోయిందన్న విమర్శలు వచ్చాయి.
మూడో పట్టణ ప్రాంతం మొత్తం మున్నేరు చుట్టూనే ఉంటుంది. ప్రకాష్నగర్ బ్రిడ్జి దగ్గరే ఈచెక్ డ్యామ్ను నిర్మించారు. దీంతో వరద సాఫీగా వెళ్లక నీళ్లన్నీ త్రీటౌన్లోని ముఖ్యమైన ప్రాంతాలను ముంచెత్తాయి. దీనికి తోడుగా చెక్ డ్యామ్ పక్కనే ఉన్న రోడ్డు బ్రిడ్జి కూడా ఆనాటి వరదలకు దెబ్బతింది. ఆరు నెలల పాటు పూర్తిగా రాకపోకలు నిలిపివేసి వంతెనకు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. చెక్ డ్యామ్ వరద పోటు వల్లనే బ్రిడ్జి దెబ్బతిన్నదని సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే… అసలు ఖమ్మంకు ఈ చెక్ డ్యామ్ అవసరం ఉందా లేదా… ఒకవేళ ఉంటే ఎంత మేరకు. దీన్ని పాక్షికంగా కూల్చాలా? లేక పూర్తిగా కూల్చి వేయాలా అంటూ అధికార వర్గాల్లో రకరకాల చర్చలు జరిగాయి. ఫైనల్గా మొత్తాన్ని తొలగించాలనే నిర్ణయించి చెక్డ్యామ్ను డెమాలిష్ చేశారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశాన్ని పూర్తిగా అధికారుల నిర్ణయానికే వదిలేశారట. దాంతో వాళ్ళు డెసిషన్ చీసుకుని పూర్తిగా కూల్చేసినట్టు చెబుతున్నారు. అయితే… ప్రస్తుతం కరవు పరిస్థితుల్లో ఇప్పుడది పొలిటికల్ టర్న్ తీసుకుంది. చెక్ డ్యామ్ని కూల్చకుండా ఉండి ఉంటే… పరిస్థితి ఇంకోలా ఉండేదని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కూల్చివేతకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చారు గులాబీ నాయకులు. పార్టీ కేడర్ మొత్తం కూల్చేసిన చెక్ డ్యామ్ దగ్గర ఆందోళనలు నిర్వహించింది. ఎల్నినో వల్ల వర్షాలు సరిగా పడక ప్రస్తుతం నగరంలో మంచినీటికి కొరత ఏర్పడుతోందని, అదే చెక్డ్యామ్ ఉండి ఉంటే… భూగర్భ జలాలు పెరిగి ఇబ్బంది లేకుండా ఉండేదన్నది గులాబీ వాదన. తమ ప్రభుత్వంలో నిర్మించిన వాటిని కావాలనే కాంగ్రెస్ సర్కార్ తొలగిస్తోందని, అంతిమంగా ప్రజలకు నష్టం కలుగుతోందని విమర్శిస్తున్నారు. మొత్తం మీద చెక్డ్యామ్ వల్ల నీటి ఊట సంగతేమోగానీ…పొలిటికల్ ఊట మాత్రం బాగా ఊరుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్గా మారుతోంది.

