ఆ ప్రతిపక్ష నేతకు అధికార పార్టీనే ఏరికోరి మైలేజ్ ఇస్తోందా? ఎక్కడో సుడి ఉంది…. పెద్దగా ఏమీ చేయకున్నా…. తెగ పాపులారిటీ పెరుగుతోందని సొంత వైసీపీ నాయకులు కూడా కుళ్ళుకుంటున్నారా…? అదే సమయంలో…. మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పెద్దోణ్ణి చేస్తున్నామా అంటూ టీడీపీలో సైతం అంతర్మధనం జరుగుతోందా? ఇంతకీ ఎవరా నాయకుడు? సొంతోళ్లు, పరాయివాళ్లు మాట్లాడుకునేలా ఏం చేస్తున్నారు? మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారశైలి గురించి ఇటు అధికార టీడీపీతో పాటు అటు ఆయన సొంత వైసీపీలో కూడా కాస్త డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారట. ఆయనకు మనం అంత సీన్ ఇవ్వాలా…? ఎక్కువ ఇచ్చి మనమే పెద్దోడిని చేస్తున్నామా అని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటుంటే…. వైసీపీలో మాత్రం ఏదో ఒక రూపంలో హైలైట్ అయిపోతూ… మైలేజ్ కొట్టేస్తున్నాడు, అది మనకు రావడం లేదేంటని మాట్లాడుకుంటున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళి…. వార్తల్లోని వ్యక్తి అయ్యారు జోగి. అప్పట్లో తెలుగు తమ్ముళ్ళ హిట్ లిస్టులో చేరిపోయారాయన. ఇక ఎన్నికలు జరిగి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోగి రమేష్ కుమారుడు… అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ అమ్మకాల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి కూడా అరెస్ట్ అయి బెయిల్ మీద బయటికి వచ్చారు.
ఆ తర్వాత ఆయన ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఆ తర్వాత ఇక సైలెంట్ అవుతారని తెలుగుదేశం నాయకులు చాలామంది భావించారట. కానీ… ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వాళ్ళలో కొత్త చర్చ మొదలైనట్టు తెలిసింది. మనం అనవసరంగా ఆయనకు ఎక్కువ ఇస్తున్నామా అంటూ వాళ్లలో వాళ్లు ప్రశ్నించుకుంటున్నట్టు సమాచారం. జోగి రమేష్ స్వస్థలం మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం. కానీ… ఆయన తొలిసారి పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో మైలవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసినా.. పరాజయమే పలకరించింది. దీంతో తనకు గెలుపు అందించిన పెడన నియోజకవర్గానికే తిరిగి వెళ్ళి 2019లో ఇక్కడి నుంచి గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. అయితే… గత ఎన్నికల్లో అనేక కారణాలతో జోగికి అక్కడ టికెట్ ఇవ్వకపోగా… స్వస్థలం మైలవరాన్ని కూడా కాదని పెనమలూరుకు పంపింది వైసీపీ అధిష్టానం. అయితే… అక్కడ కూడా ఆయన ఓటమి పాలవడంతో…. తిరిగి మైలవరం నియోజకవర్గానికే చేరారు. అక్కడ అంతగా…. ఆయన ప్రభావం లేదని స్థానిక టిడిపి నేతలు భావిస్తున్న సమయంలో…. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ దెబ్బకు ఇక ఖేల్ ఖతం అని ఖుషీ అయ్యారట లోకల్ తమ్ముళ్లు కొందరు.
కానీ… అదే సమయంలో అనూహ్యంగా జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాటిల్తో దాడి చేయడం ఇంటిని ధ్వంసం చేయడం, అందుకు ఆయన బీసీ కార్డు బయటకు తీయడం లాంటివి కొంత మైలేజ్ తీసుకువచ్చాయన్న అభిప్రాయం ఉంది. ఆ విషయంలో మాజీ మంత్రి కొంత వరకు సక్సెస్ అయినట్టు కూడా చెప్పుకుంటారు. ఆ తర్వాత కూడా.. రకరకాలుగా ఆయనకు మనమే మైలేజ్ ఇస్తున్నామా అంటూ టీడీపీ మైలవరం నాయకత్వం ఆలోచనలో పడిందట. జోగి రమేష్ బీసీ కార్డు ద్వారా మైలేజ్ పొందే ప్రయత్నం చేయగా… టిడిపి బీసీ నేతలతో జోగి నివాసం సమీపంలోనే భారీ సభ నిర్వహించి ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేశారంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇక తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గరున్న మామిడిపల్లిలో మొక్కజొన్న రైతుల్ని పరామర్శించేందుకు జోగి రమేష్ వెళుతుండగా పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం సంచలనమైంది. ఈసారి కూడా జోగి రమేష్ బీసీ కార్డును గట్టిగా వాడి మైలేజ్ పొందే ప్రయత్నం మొదలుపెట్టారట. దీంతో ఎన్టీఆర్ జిల్లా టిడిపి నాయకత్వం అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. మొక్కజొన్న రైతులని పరామర్శించడానికి వెళితే వెళ్ళనివ్వాల్సిందని, అనవసరంగా ఆపడంవల్లే ప్రచారం ఎక్కువైపోయిందని బాధపడుతున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇకనైనా… ఆయన్ని, ఆయనచర్యల్ని పట్టించుకోకుండా వదిలేస్తే బెటరన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోందని అంటున్నారు. ఇక ఇదే సమయంలో వైసీపీలో కూడా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. అధికార పార్టీపై మాటల తూటాలు పేలుస్తూ… ఇరుకున పెట్టడం ద్వారా పార్టీ దృష్టిలో పడుతున్న కొందరు నేతలు… జోగిని చూసి కాస్త అసూయ ఫీలవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మనం ఎంత చించుకున్నా, ఆయన ఏం చేయకున్నా…ఒకేలా ఉందని, కాలం కలిసొచ్చి మంచి మైలేజ్ వస్తోందని మాట్లాడుకుంటున్నారట. తాము అనేక కార్యక్రమాలు చేస్తే వచ్చే మైలేజ్ని రమేష్కు అధికార పార్టీ నేతలే వచ్చేలా చేస్తున్నారంటూ ఛలోక్తులు కూడా విసురుకుంటున్నారట.
