Site icon NTV Telugu

Off The Record : బీఆర్ఎస్ లో చేరికపై జీవన్ రెడ్డి మెలిక… కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్!

Jeevan Reddy

Jeevan Reddy

బీఆర్‌ఎస్‌లో చేరాలనుకున్న ఓ పెద్ద లీడర్‌… పార్టీ అధిష్టానానికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారా? గట్టి మెలికే పెట్టేశారా? దాదాపు పీటముడి పడుతున్న టైంలో… కేసీఆర్‌ తన రాజకీయ చతురతతో వాతావరణాన్ని తేలిక పరిచారా? నువ్వా నేనా అన్నట్టుగా మారుతున్న వ్యవహారం మంచినీళ్ళ ప్రాయమైందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఆయన పెట్టిన మెలిక ఏంటి? కేసీఆర్‌ ఎలా సాల్వ్‌ చేశారు? లెట్స్‌ వాచ్‌. ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి….. పార్టీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి. పదిరోజుల క్రితం పార్టీని వీడిన జీవన్‌ ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరలేదు. బీజేపీలో చేరతారని ఓ రోజు లీక్ ఇచ్చి… ఆ తర్వాత కారెక్కితే ఎలా ఉంటుందని థింక్ చేస్తున్నట్టు ప్రచారం చేశారు ఆయన సన్నిహితులు.

అయితే…. రకరకాల తర్జనభర్జనల తర్వాత ఫైనల్‌గా గులాబీ తీర్ధం పుచ్చుకునేందుకే మొగ్గుచూపారట ఎక్స్‌ మినిస్టర్‌. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో కూడా టచ్‌లోకి వెళ్ళినట్టు తెలిసింది. అయితే… ఇదే సమయంలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరుగా జరుగుతోంది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో. బీఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమైనా… వెంటనే కండువా కప్పుకోకుండా, కొన్నాళ్ళు న్యూట్రల్‌గా ఉంటూ కాంగ్రెస్‌కు చేయాల్సినంత నష్టం చేయమన్న సూచనలు జీవన్‌కు అందాయన్నది ఆ ప్రచారం సారాంశం. సరే….. అది నిజమో, అబద్దమో…. జనమైతే మాట్లాడుకుంటున్నారుగానీ….., చేరిక విషయంలో మాత్రం జీవన్‌రెడ్డి చాలా పర్టిక్యులర్‌గా ఉన్నారని, అందుకే కొత్త మెలిక పెట్టినట్టు తెలుస్తోంది.

తాను గులాబీ కండువా కప్పుకోవడానికి హైదరాబాద్‌లో పార్టీ ఆఫీస్‌కుగాని, కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కిగానీ వచ్చేది లేదని చెప్పారట. తనను చేర్చుకోవడానికి కేసీఆరే.. జగిత్యాలకు రావాలని, అదే తన సీనియారిటీకి గౌరవప్రదమని తేల్చి చెప్పేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని కేసీఆర్‌ దృష్టికి ఎలా తీసుకువెళ్ళాలో అర్ధంకాని పార్టీ నేతలు చాన్నాళ్ళు నాన్చి నాన్చి… వన్‌ ఫైన్‌ డే ఆయన చెవిన వేసేశారట. అందుకు కేసీఆర్‌ కూడా వెంటనే రెస్పాండ్‌ అవకుండా…. ముఖ్య నాయకులతో వ్యూహాత్మక చర్చలు జరిపినట్టు తెలిసింది. పార్టీ ఆవిర్భావ సభకోసం సీనియర్స్‌తో చర్చిస్తున్న క్రమంలో… ఈసారి ప్లీనరిని పాలమూరులోగానీ, కరీంనగర్‌లోగానీ పెడితే ఎలా ఉంటుందని అన్నారట.

తిరిగి వెంటనే ఆయనే జోక్యం చేసుకుంటూ… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెడదామని చెప్పేశారట. సరిగ్గా ఇక్కడే కేసీఆర్‌ వ్యూహం గురించి పార్టీ నేతలు డిస్కస్‌ చేసుకుంటున్నారు. ఓహో…. అసలు స్కెచ్‌ అదన్న మాట అంటూ… ఏదైనా మా సార్‌ అంటే సారే. ఆయన స్కెచ్చేస్తే అంతే…. అంటూ తెగ పొగిడేసుకుంటున్నట్టు తెలిసింది. ఇంతకీ మేటరేంటే….ఎవ్వరూ పైకి మాట్లాడకున్నా… కరీంనగర్‌కి జగిత్యాలకు మధ్య బీఆర్‌ఎస్‌ ప్లీనరీని నిర్వహించి అదే సభలో జీవన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవచ్చని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఎవరి కోసం ఎవరూ దిగివచ్చినట్టు కాదు, ఇద్దరిలో ఎవరి గౌరవానికి భంగం వాటిల్లదని మాట్లాడుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. రాజకీయ వ్యూహ రచనలో ఎవరి అంచనాలకు అందరనే పేరున్న కేసీఆర్… ఈ విధంగా మరోసారి తన చతురతను చాటుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది బీఆర్‌ఎస్‌లో.

పార్టీలో జాయిన్‌ అవడానికి హైదరాబాద్‌ రానని జీవన్‌ చెప్పినందున అటు ఆయనపై ఒత్తిడి తేకుండా, ఇటు తాము తగ్గినట్టు కనిపించకుండా పర్‌పెక్ట్‌గా ప్లాన్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. కరీంనగర్‌లో ప్లీనరీ పెడతామని గతంలో కూడా ఒకసారి ప్రకటించి చివరి నిమిషంలో రద్దు చేశారు. అయితే… ఈసారి అలా జరక్కపోవచ్చని అంటున్నారు పార్టీ సీనియర్స్‌. గత ఎన్నికల తర్వాత ఉత్తర తెలంగాణలో కార్‌ జోరు కాస్త తగ్గిందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. క్యాడర్‌ బలంగానే ఉన్నప్పటికీ మునపటి జోష్ కనిపించడం లేదు. శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడం కోసం ఉత్తర తెలంగాణకు సెంటర్ పాయింట్‌గా ఉండే కరీంనగర్‌నే ఫైనల్‌ చేయవచ్చని అంటున్నారు. ఇటీవలి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

కాస్త ప్రయత్నిస్తే మరిన్ని సీట్లు దక్కే అవకాశం ఉన్నప్పటికీ అంతగా కృషి జరగలేదని నేతలతో అన్నారట కేసీఆర్‌. అందుకే ఈసారి ప్లీనరీని కరీంనగర్‌ జిల్లాలో పెట్టి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు ఆయన సన్నిహితులు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ప్లీనరీపై మరింత స్పష్టత వస్తుందని అంటున్నాయి గులాబీ వర్గాలు. నిరుడు ఎల్కతుర్తి సభ తర్వాత కేసీఆర్ బహిరంగసభల్లో పాల్గొనలేదు. అందుకే గులాబీ బాస్ ఎంట్రీని గ్రాండ్‌గా ఉండేలా చేయాలంటే పాలమూరు కంటే కరీంనగరే బెటర్‌ అనే నిర్దారణకు వచ్చేశారట పార్టీ నాయకులు. పైగా కరీంనగర్ అంటే కేసీఆర్‌కు సెంటిమెంట్ కూడా ఉంది. తాను చేపట్టిన ముఖ్య కార్యక్రమాలన్నిటినీ దాదాపు ఇక్కడి నుంచే ప్రారంభించారాయన. ఇలా రకరకాల ఈక్వేషన్స్‌ అండ్‌ కేలిక్యులేషన్స్‌తో ప్లీనరీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు షిఫ్ట్‌ కావచ్చని అంటున్నారు. మరి ఈ ఎపిసోడ్‌లో జీవన్‌రెడ్డి కథ సుఖాంతం అవుతుందో లేక మలుపులు ఉంటాయో చూడాలి.

 

Exit mobile version