కాలాన్ని బట్టి మారాలి, అవసరాన్ని బట్టి డిమాండ్ చేయాలని అక్కడి జనసేన నేతలు గట్టిగా డిసైడయ్యారా? ఇక మాటల్లేవ్… త్యాగాలు అసలే ఉండవ్ అంటూ సంకేతాలిస్తున్నారా? పైగా… ఇప్పుడు సత్తా చూపితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ గ్యారంటీ ఉంటుందన్న భయం వెంటాడుతోందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అక్కడ పార్టీకి ఉన్న అనుకూలతలు ఏంటి? అప్పటి కోటా సరే…. ఇప్పటి వాటా సంగతేంటి? ఇప్పుడున్న బలానికి తగ్గట్టు మాకు లోకల్ బాడీస్లో సీట్లు కావాల్సిందే. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నేతల మనోగతం ఇదేనట. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా.. ఇప్పుడు సింగిల్ పాయింట్ అజెండాతో ఉన్నట్టు తెలుస్తోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో తమ మార్కు చూపించకుంటే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయం వాళ్లని వెంటాడుతోందని అంటున్నారు. అందులో జిల్లా గ్లాస్ లీడర్స్ అంతా.. 2024ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క అన్నట్టు ఉంటున్నారట. గతంలో రాష్ట్రం గురించి ఆలోచించి… సీట్లు ఇచ్చినకాడికి సర్దుకుని గెలిచి చూపించామని, ఇకపై దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీని మరింత ముందుకు తీసుకెళతామని సన్నిహితులతో అంటున్నట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒకలాగా, తామున్న చోట మరోలా ఉంటోందంటూ జనసేన శాసనసభ్యులకు ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలో జనసేన భాగస్వామి అయినప్పటికీ టిడిపి నేతల నుంచి ఆ స్థాయి సహకారం అందలేదన్నది వాళ్ళ అభియోగం. అందుకే… స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేలు తమతో ఏరకంగా వ్యవహరిస్తారో… అదే రకంగా జనసేన ఎమ్మెల్యేలు కూడా వ్యవహరించాలని ఫిక్స్ అయినట్టు తెలిసింది. 2024 ఎన్నికల్లో జనసేన అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 6 అసెంబ్లీ సీట్లు గెల్చుకుంది.
ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ… లోకల్ ఎన్నికల్లో మరోసారి తమ మార్క్ చూపించాలని అనుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లేదా.. ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్మన్లో ఒకదాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలగా ఉన్నారట. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో ఏదో ఒక కీలక పదవి తమ పార్టీ అభ్యర్థులకు దక్కే విధంగా ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. గెలుస్తామని నమ్మకం ఉన్న ప్రతిచోట కచ్చితంగా తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలన్నది గ్లాస్ లేటెస్ట్ టార్గెట్. ఈ విషయంలో టిడిపి నేతల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా… బలంగా ఎదుర్కోవాలని ఫిక్స్ అయ్యారట. అదే జరిగితే.. 2029 ఎన్నికల నాటికి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న సీట్లకు ఎలాంటి ఢోకా ఉండదని, అదే సమయంలో పార్టీ కూడా బలోపేతం అవుతుందని భావిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో… ఇప్పటికే జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో తమ అవకాశాలు పోయాయని నెత్తీ నోరూ బాదుకుంటున్న టిడిపి ఇన్చార్జ్లకు ఏ రకంగా చెక్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఇప్పటికే జనసేన టిడిపి నేతల మధ్య అధిపత్య పోరు తారా స్థాయిలో ఉంది. పోలవరం, భీమవరం, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లోనూ దాదాపుగా అదే పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో తమ అవకాశాలు పోకుండా ఉండాలంటే… ఇప్పటి నుంచే తమకు అవసరమైన బలాన్ని కూడగట్టుకునేందుకు సిద్ధమవుతున్నారట జనసేన ఎమ్మెల్యేలు. అందుకు లోకల్ ఎన్నికలను లిట్మస్ టెస్ట్గా భావిస్తున్నారు. ఆ రకంగా జనసేన ఎమ్మెల్యేలు చూపిస్తున్న దూకుడు కొనసాగితే…ఓ రకంగా టిడిపి ఇన్చార్జిల రాజకీయ భవిష్యత్తుకు చెక్ పెట్టినట్టేనన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల లెక్కలు వేరుగా ఉంటాయని పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఇప్పటికే సంకేతాలు ఇవ్వడంతో తమ మార్కు రాజకీయాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు జనసేన ఎమ్మెల్యేలు. ఈ లెక్కన మిత్రపక్షాల మధ్య లోకల్ వార్ తప్పకపోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి.

