Site icon NTV Telugu

Off The Record : పార్టీ ఇచ్చిన టార్గెట్ ను ఆ జనసేన నేతలను లైట్ తీసుకున్నారా..?

Jansean

Jansean

ఆ ఉమ్మడి జిల్లాలో జనసేన నేతలు కాస్త తేడాగా ఉన్నారా? పార్టీ అధిష్టానం ఇచ్చిన టార్గెట్‌ను బాగా లైట్‌ తీసుకున్నారా? పనితీరు నిరుటికంటే దారుణంగా పడిపోయిందా? అధిష్టానం ఫైరైనా….. దులిపేసుకుని పోవడం అలవాటు చేసుకున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అధినాయకత్వం వాళ్ళకు ఇచ్చిన టాస్క్‌ ఏంటి? ఫెయిలవడానికి స్థానిక నాయకులు చెబుతున్న కారణాలేంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పరిస్థితి విచిత్రంగా ఉందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. జిల్లా నేతల పేర్లు రాష్ట్ర స్థాయిలో మోగిపోతున్నా…. సభ్యత్వ నమోదు మాత్రం చతికిలపడుతోందని ఇటు కేడర్‌, అటు లీడర్స్‌లో చర్చ నడుస్తోంది.. గత ఎన్నికల్లో తిరుపతి నియోజవర్గం నుండి పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు ఆరిణి శ్రీనివాసులు. ఇక అప్పటి నుంచి జిల్లాలో జనసేన పరిస్థితి మారిపోతుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే నిరుడు సభ్యత్వ నమోదులో జోష్‌ కనిపించింది. ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తారని భావించిన పార్టీ పెద్దలకు జిల్లా నేతలు షాకిచ్చారట. లక్ష్యానికి దరిదాపుల్లో కూడా లేరంటూ పార్టీ పెద్దలు ఫైర్‌ అయినట్టు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జనసేన సభ్యత్వ నమోదు లక్ష్యం 85 వేలు అయితే వారం క్రితం వరకు 35 వేలు కూడా అవలేదట. దీంతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్‌ పెట్టి జిల్లా లీడర్స్‌కు తలంటేసినట్టు తెలిసింది. అధిష్టానం ఆదేశాల ప్రకారం గడువులోగా టార్గెట్‌ రీచ్‌ అవ్వాల్సిందేనని హెచ్చరించినట్టు తెలిసింది. ఈనెల 1న పార్టీ ముఖ్య నేత, మంత్రి మనోహర్ స్వయంగా తిరుపతి వచ్చి పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభ్యత్వ నమోదు లక్ష్యాలను నిర్దేశించారు. అయినా తిరుపతి మినహా మరెక్కడా లక్ష్యాన్ని చేరుకోకపోగా…. గతంతో పోలిస్తే తక్కువ అని చెబుతున్నారు సీనియర్‌ నేతలు.

అందుకే తాజా టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మనోహర్‌ జిల్లా నేతలకు సీరియస్‌గానే క్లాస్‌ పీకినట్టు తెలిసింది. పార్టీ అధికారంలో వుండడం, పలువురికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన క్రమంలో అంతా ఏం చేస్తున్నారంటూ పార్టీ పెద్ద సీరియస్‌ అయినట్టు సమాచారం. అధినాయకత్వపు అంచనాలు తల్లకిందులవడంపైనే ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జనసేనలో చర్చ జరుగుతోంది. తిరుపతిలో పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ఏపీ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు.అలాగే పార్టీ నేత కొట్టే సాయి ప్రసాద్‌ శ్రీకాళహస్తీశ్వర ఆలయయ ట్రస్టు బోర్డు చైర్మన్ పోస్ట్‌లో ఉన్నారు. అయినాసరే…. సభ్యత్వ నమోదు పరిస్థితి దారుణంగా ఉందంటూ అధిష్టానం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సూళ్ళూరుపేటలో పార్టీ ఇంచార్జి ప్రవీణకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. అక్కడా అదే పరిస్థితి ఆట.

మిగిలిన సెగ్మెంట్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. తిరుపతికి ఎమ్మెల్యే, సూళ్ళూరుపేటకు ఇన్ఛార్జ్‌ తప్ప…. మిగతా సెగ్మెంట్లకు ఆ బాధ్యులు కూడా లేరు. రాష్ట్ర స్థాయి నేతగా రోజుకో ప్రెస్ మీట్‌తో హడావిడి చేసే కిరణ్ రాయల్ సైతం అంతవరకే పరిమితం అయ్యారు తప్ప సభ్యత్వ నమోదుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదని అంటున్నారు. కేవలం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌ పేరిట నాయకులు పార్టీ ఉనికి కాపాడుతున్నారు తప్ప… బలం పెంచుకునే ప్రయత్నం చేయడం లేదన్నది జనసేన అధిష్టానం అభిప్రాయం. అయితే జిల్లాలోని పలువురు నేతలు ఆసక్తి చూపకపోవడానికి పదవులు రాకపోవడమే కారణమన్న చర్చ సైతం ఉంది. చాలామంది నాయకులు పదేళ్లకు పైగా…. ఇంకా చెప్పాలంటే ప్రజారాజ్యం టైం నుంచి గట్టిగా కష్టపడ్డారు. పార్టీ వ్యవహారాల యాంగిల్‌లో కొందరి మీద పాతిక దాకా కేసులు ఉన్నాయి. అయినా సరే… పెద్దలు గుర్తించకుండా, పదవులేవీ ఇవ్వకుంటే మాకు మాత్రం ఆసక్తి ఏముంటుందన్నది వాళ్ళ మాట. ఈ పరిస్థితుల్లో… జిల్లా నాయకులు సభ్యత్వ నమోదు టార్గెట్‌ను ఎంత వరకు రీచ్‌ అవుతారో చూడాలి.

Exit mobile version