హైదరాబాద్లో పొలిటికల్ ఫ్యామిలీ స్టార్స్కు దిక్కులేకుండా పోయిందా? తండ్రులు ఓ వెలుగు వెలిగిపోగా… వారసులు ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతున్నారా? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ వాళ్ళని లైట్ తీసుకున్నాయా? ఫేడౌట్ అయిపోవడానికి కారణం వాళ్ళలో సత్తా లేకపోవడమా? లేక పార్టీల పట్టింపులేని తనమా? ఎక్కడుంది లోపం? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగబోతున్న టైంలో… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతల వారసుల వైపు మళ్లుతోంది చర్చ. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అంటే…పి.జనార్ధన్రెడ్డి, ముఖేష్ గౌడ్ పేర్లు వినబడేవి. అంతలా వాళ్లు తమ ముద్ర వేసుకున్నారు. కానీ… వాళ్ళ వారసుల రాజకీయ జీవితంపై మాత్రం ఇప్పుడు నీలి నీడలు అలుముకున్నాయి.
పార్టీని నిలబెట్టిన నేతల పిల్లలకు ఇప్పుడు పార్టీ అండగా నిలబడటం లేదా..? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు పీజేఆర్ రాజకీయ వారసుల పరిస్థితి ఏంటి..? ముఖేష్ గౌడ్ వాసుల పరిస్థితి ఏంటి..? అంటూ మాట్లాడుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్లో. హైదరాబాద్ రాజకీయాల మీద తనదైన ముద్రవేయడంతో పాటు… మంచి మాస్ లీడర్ ఇమేజ్ సంపాదించుకున్నారు పి.జనార్ధన్రెడ్డి. ఆయన వారసులుగా విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు…గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో పార్టీ టిక్కెట్ని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యకే ఇవ్వడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో… విష్ణు భవిష్యత్ ప్లానింగ్ ఏంటన్నది చర్చనీయాంశమైంది.
వచ్చే ఎన్నికపై ఆయన ఆశతో ఉన్నా…. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకే దక్కుతుందన్న గ్యారంటీ లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆమె మీద గెలిచిన నాటి బీఆర్ఎస్ అభ్యర్థి…. దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. విజయారెడ్డి ప్రస్తుతం కార్పొరేటర్గానే కొనసాగుతున్నారు. రాజకీయంగా ఆమె భవిష్యత్ ఏంటన్నది క్లారిటీ లేదు. పీజేఆర్ లాంటి బలమైన నాయకుడి వారసులు సరిగా రాణించలేక ఇలా వెనుకబడిపోతున్నారా? లేక పార్టీ వాళ్ళకు సరైన ప్లాట్ఫాం కల్పించలేకపోతోందా అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. మరో సీనియర్ కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుల పరిస్థితి కూడా అంతే. ముఖేష్ కుమారుడు విక్రమ్…. తనకు కాంగ్రెస్లో ప్రాధాన్యత దక్కలేదని..బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఆశించిన పదవులు లేవు. దాంతో… కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీకి ప్రయత్నం చేసినా బ్రేక్లు పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్ ఉప ఎన్నికల సందర్భంగా తన అనుచరులతో భేటీ అయ్యారాయన. ముఖేష్ గౌడ్ పాత టీంతో మీటింగ్ పెట్టుకున్నారు. రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నారట ఆయన. మొత్తంగా…ఒకప్పుడు గ్రేటర్ లో కీలకంగా పని చేసిన నాయకుల వారసులు ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతున్నారు.
