OTR : గెలిచింది గుంతకల్లు.. ఫోకస్ మాత్రం ఆలూరుపై? గుమ్మనూరు జయరాం వ్యూహం ఏంటి?

Aluru

Aluru

ఊరు కానీ ఊరు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేతకు.. సొంతూరు పై మమకారం పోయినట్టు లేదు. మనిషేమో ఇక్కడ.. మనసంతా అక్కడ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి వివాదాలతో సావాసం చేస్తున్న ఆయన తన కొడుక్కి బలమైన ప్లాట్ ఫామ్ సిద్ధం చేయాలని చూస్తున్నారట. వలస వచ్చిన ప్రాంతాన్ని కొడుక్కి అప్పజెప్పి… తాను సొంతరూకు వెళ్లాలనుకుంటున్నారట. ఈ విషయంలో చూసేవారికి కన్ఫ్యూజన్ తప్ప ఆయన మాత్రం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారట. ఇంతకీ ఎవరా నేత..? ఆయన ప్లానింగ్‌ ఏంటి..? ఒక్క నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం చేయలేక కొంతమంది ఎమ్మెల్యేలు అల్లాడిపోతుంటే… గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాత్రం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం గుంతకల్లులోనే కాకుండా మొత్తం రాష్ట్రంలోనే గుమ్మనూరు పేరు చెబితే… వివాదాలే గుర్తుకొస్తాయి. వాస్తవంగా గుమ్మనూరుది గుంతకల్లు నియోజవర్గమే కాదు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరు గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా రెండు సార్లు మంత్రిగా పని చేశారు. ఆల్‌ సడెన్‌గా 2024 ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ హయాంలో టీడీపీని, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను ఆయన టార్గెట్ చేసినంతగా మరెవరు చేయలేదేమో. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక వివాదాలకు దారితీశాయి. అయితే అలాంటి గుమ్మనూరు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న కోపంతో వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో ఆయనకు రెడ్ కార్పెట్‌ వేసింది. అయితే… ఆలూరు బెర్త్ ఖాళీగా లేకపోవడంతో అనంతపురం జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. గుమ్మనూరు జయరాం గుంతకల్లుకు రావడం, ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఆయన వివాదాలతో సావాసం చేస్తున్నారు.

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో వైరo పెట్టుకున్నారు. వైసీపీ వారిని అసలు పోటీనే చేయనివ్వబోనని చెప్పడం పెద్ద వివాదానికి దారి తీసింది. అయితే ఇటీవల గుమ్మనూరు జయరాం కాస్త సైలెంట్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయితే, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన గుంతకల్లుపై కాకుండా తన సొంత నియోజకవర్గం ఆలూరు మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట. వాస్తవంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు సొంత నియోజకవర్గాల్లో పనులు చక్కబెట్టడమే కష్టంగా తయారైంది. కానీ గుమ్మనూరు మాత్రం అటు తన సొంత నియోజకవర్గం ఆలూరు, ఇటు గెలిపించిన ప్రాంతమైన గుంతకల్లులో వ్యవహరాలు చక్కబెడుతున్నారట. గుంతకల్లు నియోజకవర్గంలో తన కుమారుడు ఈశ్వర్‌ను ఎక్కువగా ఉంచుతున్నారట జయరాం. పొలిటికల్ వ్యవహారాల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు అన్ని చోట్లా ఆయన ఇన్వాల్వ్‌మెంట్‌ కనిపిస్తోందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అయితే, గెలిపించిన గుంతకల్లుని కాదని.. మళ్లీ ఆలూరు వైపు ఎందుకు జయరాం వెళ్తున్నాడనేది నేతలకు అంతుబట్టడంలేదట. ఆలూరుపై గురిపెట్టిన గుమ్మనూరు జయరాం… వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే అక్కడ్నంచే బరిలో దిగాలనే ఆలోచన చేస్తున్నారట. అదే సమయంలో తన కొడుక్కి కూడా పొలిటికల్ ఏంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నారట. అందుకే తాను సొంత నియోజకవర్గంపై ఫోకస్ చేస్తే… కొడుకుని గుంతకల్లుని బరిలోకి దింపేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. గుమ్మనూరు జయరాంకు సంబంధించినంతవరకు ప్లానింగ్‌ బాగానే ఉన్నా… అది వర్కౌట్ చేయడం అంత ఈజీ కాదనే అభిప్రాయం స్థానికంగా టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరి గుమ్మనూరు జయరాం వ్యూహాలు వర్కౌట్‌ అవుతాయా..? పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉంటుందా..? అనేది చూడాలి.