గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో తెలంగాణ బీజేపీ కాస్త కంగారు పడుతోందా? ఒకవేళ అలా జరిగితే ఎలా…? అంటూ పార్టీ నేతల మధ్య చర్చలు నడుస్తున్నాయా? అలా జరిగినా కూడా ఇబ్బంది ఉండొద్దంటూ ప్లాన్ సిద్ధమవుతోందా? అసలు ఏంటా అలా….? ఎలా జరిగితే తాము ఇబ్బంది పడతామని కాషాయ దళం కంగారు పడుతోంది? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నుంచి ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చని కొందరు, అసలు ఇప్పట్లో ఉండక పోవచ్చని మరి కొందరు అంచనా వేస్తున్నారు. SIR సర్వే ముగిసి కొత్త ఓటర్ లిస్ట్ వచ్చాక ఉండొచ్చు అని కూడా అంటున్నారు.. ఇలా… ఎవరి వాదనలు వారికి ఉన్నాయి తప్ప ఆ విషయంలో ఒక స్పష్టత అయితే లేదు. కానీ… అధికారులు మాత్రం అన్నిరకాలుగా సిద్ధమవుతున్నట్టు సమాచారం. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రేటర్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
దీంతో… కమలం పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మూడు కార్పొరేషన్స్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం గనుక ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే…. ఇక ఆ తర్వాత పెద్దగా టైమ్ ఇవ్వదని, అందుకే ఇక నుంచి ఏ రోజు ప్రకటన వచ్చినా… తాము సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారట తెలంగాణ కమలనాథులు. ఇలా రిజర్వేషన్స్ ప్రకటించి అలా ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే…. అభ్యర్థుల ఎంపిక ఇబ్బంది అవుతుందన్నది బీజేపీ భావన. అదే సమయంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్నేతలకు రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలు లోపాయికారీగా అయినా ముందే తెలిసే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్టే వాళ్ళు సిద్ధమవుతారన్నది కాషాయ నేతల అనుమానంగా చెప్పుకుంటున్నారు.
ఆ మధ్య రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ తంటాలు పడింది.ఇప్పుడు కూడా ప్రభుత్వం ఠక్కున రిజర్వేషన్స్ ప్రకటించి ఎన్నికలకి వెళితే తమకు ఇబ్బంది తప్పదని భయపడుతున్నారట కమలం లీడర్స్. అందుకే… ఆ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలనుకుంటున్నట్టు సమాచారం. అందులో భాగంగానే డివిజన్స్ వారీగా పోలింగ్ బూత్లు, డివిజన్ మ్యాప్స్ మీద దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఆయా డివిజన్స్లో ఉన్న ఓటర్లు, గతంలో అక్కడ బూత్ల వారీగా బీజేపీకి పడ్డ ఓట్లపై విశ్లేషణ నడుస్తోందట. పార్టీ కోసం పనిచేసే సర్వే ఏజెన్సీలు ప్రస్తుతం ఈ పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. పనిలో పనిగా అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని ఆరా తీస్తున్నారట. ఆ వార్డ్ ఎవరికి రిజర్వ్ అవుతుందన్న సంగతి తెలియదు కాబట్టి… ఏ సామాజిక వర్గానికి వస్తే ఆ సామాజిక వర్గం నుండి ఎవరిని పెట్టాలన్న విషయంలో లెక్కలేస్తున్నట్టు సమాచారం. అలాగే…. కొత్త డివిజన్ల వారీగా బీజేపీ పని మొదలు పెట్టిందట. దీన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నట్టు చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. గ్రేటర్ పరిధిలోని ముఖ్య నేతల సమావేశాలు కూడా ఇప్పటికే జరిగాయి. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఆ మీటింగ్స్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. మొత్తం మీద ఆ రకంగా… లాస్ట్ మినిట్ టెన్షన్కంటే… ముందస్తు ప్లానింగే కరెక్ట్ అనుకుంటూ… కంగారుతో కూడిన భయం వల్ల పుట్టుకొచ్చిన అలర్ట్నెస్తో గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ ప్లానింగ్ చేస్తోందట.

