OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?

Ganta

Ganta

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే రియల్ పొలిటీషియన్. ఇప్పుడా సీనియర్ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి అదే చేస్తున్నారట. రాజకీయ చదరంగంలో ఊహించని ఎత్తుగడలు ఎదుర్కొన్న ఆయన డిఫెన్స్ గేమ్ స్టార్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అధినాయకత్వంతో ఢీ కొట్టేకంటే సర్ధుబాటుకు సిద్ధం అవ్వడమే ఉభయతారకమని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మార్పు వెనుక మర్మం ఏంటి…?. అవసరం అయితే సిట్టింగ్ సీటు వదిలేసుకోవడానికి సిద్ధం అయ్యేంత త్యాగం ఎందుకు…? గంటా శ్రీనివాసరావు….ఉమ్మడి విశాఖ జిల్లాలో విక్టరీకి కేరాఫ్ అడ్రస్. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతుక్కోవడం కామన్….కానీ గెలిచే పార్టీని వెతుక్కుని పోటీకి దిగడం ఈ మాజీమంత్రి స్టయిల్. రెండున్నర దశాబ్ధాల పైగా రాజకీయ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఎన్నో చూసిన గంటా……ప్రజల నాడిని ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారనే గుర్తింపు వుంది.కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవన్నట్టు ఈ మాజీమంత్రి కెరీర్లో విజయం అయితే వుంది కానీ కొంత కాలంగా ఊహించని ఎత్తుపల్లాలు ఇబ్బందికరంగా మారాయనే చర్చ జరుగుతోంది. గంటా కంచుకోటగా భావిస్తున్న భీమునిపట్నం స్ధానం మీదే పార్టీ అగ్రనాయకత్వం ఫోకస్ పెంచిందనే ప్రచారం జరుగుతోంది.సందర్భోచితంగానో….సరదా కోసమో తెలియదు కానీ ఈ ఆరు నెలల కాలంలో ఇప్పటి వరకు భీమిలి సీటుపై రెండు సార్లు మార్పు ప్రస్తావన వచ్చింది. గత ఏడాది డిసెంబర్ నెలాఖరున జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ శ్రీభరత్ కలిసి జిల్లా నాయకత్వం అంతా ఐక్యంగానే వుందని ప్రకటించుకునే ప్రయత్నం చేసింది. ఈ బ్రేక్ ఫాస్ట్ మీట్లో వచ్చే ఎన్నికల్లో భరత్ భీమిలి నుంచి పోటీ అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు గంటా రియాక్ట్ అయిన తీరు ఆసక్తికరంగానే కనిపించింది. ఆయన ఎమ్మెల్యేగా వెళితే నేను ఎంపీగా పోటీ చేస్తా అంటూ కొత్త చర్చకు తెరతీశారు ఈ మాజీమంత్రి.

సరిగ్గా ఆరునెలలు తిరిగే సరికి మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. ఇటీవల సిటీ పర్యటనకు వచ్చిన లోకేష్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి. విశాఖలో IT, డేటా సెంటర్లు సహా పెట్టుబడులు, అభివృద్ధి అంతా భీమిలి, భోగాపురం మధ్యే కేంద్రీక్రుతం అవుతోంది. దీంతో శంఖుస్ధాపనలు, ప్రారంభోత్సవాల కోసం లోకేష్ తరచూ వస్తున్నారు. ఈనేపథ్యంలో విశాఖ ఎంపీగా తాను….భీమిలి ఎమ్మెల్యేగా శ్రీభరత్ వెళ్ళడం ద్వారా ఫోకస్డ్ గా పని చేయడానికి ఆస్కారం కలుగుతుందని చమత్కరించారట లోకేష్. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సమక్షంలోనే ఈ ప్రస్తావన రావడం అంతా నవ్వుకుని సరదాగా తీసుకోవడం కనిపించిందట. కానీ, లోపాయికారీగా ఇది ముందస్తు ప్రణా
ళికలో భాగమా..? అనే చర్చ మొదలైంది.

వాస్తవానికి భీమిలి నియోజకవర్గంలో 2009 నుంచి కాపు సామాజిక వర్గానికే పట్టం కడుతున్నారు ఓటర్లు. అయితే, గంటా లేదంటే అవంతిదే గెలుపు. ఇప్పుడు వైసీపీ విజయనగం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ ను ఇక్కడ సమన్వయకర్తగా నియమించింది. మార్పులు వుండకూడదని అధినాయకత్వం భావిస్తే ఆయనే పోటీకి దిగే అవకాశం ఎక్కువ. దీంతో టీడీపీ కూడా ఈసారి ప్రయోగం చేసేందుకు సిద్ధం కావొచ్చు. కీలకమైన స్ధానం నుంచి ఆఖరి నిముషంలో శ్రీభరత్ లేదా మరో కీలక నేత పేరును పరిశీలించవచ్చు. తాను ఎంపీగా వుండటానికే ఇష్టపడతానని శ్రీభరత్ చెబుతున్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి కూటమి సర్ధుబాట్లు 2024 నాటితో పోల్చితే అంత ఈజీగా వుండకపోవచ్చు. ఈ ప్రయత్నం ప్రస్తుతానికి ఊహాగానమే అయినా…సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు….పార్టీ ముఖ్య నాయకత్వం మధ్య ముందు వున్నంత దూరం తగ్గిందనే ప్రచారం ఇటీవల విస్తృతంగా జరుగుతోంది. అవకాశం వచ్చిన ప్రతీసారీ సీఎంతో పాటు పార్టీ నాయకత్వాన్ని కలిసి అభివృద్ధి, పార్టీ బలోపేతం దిశగా గంటా ఎక్కువ ప్రాధాన్యతను తీసుకుంటున్నారు. సందర్భోచితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గట్టిగానే ఎటాక్ చేస్తున్నారు.

ఇంకా ఎన్నికలకు రెండున్నరేళ్ళ సమయం వుండగా అవసరమైతే భీమిలిని వదులుకోవడానికైనా ఈ సీనియర్ నేత సిద్ధం అవుతున్నారనేది మరో చర్చ. దీని వెనుక తనయుడి రాజకీయ భవిష్యత్ కారణంగా కనిపిస్తోంది. టీడీపీలో సీనియర్లు ఒక్కొక్కరుగా వారసులకు ప్లాట్ ఫార్మ్ సిద్ధం చేస్తుండగా ….గంటా కుమారుడు రవితేజ భీమిలిలో పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. తండ్రి అందుబాటులో లేని సమయంలో నాయకత్వాన్ని కలుస్తుండటం… ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు వంటి వాటికి హాజరవ్వడం ద్వారా ఫోకస్డ్ గా పని చేయడం మెదలెట్టారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న జీవీఎంసీ మేయర్ రేసులో రవితేజ వుంటారనే చర్చ జరిగినప్పటికీ గంటా ఆలోచనలు భిన్నంగా వున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అవసరమైతే తాను తప్పుకునైనా సరే తనయుడ్ని ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారట ఈ సీనియర్ నేత. డీ లిమిటేషన్ జరిగితే విశాఖ పార్లమెంట్ రెండు స్ధానాలుగా మారుతుంది…ఒక వేళ అది సాధ్యం కాక పోతే విజయనగరం నుంచైనా బరిలోకి దించాలనే ఆలోచన చేస్తున్నట్టు భోగట్టా. ఈ ప్రయత్నంలో అంతర్భాగంగానే గంటా శ్రీనివాస్ పార్టీ ముఖ్య నాయకత్వానికి ఇటీవల బాగా దగ్గరయ్యేందుకు చూస్తున్నారనే చర్చ విస్తృతమైంది. మొదట్లో ఎంపీ శ్రీభరత్, గంటా మధ్య దూరం పెరిగిందని, దానికి భీమిలి నియోజకవర్గంలో ఆధిపత్యమే కారణం అనే రాజకీయ చ ర్చ నడిచింది. కానీ, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యేలు సన్నిహితంగా మెలుగుతున్నారట. దీంతో భీమిలిలో సంథింగ్ గోయింగ్ టూబీ హ్యాపెనింగ్ అనే చర్చ నెమ్మదిగా ఊపందుకుంటోంది.

1999లో ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్న తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి ఎంపీగా గెలిచిన గంటా… ఆ తర్వాత చోడవరం, విశాఖ నార్త్ నుంచి ఒక్కొక్కసారి,భీమిలి నుంచి రెండుసార్లు టీడీపీ తరపున….ప్రజారాజ్యం అభ్యర్ధిగాఅనకాపల్లి అసెంబ్లీ స్ధానం నుంచి ఒకసారి విజయం సాధించిన అనుభవం వుంది. కెరీర్లో కీలక పదవులు అన్నీ అనుభవించిన ఆయన ఇప్పుడు కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని సన్నిహితుల సమాచారం. ఈ ప్రయత్నంలో తాను తగ్గైనా….రవితేజను నెగ్గించాలనే ఆలోచనలు విస్తృతం అయినట్టు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి తండ్రి చాటు వారసుడు భవిష్యత్ ఎలా వుంటుంది…?. ఒకవైపు,తండ్రి, మరోవైపు మామ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనేది ప్రస్తుతానికి చర్చనీయాంశమే.