ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అంటుకున్న అగ్గి రాజకీయంగా సెగ పుట్టిస్తోందా? మేటర్ ఎక్కడో మొదలై ఇంకెక్కడో ఆగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అత్యంత కీలకమైన కేసులకు సంబంధించిన ఫైళ్ళు కాలి బూడిదైపోయాయా? మరి ఆ కేసుల భవిష్యత్ ఏంటి? ఆ డేటా ఇంకోచోట భద్రంగా ఉందా? లేక అంతే సంగతులా? హార్డ్ కాపీలే పోయాయ్, సాఫ్ట్ కాపీలు భద్రంగానే ఉన్నాయంటున్న పోలీసుల మాటల్లో నిజమెంత? హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ మంటలైతే చల్లారాయిగానీ……వాటిలోనుంచి పుట్టిన రాజకీయ సెగ మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. అసలు ఇది ప్రమాదమే కాదని, ఎవరో కావాలని పెట్టిన మంటలా ఉందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. అయితే… పోలీసులు కూడా అంతే దీటుగా ఆ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. ఏ ఫైలూ ఎక్కడికీ పోలేదు. అన్నీ భద్రంగానే ఉన్నాయన్నది అఫీషియల్ వెర్షన్.
అయితే.. ఇక్కడే ప్రతిపక్షం కొన్ని సహజమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. మంటలు ఆ స్థాయిలో మూడు నాలుగు గంటల పాటు నాన్స్టాప్గా ఎగిసిపడితే.. ఫైల్స్ కాలిపోకుండా ఎలా ఉన్నాయి..? దాన్ని మేమెలా నమ్మాలన్నది ప్రతిపక్షం క్వశ్చన్. ఆ ప్రశ్నకు ఆన్సర్ టెక్నికల్గానే ఉందంటున్నారు పోలీసులు. ఏ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడికీ పోలేదని, కాలిపోయింది కేవలం హార్డ్ కాపీలే తప్ప సాఫ్ట్ కాపీల్లో ఉన్న సాక్ష్యాధారాలు ఎక్కడికీ పోలేదని చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఏ కేసు దర్యాప్తునకు ఆటంకం కలగబోదని చెబుతోంది పోలీస్ డిపార్ట్మెంట్. అసలీ గొడవంతా ఎందుకంటే…. 2015లో నమోదైన ఓటుకు నోటు కేసు చుట్టూ తిరుగుతోంది వ్యవహారం. ఆ కేసులో ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయని హరీష్రావు లాంటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే… ఆ విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదని అన్నారు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖాగోయెల్.
ఆ కేసుకు సంబంధించి మొత్తం 16 మెటీరియల్స్ కాలిపోయినా…. వాటిని 2021 లోనే ఏసీబీకి అందజేశాం కాబట్టి ఇబ్బందేం ఉండబోదని చెప్పారు. రిపోర్టులు అన్నింటినీ ఏసీబీకి సబ్మిట్ చేశామని, కేసుకు సంబంధించిన ఆధారాలకు ఎలాంటి నష్టం లేదన్నారు. అలాగే….. 2024లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి.. 136 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్కు వచ్చాయని, ఇందులో కేవలం 7 మెటీరియల్స్ మాత్రమే కాలిపోయాయన్నారు శిఖాగోయెల్. వీటిని కూడా త్వరలోనే రిట్రీవ్ చేస్తామని అంటున్నారు. దీనిపై అటు డీజీపీ శివధర్రెడ్డి కూడా స్పందించారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కేవలం హార్డ్ కాపీలు మాత్రమే ధ్వంసమయ్యాయని, ప్రతీ రిపోర్ట్కు సంబంధించి సాఫ్ట్ కాపీ తమ దగ్గర ఉందని చెప్పారాయన. కీలకమైన ఫైల్స్ ఏవీ కాలిపోలేదని, ఒకవేళ ఒకటీ అరా ధ్వంసం అయినా… ప్రతి డిటైల్ని రిట్రీవ్ చేస్తాం కాబట్టి నో వర్రీస్ అన్నది డీజీపీ మాట. ఈ భరోసా, టెక్నికాలిటీస్ సంగతి ఎలా ఉన్నా… రాజకీయంగా మాత్రం ఈ ఘటన చుట్టూ వివాదం పెరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం దీన్ని ఇక్కడితో వదిలేస్తుందా? లేక ఇంకా ముందుకు తీసుకువెళ్తుందా? అదే జరిగితే అధికార పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో.
