తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… వన్ షాట్, మెనీ బర్డ్స్ అన్నట్టుగా వ్యవహరించారా? ఒకే ఒక్క పోస్టింగ్తో చాలా సమస్యలకు చెక్ పెట్టేలా ప్లాన్ చేశారా? ఇప్పుడున్న అనేక ఇబ్బందులకు సర్వరోగ నివారిణి అదేనని నమ్మారా? అసలు ఏంటి ఆయన వ్యూహం? ఏ నియామకంతో ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం చుట్టూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ ఆయన్ని వ్యూహాత్మకంగా నియమించారా..? అన్న పాయింట్ చుట్టూనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. తదుపరి సీఎస్ ఎవరంటూ… ఇన్నాళ్ళు ఇక్కడున్న అధికారుల చుట్టూతే మాటలు నడుస్తుంటే… ఎవ్వరూ ఊహించని విధంగా ఢిల్లీ నుంచి తెచ్చుకోవడం ఏంటంటూ సచివాలయ వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయట. దాని వెనక సీఎం వ్యూహం ఏంటన్నది ఎవరికీ అంతు చిక్కడంలేదు. అసలు… కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజును తెలంగాణకు రప్పించే వరకు కూడా వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. ఆ వ్యవహారం అలా ఉంటే…కొత్త సీఎస్ నియామకంతో చాలా సమస్యలకు చెక్ పెట్టినట్టు అవుతుందన్న ఆలోచన ప్రభుత్వ పెద్దలకు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా…సచివాలయం నుంచి జరిగే లీకులకు బ్రేకులు పడబోతున్నాయని అంటున్నారు. ప్రభుత్వ ఆలోచనలు అమలులోకి రాకముందే… ప్రతిపాదన దశలోనే బయటకు వచ్చి ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారిన సందర్భాలున్నాయి.
దీంతో… రాజకీయంగా కూడా ఇబ్బంది పడ్డారు సర్కార్ పెద్దలు. ప్రత్యర్ధి పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న అధికారుల వల్లే కీలకమైన సమాచారం లీక్ అవుతున్నాయనే ఫీలింగ్ చాలా మంది మంత్రుల్లో సైతం ఉంది.. దీంతో లోకల్ లింక్లు లేకుండా ఢిల్లీ నుంచి రప్పించుకుంటే లీకేజీల బెడద పోతుందని భావిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా అప్పగించిన పనిని కమిట్మెంట్తో, వేగంగా
పూర్తి చేస్తారనే పేరుంది సంజయ్ జాజుకి. ఆయన స్టేట్లోకి ఎంటరవక ముందే పని మొదలుపెట్టారన్నది ఇంటర్నల్ టాక్. మూసీ రివర్ ఫ్రంట్ కోసం తమ భూముల్ని అప్పగించేందుకు ఇటీవల రక్షణ శాఖ అంగీకరించింది. అందులో జాజు కీలక పాత్ర పోషించారని సమాచారం. కేంద్ర సర్వీసులో పని చేయడం వల్ల అక్కడున్న పరిచయాలతో తెలంగాణకు రావాల్సిన నిధుల్ని రప్పించడం, కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపుల్లాంటి అంశాల్లో కలిసి వస్తుందనే భావన కూడా ప్రభుత్వానికి ఉంది. చీఫ్ సెక్రెటరీగా అన్ని శాఖలను సమన్వయం చేయడంతో పాటు.. పెండింగ్ పనుల్లో వేగం పెంచడం…లీకేజీల కట్టడి కూడా దోహదపడతారనే ఆలోచన ప్రభుత్వ పెద్దలకు ఉందట. అలాగే… జిల్లా కలెక్టర్లను పరుగులు పెట్టించి పనులు చేయిస్తారన్న భరోసా కూడా ఉందని చెబుతున్నారు. రేవంత్ సర్కార్కు రాబోయే రెండున్నరేళ్ళు చాలా కీలకం. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు…అడ్మినిస్ట్రేషన్ పరమైన స్పీడ్ పెరగాల్సి ఉంది. ఇలాంటి రకరకాల సమస్యల్ని ఒక్క CS నియామకం తో క్లియర్ చేసుకున్నారనే అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. అలాగే సంజయ్ జాజు 2029 వరకు సర్వీసులో ఉంటారు. దీంతో గ్యాప్లు కూడా ఎక్కడా ఉండకుండా చూసుకునే వెసులుబాటు ఆయనకు ఉంటుందనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి ఉన్నట్టు తెలిసింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నది మామూలేగానీ…ఒకే దెబ్బకు చాలా పిట్టలన్నది తాజా పరిణామం అంటున్నారు. వోవరాల్గా ఒక్క పోస్టింగ్తో సీఎం రేవంత్ చాలా సమస్యలకు పరిష్కార మార్గం కనుగొన్నారన్నది తెలంగాణ పొలిటికల్ టాక్.

