OTR : తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ టెన్షన్

Congress

Congress

గడువు ముగుస్తోంది… టైం దగ్గర పడుతోంది…. క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం కామ్‌గా ఉన్నారు. ఏం జరగబోతోంది…? అసలేం జరగబోతోంది…? మేరా నంబర్‌ కబ్‌ ఆయేగా? అంటూ కాంగ్రెస్‌ నాయకులు తెగ టెన్షన్‌ పడుతున్నారట. వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కోరకమైన కంగారు అయితే… అందరిలోనూ భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరువాళ్లు? ఎందుకు అంతలా టెన్షన్‌ పడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు చాలామంది ప్రస్తుతం బాగా టెన్షన్‌లో ఉన్నారట. అందుకు కారణం కొందరిది భయమైతే….. మరికొందరిది ఆశ. ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళయినా… పదవులు భర్తీలో జాప్యం ఎందుకన్నది కొంత మంది క్వశ్చన్‌. అలాంటి వాళ్ళంతా నాకెప్పుడూ పదవి వస్తుందంటూ ఆశగా చూస్తున్నారు. ఎంత చూసినా… ఇంకా ముందుకు రావడంలేదు, కాలం గడిచిపోతోందన్నది వాళ్ళ టెన్షన్‌. ఇందులో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేసిన నాయకులు సైతం ఉన్నారు. ప్రతిసారి… ఈ నెల, వచ్చే నెల అంటూ గడువు పెడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌. క్యాలెండర్‌లో పేజీలు మారుతున్నాయిగానీ.. మాకు మాత్రం పదవులు దక్కడం లేదని కంగారు పడుతున్నారు నామినేటెడ్ పదవుల ఆశావహులు. నాయకుల్ని డిజప్పాయింట్ చేయడం కాకపోతే… ఇదేంటన్న వాదన సైతం పార్టీలో ఉంది. ఇటీవల కొన్ని కులాల ప్రాతిపదికన కార్పొరేషన్‌లు, ఫెడరేషన్స్‌కు చైర్మన్స్‌ని నియమించారు. కానీ… మిగిలిన వాటి సంగతి ఏంటన్నది బిగ్‌ క్వశ్చన్. అటు ప్రభుత్వం వచ్చిన మొదట్లో 37 మంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని కట్టబెట్టింది. ఈ నెలాఖరుతో వాళ్ళ పదవీకాలం కూడా పూర్తి కావస్తోంది. దీంతో వాళ్ళంతా కూడా రెన్యువల్‌ కోసం టెన్షన్‌గా చూస్తున్నారు. వాళ్ళలో ఎంత మందికి ఎక్స్‌టెన్షన్‌ ఇస్తారు, ఎందర్ని పక్కనపెడతారన్న చర్చలు సైతం ఉన్నాయి. ఇక ప్రభుత్వం గనక కసరత్తు మొదలుపెట్టి భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తే… పాత పోస్ట్‌లు 37, కొత్తగా మరో 20 నుంచి 25 మందికి కార్పొరేషన్ చైర్మన్‌ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది.

అటు ఇటుగా 100 మంది నాయకులను నామినేటెడ్ పోస్టుల్లో అకామిడేట్ చేయాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. అయితే ప్రస్తుతం పదవుల్లో ఉన్న 37 మంది నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఇటీవల 12 నుంచి 13 మంది కార్పొరేషన్ చైర్మన్ లకు సంబంధించిన వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. దాంతో నివేదిక కోరిన జాబితాలో ఉన్న వాళ్లను కొనసాగించే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. కానీ… సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉందన్నది ఎవరికీ అంత చిక్కటం లేదు. ఇప్పుడున్న వారిలో 5 లేదంటే ఆరుగురికి మాత్రమే రెన్యువల్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ కోసం పనిచేయడం మానేశారని.. కేవలం ప్రోటోకాల్‌ని ఎంజాయ్ చేస్తున్నారన్న అభిప్రాయం పెద్దల్లో ఉందట. కేవలం పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్న వాళ్ళకే ఛైర్మన్‌ పదవుల రెన్యువల్ ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన అరడజన్‌కు మించి రెన్యువల్స్‌ ఉండకపోవచ్చని అంటున్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, అన్వేష్ రెడ్డి, మెట్టు సాయికుమార్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్ .. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని మాత్రమే కొనసాగించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. పదవుల భర్తీ… రెన్యువల్ విషయంపై త్వరలోనే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వారంలో దీనిపై కసరత్తు జరగవచ్చన్నది పార్టీ వర్గాల మాట. మొత్తానికి గడువు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులకుల్లో టెన్షన్ పెరిగిపోతోందట. కొనసాగిస్తారా లేదా అని పదవుల్లో ఉన్నవాళ్లు, ఇప్పుడు కాకుంటే ఇక పదవి రాదని ఆశావహులు కంగారుగా ఎదురు చూస్తున్నారు.