తెలంగాణ సీఎం…. బడేభాయ్తో యుద్ధానికి సిద్ధమయ్యారా? ధాన్యం కొనుగోలు విషయంలో డెడ్లైన్ పెట్టడం వెనకున్న వ్యూహం ఏంటి? కేంద్రంపై వరుసగా చేస్తున్న మాటల దాడి వెనక ప్లాన్ ఏదైనా ఉందా..? తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటేనన్న సంకేతాలు ఇస్తున్నారా? కేంద్రంతో సఖ్యత కోరుకుంటాంగానీ… రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం పణంగా పెట్టబోమని క్లారిటీ ఇచ్చేస్తున్నారా? అసలు రేవంత్రెడ్డి కొత్త గేమ్ ప్లాన్ ఏంటి?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్గా వరుస కామెంట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఇటీవల మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కావచ్చు… అదిలాబాదులో జరిగిన సభలో కావచ్చు కేంద్ర ప్రభుత్వంతో పాటు అందులో భాగమైన కిషన్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రస్తావించి సవాల్ విసిరారు సీఎం. తెలంగాణ నుంచి వరి, మొక్కజొన్న, సన్ఫ్లవర్ను పూర్తిస్థాయిలో కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈనెల 15 వరకు రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారాయన. అలాగే… రాష్ట్రం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం కూడా పూర్తిస్థాయిలో తీసుకోవాలని ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి చూస్తుంటే…. కేంద్రం పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా… రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్న ఇండికేషన్ ఇచ్చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. 15 తర్వాత సంగతి తెలుస్తానంటూ కేంద్రంపై మొదటిసారి తన మాటల వాడి పెంచడాన్ని ప్రత్యేకంగానే చూడాలని అంటున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. అక్కడక్కడా రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ఉన్న వనరులన్నింటిని వినియోగించి పని చేస్తున్నట్టు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈనెల జూన్ రెండో వారంలోపు పూర్తిగా ధాన్యాన్ని కొనేయాలని డిసైడ్ అయింది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు కల్లాల్లో తిరిగి ఆందోళన చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారట. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్ని వనరులను ఉపయోగించి ధాన్యం కొంటుంటే… కేంద్రం నుంచి సహకారం లేకపోగా… రాజకీయం చేస్తున్నారనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది.
అటు చత్తీస్గఢ్, పంజాబ్ లాంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్రం తీసుకుంటోంది. కానీ తెలంగాణలో మాత్రం కోత విధిస్తోందన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అభ్యంతరం. ఈ క్రమంలో… బీజేపీ నేతల ఆందోళనలతో సీఎం కొత్త యాక్షన్ ప్లాన్ కి సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది. ఈనెల 15 తర్వాత ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణ మొదలుపెట్టాలని సీఎం భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దాంట్లో భాగంగానే వరుసగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారట. రాష్ట్రంలో ధాన్యాన్ని కొనాలని వత్తిడి పెంచిన కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీ… వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో ఎందుకు తీసుకోవడం లేదంటూ ఆందోళనలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా క్షేత్ర స్థాయిలో బీజేపీ నేతల ఇళ్ళ ముందు ధాన్యం పోస్తామంటూ కేడర్కి ఇండికేషన్ ఇచ్చారు. అదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణకి కూడా ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీంతో….తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్నారా..? లేక ఒత్తిడి పెంచే క్రమంలో తన వాదానికి పదును పెడుతున్నారా..! అనేది త్వరలోనే క్లారిటీ రావచ్చంటున్నారు. ఛోటే భాయ్… బడే భాయ్… అంటూ గతంలో ఆయన చేసిన కామెంట్స్తో రాష్ట్రంలోని కొన్ని పక్షాలు… రేవంత్ రెడ్డి కేంద్రంతో కుమ్మకయ్యారని విమర్శించాయి. ఈ క్రమంలో సీఎం ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
