సిక్కోలు టీడీపీ లీడర్స్కు సీఎం చంద్రబాబు సీరియస్గా క్లాస్ తీసుకున్నారా? అంతర్గతంగా పార్టీతో పాటు మిత్రపక్షాలతో వస్తున్న విభేదాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారా? మరి సార్…. చెప్పారు, మేం తలూపామన్నట్టుగానే వ్యవహారం మిగిలిపోతుందా..? లేక నేతల వైఖరి మారుతుందా? ఇంతకీ…. శ్రీకాకుళం నాయకులకు ఏం చెప్పారు చంద్రబాబు, దాని గురించి టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనల్లో అభివృద్ది – సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలుగుదేశం పార్టీ పటిష్టత మీద కూడా దృష్టి పెడుతున్నారు. తమ నేతల మధ్య ఉన్న అసంతృప్తులు, ఆధిపత్య పోరుకు చెక్ పెట్టడంతో పాటు కూటమి పార్టీలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతున్నారు. ఈ క్రమంలోనే…. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించిన చంద్రబాబు… ఈ నియోజకవర్గ టీడీపీలోని లుకలుకలపై దృష్టి పెట్టారట. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్ని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్ళారు.
దీంతో నరసన్నపేట టీడీపీలో గ్రూప్స్కు చెక్పెట్టి అంతా కలసికట్టుగా వెళ్ళాలని ఆదేశించారు సీఎం. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్దితి ఉందని. వీటన్నింటి మీద కూడా దృష్టి పెడతానని ఎమ్మెల్యేలతో గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఎమ్మెల్యేలతో కుశల ప్రశ్నలు వేస్తూనే…. సుతిమెత్తగా క్లాసులు తీసుకున్నట్టు తెలిసింది. పాతపట్నం, ఇచ్చాపురం, నరససన్నపేట నియెజకవర్గాల్లోని పరిస్థితులను స్థానిక ఎమ్మెల్యేలకే బాబు చెప్పడంతో వాళ్ళు షాకయ్యారట. మీరు మారాలి, ప్రజల కోణంలో ఆలోచించాలంటూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సూచించినట్టు సమాచారం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీలు మూడు పటిష్టంగా ఉన్నాయి. వేటికి అవే మరింతగా బలపడే ప్రయత్నంలో ఉన్నాయి. దీంతో అంతర్గతంగా కేడర్ మధ్య విభేదాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
చాపకింద నీరులా బీజేపీని బలోపేతం చేస్తున్నారట స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు. దీంతో… టీడీపీ వాళ్ళే ఎక్కువగా బీజేపీ వైపు మళ్ళుతున్నట్టు కనిపిస్తోందన్న ఆందోళన ఆ సెగ్మెంట్లో వ్యక్తం అవుతోందట. మరో వైపు ఎచ్చెర్లలో ఉన్న లీడర్ షిప్ గ్యాప్ను ఫిల్ చేయటానికి జనసేన ముఖ్యనేత నాగబాబు తరచూ వస్తున్నారు. దీంతో మిగతా మిత్రపక్షాలతో ఆ పార్టీ కేడర్కు గ్యాప్ ఎక్కువ అవుతోందని చెప్పుకుంటున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో పాటు శ్రీకాకుళం పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాల విషయంలో జనసేనను విస్మరించడాన్ని ఆ పార్టీ నేతలు బాబు దృష్టికి తీసుకువెళ్ళారట. దీంతో…. జిల్లా అగ్రనేతలు అచ్చెన్నాయుడు , రామ్మోహన్ నాయుడు దీనిపై దృష్టి సారించాలని , కూటమి పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినా అంతర్గతంగా సర్దుబాటు చేసుకుని అవి బయకు రాకుండా చూసుకోవాలని సూచించినట్టు తెలిసింది.
కూటమిలో విభేదాలు తరచూ బయటపడుతుండటం, తాజాగా కాపులు ర్యాలీ నిర్వహించడంపై కూడా ఆరా తీశారట చంద్రబాబు. జిల్లా స్థాయిలో సమస్యలు వస్తే… ఎక్కడికక్కడ పరిష్కరించుకోవాలి తప్ప… వాటిని పెద్దవి చేసి కొత్త సమస్యలు సృష్టించ వద్దంటూ లోకల్ లీడర్స్ సీఎం హితబోధ చేసినట్టు తెలిసింది. దీంతో… సిక్కోలు ఎమ్మెల్యేలు , బడానేతలకు బాబు చేసిన సూచనలు, హెచ్చరికలు ఎంత వరకు పని చేస్తాయన్న చర్చలు నడుస్తున్నాయి. ప్రతి ఆరు నెలలకు ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును సమీక్షిస్తున్న చంద్రబాబు…. ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సమస్యల పరిష్కారంపై దృష్టి సారింస్తున్నారు.
