ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి. ఎంత చించుకున్నా… అంతే కూలి. ఆ మాత్రానికి ఎందుకయ్యా ఆత్రం. సహజంగా ఉద్యోగ వర్గాల్లో ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. ప్రత్యేకించి వేతనాల విషయంలో అసంతృప్తి ఉన్నప్పుడు బాగా బయటపడుతుంటారు. కానీ… ఆ నియోజకవర్గంలో ఏకంగా ఒక రాజకీయ నాయకుడి మీదే ఇలాంటి మాటలతో సెటైర్స్ వేస్తున్నారట. ఎవరా నాయకుడు? నీ కష్టానికి సరైన ఫలితం దక్కదని సాటి నేతలే ఎందుకు అంటున్నారు? వైసీపీకి పట్టున్న చింతలపూడి నియోజకవర్గంలో రోజుకో రకంగా పుట్టుకొస్తున్న ప్రచారంతో ఇక్కడి పార్టీ నేతలు అయోమయంలో పడిపోతున్నారట. ఈ రిజర్వ్ సీటు ఫ్యాన్ పార్టీని నిన్న మొన్నటివరకు వర్గపోరు వేధించింది. దాన్నుంచి బయట పడ్డాం రా బాబూ అనుకునే లోపే… వచ్చే ఎన్నికల్లో మనకు సీటు ఉంటుందా లేదా అన్న భయం వెంటాడుతోందట ఇన్ఛార్జ్ని. దీంతో అధినేత ఇస్తున్న ఆదేశాలను పాటించి పార్టీని బలోపేతం చేయాలా.. లేక వచ్చే ఎన్నికల్లో జరిగే మార్పులు చేర్పుల వ్యవహారం తేలేవరకు ఎదురు చూడాలా అన్న గందరగోళంలో ఉన్నట్టు తెలిసింది. గత నియోజకవర్గాల పునర్విభజనలో చింతలపూడి ఎస్సీ రిజర్వ్ అయింది. అయితే…ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ఎమ్మెల్యే అయినా… స్థానికంగా బలమైన సామాజికవర్గాల నేతలు చెప్పినట్టే నడుచుకోవాలని, లేదంటే అభ్యర్థి మార్పు తప్పదని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. ఇందుకు ఉదాహరణగా 2014లో టిడిపి తరఫున గెలిచిన పీతల సుజాత, 2019లో వైసీపీ తరఫున గెలిచిన ఉన్నమట్ల ఎలిజాను చెబుతుంటాయి స్థానిక రాజకీయవర్గాలు. ఈ క్రమంలోనే 2029 ఎన్నికలకు సంబంధించి ఇంకో కొత్త రకమైన అనుమానం, భయం లాంటివి వైసీపీ నేతల్ని వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఎన్నికల నాటికి మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…. చింతలపూడి ఎస్సీ కోటాలోనే ఉంటుందా లేక అన్ రిజర్వ్డ్ అవుతుందా అన్నది ఇక్కడి ఫ్యాన్ నేతల డౌటనుమానం. అందుకే అడుగు ముందుకు వేయలేకపోతున్నారట. సీట్ల పెంపు జరిగితే.. ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా… చింతలపూడి మాత్రం కచ్చితంగా జనరల్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో నియోజకవర్గ పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనే లెక్కలు కూడా ఇప్పటి నుంచే వేస్తున్నారట నాయకులు. ఉమ్మడి జిల్లాలో భౌగోళికంగా పోలవరం తర్వాత పెద్ద నియోజకవర్గం చింతలపూడి. అందుకే… క్లారిటీ లేకుండా ఇప్పటినుంచే కష్టపడి చేసినా… రేపు జనరల్ అయితే… ఎవరికోసమో మనం ఖర్చు పెట్టుకుని, కష్టపడ్డట్టు అవుతుందన్నది స్థానిక వైసీపీ నేతల భావనగా తెలుస్తోంది. లోకల్ పార్టీలోని వర్గపోరును చచ్చీచెడీ దారికి తెచ్చినప్పటికీ పోటీ చేసే అవకాశం మనకే ఉంటుందా లేదా అన్న అనుమానం ఇన్చార్జ్ విజయరాజులో బాగా పెరిగిపోతోందట. ఆ డౌట్ను అలా ఉంచి పార్టీ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నప్పటికీ.. సైడ్ క్యారెక్టర్స్ నుంచి ఆయనకు సెటైర్స్ మాత్రం తప్పడం లేదని అంటున్నారు. ఇప్పుడు మీరెంత ఎగిరెగిరి దంచినా, తెగ చించుకున్నా….వచ్చే ఎన్నికల్లో చింతలపూడి జనరల్ కాక తప్పదంటూ వైసీపీలో ఉన్న మరో వర్గం వెటకారం చేస్తోందట. మరింత వివరంగా చెప్పాలంటే… వైసీపీలో ఉంటూనే అంటీ ముట్టనట్టుగా ఉన్న మాజీ ఎంపీ శ్రీధర్ వర్గమే ఇలాంటి ప్రచారానికి తెరలేపుతోందని చెబుతున్నారు కార్యకర్తలు. ఇలాంటి ప్రచారాలతో పార్టీ కోసం కష్టపడి పనిచేద్దామనుకున్న వాళ్ళలో కూడా గందరగోళం పెరుగుతోందట. ఓటమి తర్వాత పార్టీని రీసెట్ చేసి, క్యాడర్లో ధైర్యం నింపడం కోసం ఇన్చార్జి కష్టపడుతుంటే… అసలు నీకు సీటు ఉంటుందా లేదా అన్న ప్రశ్నలు, ప్రచారాలతో విజయరాజుకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. వాస్తవానికి చింతలపూడి వైసీపీకి వర్గ విభేదాలు కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడే వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న ఎక్స్పీరియెన్స్ ఇక్కడి లీడర్స్ది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా… సేమ్ సీన్ కంటిన్యూ అవుతోందట. ఇలాంటి వ్యవహారాలు మార్చుకోనంత కాలం నియోజకవర్గంలో పార్టీని కాపాడ్డం సాధ్యమేనా అన్నది కేడర్ క్వశ్చన్.

