OTR : BRS కొత్త వ్యూహం.. కాంగ్రెస్‌కు చుక్కలు చూపించబోతున్నారా?

Brs

Brs

బీఆర్‌ఎస్‌ చేతికి కొత్తగా రెండు వైపులా పదునున్న కత్తి చిక్కిందా? ఏ మాత్రం ఛాన్స్‌ మిస్‌ అవకుండా… దాన్ని గట్టిగా వాడేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసిందా? ఎట్నుంచి ఎటు చూసినా… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, తమకు లాభం కలిగేలా ఉన్న ఆ వెపన్‌తోనే తిరిగి పుంజుకోవాలని భావిస్తోందా? ఇంతకీ ఏంటా ఆయుద్ధం? బీఆర్‌ఎస్‌కు ఎలా ఉపయోగపడుతుంది? కాంగ్రెస్‌ సర్కార్‌ ఎందుకు ఇరకాటంలో పడుతుంది? తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేయబోతున్న అంశం జీఆర్‌ఎంబీ. ఈనెల18న హైదరాబాద్‌లో జరగబోయే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశంపై ఇప్పుడు హాట్ హాట్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. ఈ సమావేశం అజెండా చూస్తుంటే… తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా ఉందని ఆరోపిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్‌కు వెళ్ళవద్దని, బాయ్‌కాట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అలా చేస్తేనే కేంద్రానికి తెలంగాణ సమస్య తెలిసి వస్తుందన్నది కారు పార్టీ వాదన. ఆ వాదన ఎలా ఉన్నా… దీని వెనక ఫక్తు పొలిటికల్‌ అజెండా ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు. జీఆర్‌ఎంబీ అజెండాలో ఉన్న అంశాలను సాంకేతికంగా కాకుండా తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘనగా ప్రొజెక్ట్‌ చేస్తోంది బీఆర్‌ఎస్‌. దాని ఆధారంగానే ఉద్యమం చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌లోనే కీలకమైనది నీళ్ళు అయినందున..మరోసారి అదే పాయింట్‌ మీద జనంలోకి వెళ్ళి…పుంజుకోవాలని భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. నీళ్ళు, నిధులు, నియామకాలన్న నినాదమే ఒకప్పుడు పార్టీకి ఊపిరి పోసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగి అదే నీళ్ళ నినాదాన్ని అందుకుంటే…. రాష్ట్ర ప్రయోజనాలకు కాపలాదారుగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని లెక్కేలేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. GRMB అజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ… ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు హరీష్‌రావు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రికి కూడా లేఖ రాశారాయన.

ప్రస్తుతం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని మరింత పొలిటికల్‌గా టేకప్ చేశారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగితే BRS ఊరుకోదని.. పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారాయన. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని సంకేతాలిచ్చారు. ఇలా ఒకవైపు హరీష్ రావు మరోవైపు కేటీఆర్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవడం ఒక వ్యూహం ప్రకారమేనన్నది పొలిటికల్‌ టాక్‌. కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ రాయడం ద్వారా…అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ని ఏక కాలంలో టార్గెట్‌ చేయవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ విషయంలో రెండు పార్టీలను దోషులుగా చూపితే… తమకు మైలేజ్‌ పెరుగుతుందన్న లెక్కలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. సమావేశం జరిగే ఈనెల 18 వరకు ఈ అంశాన్ని మరింత హైలైట్ చేసే ప్లాన్‌లో ఉందట బీఆర్‌ఎస్‌. దీంతో.. BRS టార్గెట్ కేవలం GRMB సమావేశమా…లేక తెలంగాణ నీటి హక్కులు అనే పెద్ద నేరేటివ్‌ను నిర్మించి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టడమా అన్న భిన్న కోణాల్లో విశ్లేషణలు నడుస్తున్నాయి. నీటి అంశాన్ని సాంకేతిక వివాదంగా కాకుండా.. తెలంగాణ హక్కులు, భవిష్యత్ తరాల ప్రయోజనాలు అనే భావోద్వేగ అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక్కడే బీఆర్‌ఎస్‌ రెండు వైపులా పదును ఉన్న కత్తిని వాడుతోందంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీటింగ్‌కు హాజరైతే… రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వాళ్ళకు చిత్తశుద్ది లేదని టార్గెట్‌ చేయడం తేలిక అవుతుంది. అలా కాకుండా మీటింగ్‌ను బహిష్కరిస్తే… తాము చేసిన హెచ్చరికల వల్లేనని తమ ఖాతాలో వేసుకోవచ్చన్నది గులాబీ ప్లాన్‌గా ప్రచారం జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య జరిగే ఈ మీటింగ్‌ను తెలంగాణ సెంటిమెంట్ యాంగిల్‌లో ప్రొజెక్ట్ చేస్తే తమకు రాజకీయంగా లాభం జరుగుతుందని బీఆర్‌ఎస్‌ పెద్దలు అంచనా వేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.