మున్సిపల్ ఛైర్మన్స్ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందా? చేతులు కాలాక ఆకులు పట్టుకునేకన్నా… ఇప్పుడే అలర్ట్గా ఉండటం బెటరని ఫిక్స్ అయిందా? ఆ దిశగా ఆల్రెడీ యాక్షన్ మొదలైపోయిందా? అభ్యర్థుల్ని కాపాడుకునేందుకు ఏం చేస్తోంది కారు పార్టీ? ప్రత్యేకించి ఎక్కడెక్కడ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? తెలంగాణ రాజకీయాలు నిన్నటి దాకా ఒక లెక్క… నేడు మరో లెక్క అన్నట్టుగా ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరిగే వరకు రకరకాల విన్యాసాలు ప్రదర్శించి మున్సిపల్ ఓటర్స్ని ఆకట్టుకున్నాయి రాజకీయ పార్టీలు. తీర్పు స్ట్రాంగ్ రూమ్స్లో భద్రంగా ఉంది. అంతవరకు బాగానే ఉన్నా….. రేపు శుక్రవారం బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేశాక జరగబోయే తంతులోనే కీలకమైన మలుపులు ఉంటాయని అంటున్నాయి రాజకీయవర్గాలు. గెలిచే అభ్యర్థుల మీద పక్క పార్టీలు కూడా ఫోకస్ పెడుతున్నాయన్న వార్తలే అందుకు కారణం. ఎన్నికల్లో ఏ పార్టీ బీ ఫామ్ మీద గెలిచినా సరే…. తర్వాతి పరిస్థితులను బట్టి… మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక టైంలో కొంత మంది ప్లేట్ ఫిరాయించే ప్రమాదం ఉందన్న అంచనాలతో అన్ని పార్టీలు అలర్ట్గా ఉన్నాయి. కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాని రాజకీయ పార్టీలు ఇతరుల్ని లాక్కునే అవకాశాలే ఎక్కువ. దీనికి సంబంధించి ముందస్తు సంకేతాలతో అస్సలు పనిలేదు. అప్పటికప్పుడు సిచ్యుయేషన్కు అనుగుణంగా జంప్ జిలానీలు తయారవుతారు. సాధారణంగా ఈ ముప్పు అధికార పార్టీకంటే…. ప్రతిపక్షాలకే ఎక్కువగా ఉంటుంది. అందుకే… బీఆర్ఎస్ ముందస్తు జాగ్రత్తలు పడుతోందట.
తమ పార్టీ తరపున గెలిచిన వాళ్ళను కాపాడుకునేందుకు ఫలితాలకు ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగానే క్యాంప్ కేరింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికే సూర్యాపేట లాంటి చోట పార్టీ అభ్యర్థులను క్యాంప్నకు తరలించేసింది గులాబీ పార్టీ. ప్రత్యేకించి పోటాపోటీ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మున్సిపాలిటీల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం. అలాంటి అన్ని టౌన్స్ నుంచి ఫలితాల వెల్లడితో సంబంధం లేకుండా ముందే తమ అభ్యర్థులందర్నీ క్యాంప్కు తరలిస్తున్నట్టు సమాచారం. కౌంటింగ్ కేంద్రాల్లోకి పోటీ చేసిన అభ్యర్థి లేదా వారి తరఫున ఏజెంట్ వెళ్ళే వెసులుబాటు ఉన్నందున… కాస్త ఇబ్బందికరం అనుకున్న చోట్ల అభ్యర్థికి బదులు ఏజెంట్నే కౌంటింగ్కు పంపాలని అనుకుంటున్నట్టు తెలిసింది. ఆ విధంగా అభ్యర్థులందర్నీ లాక్ చేయాలనుకుంటున్నారట. ఒకవేళ ఏజెంట్ను ప్రలోభపెట్టినా…. గెలిచాక వాళ్ళతో ఎలాంటి అవసరం ఉండదు కాబట్టి అదే సేఫ్ అనుకుంటున్నట్టు తెలిసింది. అందుకే…అభ్యర్థులు క్యాంప్కు, ఏజెంట్స్ కౌంటింగ్ హాల్లోకి అన్న నినాదం అందుకుంది బీఆర్ఎస్.
శుక్రవారం కౌంటింగ్ పూర్తయితే 16న ఛైర్మన్స్ ఎన్నిక ఉంటుంది. మధ్యలో రెండు రోజుల టైం ఉన్నందున ఈ సమయంలో అభ్యర్థులు చేజారిపోకుండా కాపాడుకునే బాధ్యతను ఇన్చార్జ్ల భుజాల మీదే పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. దీనికి సంబంధించి టెలి కాన్ఫరెన్స్లో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ వైపు వెళ్లకుండా చూసే బాధ్యత ఇన్చార్జ్లదేనని చెప్పినట్టు తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్… ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తోంది. ప్రచార పర్వంలో చివరి మూడు రోజులు కేటీఆర్, హరీష్రావు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయడం అందులో భాగమేనని అంటున్నారు. ఇక గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడం,అవసరమైతే విప్ జారీ చేయడం లాంటి కీలక నిర్ణయం తీసుకుని వీలైనన్ని ఎక్కువ ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని చూస్తోంది గులాబీ పార్టీ. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉండే మున్సిపాలిటీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారు. గెలిచిన అభ్యర్థులను క్యాంప్నకు తరలించి ఛైర్మన్ ఎన్నిక రోజు నేరుగా తీసుకురావాలని అనుకుంటున్నారు.
