OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!

Brs

Brs

తెలంగాణ హైకోర్ట్‌ ఆదేశాల రూపంలో బీఆర్‌ఎస్‌కు అనుకోని ఆయుధం అంది వచ్చిందా? ఇక ఏ మాత్రం పట్టు జారకుండా ఆ పవర్‌ఫుల్‌ వెపన్‌ని గట్టిగా వాడే దిశగా అడుగులు వేస్తోందా? గ్రేటర్‌ పరిధిలోని మూడు కార్పొరేషన్స్‌లో పాగా వేసేందుకు అది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందని గులాబీ దళం లెక్కలు వేసుకుంటోందా? ఇంతకీ ఏంటా ఆయుధం? ఎలా వాడాలనుకుంటోంది కారు పార్టీ అధిష్టానం? హైడ్రా….. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్ని ఆక్రమణల బారి నుంచి రక్షించడం కోసం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేల కోట్ల విలువైన భూముల్ని కాపాడ్డంతో పాటు కీలకమైన జల వనరుల్ని కబ్జా కోరల నుంచి విడిపించామని చెబుతోందీ సంస్థ. అదే సమయంలో హైడ్రాకు కేవలం పేదల ఇళ్ళు, వాళ్ళు గుడిసెలు వేసుకున్న జాగాలు మాత్రమే కనిపిస్తాయని, పెద్దలు ఆక్రమించుకున్న వాటి జోలికి వెళ్ళాలంటే హైడ్రాకే డర్‌ అని విమర్శిస్తోంది విపక్షం బీఆర్‌ఎస్‌. ఈ పొలిటికల్‌ వార్‌ నడుస్తున్న టైంలోనే… తాజాగా తెలంగాణ హైకోర్ట్‌ అత్యంత కీలక ఆదేశాలిచ్చింది.

సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి దాని చీఫ్‌గా ఉన్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ రంగనాథ్‌ని తప్పించమని ఆదేశించింది ఉన్నత న్యాయ స్థానం. కోర్ట్‌ పరిగణనలోకి తీసుకున్న అంశాలు, కేసుల సంగతి ఎలా ఉన్నా…. కచ్చితంగా ఇది తమకు ఆయాచితంగా అంది వచ్చిన అవకాశంగా భావిస్తోందట బీఆర్ఎస్‌. కోర్ట్‌ తీర్పును బేస్‌ చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఇక జనంలోకి విస్తృతంగా వెళ్ళాలని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. హైకోర్ట్‌ ఆదేశాలు వెలువడ్డ వెంటనే… ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఉన్న మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో గులాబీ శ్రేణులు వేడుకలు చేసుకున్నాయి. కొందరైతే… హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఏకంగా స్వీట్లు కూడా పంచుకున్నారు. వీళ్ళు అంతలా ఎందుకు రియాక్ట్‌ అవుతున్నారంటూ తీర్పు వెలువడ్డరోజు ప్రశ్నించుకున్న వాళ్ళకు మెల్లిగా సమాధానం దొరుకుతోందట.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన హైడ్రా… ప్రస్తుతం హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల పని చేస్తోంది. ఇందులో జీహెచ్‌ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. ఈ మూడు కార్పొరేషన్స్‌ లిమిట్స్‌లో ప్రభుత్వ భూములను కాపాడ్డంతో పాటు తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటోంది హైడ్రా. అయితే… ఏర్పాటు టైం నుంచే దీన్ని వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్‌. బస్తీల్లో ఉండే పేద ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తూ… వాళ్ళ ఇండ్లనే కూల్చి వేస్తోందని, పైసా పైసా కూడబెట్టి జీవితకాలపు కలగా మధ్య తరగతి ప్రజలు కట్టుకున్న ఇళ్ళను నేలమట్టం చేయడం తప్ప పెద్దల భూ ఆక్రమణల జోలికి పోవడం లేదని ఆరోపిస్తున్నారు గులాబీ నాయకులు. ఇక తాము అధికారంలోకి వచ్చాక హైడ్రాను బండకేసి కొడతామంటూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ గతంలో బహిరంగ వేదిక మీదే ప్రకటించారు. ఈ క్రమంలో సంస్థ చీఫ్‌గా రంగనాథ్ తొలగించాలని హైకోర్ట్‌ ఆదేశించాక కూడా ఫస్ట్‌ రియాక్షన్‌ బీఆర్‌ఎస్‌ పెద్దల నుంచే వచ్చింది. హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ప్రకటించారు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ రియాక్షన్‌ వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు.

 

మూడు కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే హైడ్రాను ఎంత ఎక్కువగా టార్గెట్‌ చేస్తే రాజకీయంగా తమకు అంత లాభం అని బీఆర్‌ఎస్‌ ముఖ్యులు లెక్కలు వేసుకుంటున్నారట. హైడ్రా పేదలను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు జరుపుతోందని, పెద్దల ఇళ్ళను మాత్రం ముట్టుకోవడం లేదని, తాము మొదటి నుంచి ఇదే చెబుతున్నామంటూ బస్తీ, మధ్య తరగతికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. క్యూర్ పరిధిలో ఉన్న మూడు పెద్ద కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రానే అజెండాగా మార్చుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకే హైడ్రా ఏర్పాటైన్టటు చెబుతున్నా…. వాస్తవంలో అది ఎక్కడా కనిపించడం లేదన్నది బీఆర్‌ఎస్‌ ఆరోపణ. హైకోర్ట్‌ తాజా తీర్పు కూడా ఇదే విషయం చెబుతోందంటూ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు గులాబీ లీడర్స్‌. రంగనాథ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. తీర్పు వచ్చిన మొదటి గంట నుంచే బిఆర్ఎస్ నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడ్డం, బంగాళాఖాతంలో కలుపుతామని కేటీఆర్ కూడా అనడంలాంటివన్నీ ఎన్నికల స్ట్రాటజీలో భాగమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.