OTR : పాతబస్తీలో ఎస్‌ఐఆర్‌పై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి

Brs

Brs

ఏడే కదా అని వదిలేస్తే…. ఆ తర్వాత ఏళ్ళ పాటు ఇబ్బంది పడాల్సి వస్తుందని బీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోందా? అందుకే….. ఇన్నాళ్ళు లైట్‌ తీసుకున్న ఆ నియోజకవర్గాల మీద ఇక స్పెషల్‌ ఫోకస్‌ పెట్టబోతోందా? ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అక్కడ మెజార్టీ సీట్లు కొట్టాలని ప్లాన్‌ చేస్తోందా? ఏవా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు? అసలు ఇన్నాళ్లు ఎందుకు వదిలేశారు? ఇప్పుడెందుకు పట్టుకోవాలని అనుకుంటున్నారు? నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే ఆశలు పెట్టుకున్నాయి. జరుగుతుందన్న నమ్మకంతో ఎవరికి వారు స్పెషల్‌ ప్లానింగ్‌లో ఉన్నారు. ఆ విషయంలో మిగతా పార్టీలకంటే కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తోందట బీఆర్‌ఎస్‌. బలం, బలగం ఉన్న చోట పెరిగిన సీట్లలో ఎవడైనా పోటీ చేస్తాడు, గెలుస్తాడు. కానీ…. ఏమీ లేని చోట ఎత్తుకుంటేనే కదా…..? మన సత్తా ఏంటో తెలిసేది అంటూ గులాబీ అధిష్టానం కొత్తగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటిలో పూర్తి భిన్నంగా ఉంటాయి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆ ఏడు సెగ్మెంట్స్‌. ఎన్నిక ఏదైనాసరే…. మజ్లిస్‌ తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను లైట్‌ తీసుకుంటాయి.

అన్ని పార్టీలు అలా హైదరాబాద్‌ పాతబస్తీ మీద తక్కువ దృష్టి పెట్టడానికి బలమైన కారణమే ఉంది. ఓల్డ్‌ సిటీలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎం ప్రాబల్యమే ఎక్కువ. ఇక్కడ మజ్లిస్‌ కాకుండా మరో పార్టీ గెలవదన్నది కాదనలేని సత్యం, చరిత్ర చెబుతున్న వాస్తవం. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ ఏరియాలో ఎంఐఎం ఎమ్మెల్యేలే గెలుస్తున్నారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే జరుగుతోంది. దీంతో… మిగతా పార్టీలు ఈ ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టినా… అది నామ మాత్రమే తప్ప సీరియస్‌గా ప్రచారం కూడా చేసేవారు కాదు. అధినేతల స్థాయిలో ప్రచార హంగు ఆర్భాటాలు ఉండేవి కాదు. కానీ… ఇప్పుడు కొత్తగా ఆ ఆనవాయితీకి బ్రేక్‌ వేయాలని భావిస్తోందట బీఆర్‌ఎస్‌. గతానికి భిన్నంగా వ్యవహరించబోతున్నామని చెబుతున్నారు గులాబీ నేతలు. ఇప్పుడు ఏడు నియోజకవర్గాలే కదా అని వదిలేస్తే… రేపు పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 10 నుంచి 11దాకా ఉంటుందని, అది చిన్న సంఖ్యేం కాదుకదా అని అంటున్నారట. అలాగే…. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడానికి ప్రతీ ఒక్క నియోజకవర్గం చాలా కీలకమని భావిస్తోందట అధిష్టానం. అందులో భాగంగానే…. 10 నుంచి 11 అసెంబ్లీ నియోజకవర్గాలయ్యే అవకాశం ఉన్న హైదరాబాద్‌ పాతబస్తీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు సమాచారం.

×
×
Ad

 

అందు కోసమే ప్రధానంగా ఇప్పుడు ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఉపయోగించుకుని బోగస్ ఓట్లను తొలగించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారట బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలతో పాటు పాతబస్తీలోని ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా బోగస్ ఓట్ల తొలగింపు కోసం పార్టీ తరపున బీఎల్‌ఏలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా బోగస్ ఓట్లను తొలగించడం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా కలిసి వస్తుందని భావిస్తోంది పార్టీ. ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువమంది ఎంఐఎం వాళ్ళే గెలుస్తున్నారు. ఇక నుంచి అలాకాకుండా బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు తొలగించి కార్పొరేటర్లను కూడా వీలైనంత ఎక్కువ మందిని గెలిపించుకోవాలన్నది గులాబీ ప్లాన్‌. ఎంత ఎక్కువ మంది కార్పొరేటర్స్‌ ఉంటే… రేపు అసెంబ్లీ ఎన్నికల్లో అంత ప్లస్‌ అవుతుందన్నది విపక్షం ఆలోచన. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు సభ్యత్వ నమోదు అంశాలను కేడర్‌కు వివరించడానికి కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై దొంగ ఓట్లను, డబుల్ ఓట్లను గుర్తించి తొలగించడం గురించి వివరిస్తున్నారు. అదే ఫార్ములాను హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో కూడా అప్లయ్‌ చేయాలనుకుంటున్నారట. ఈ వ్యవహారాలన్నిటినీ గమనిస్తున్న రాజకీయ వర్గాలు మాత్రం ఈసారి గులాబీ ప్లానింగ్‌ కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తోందని కామెంట్‌ చేస్తున్నాయి.