Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం

Brs

Brs

సభ్యత్వ నమోదు వ్యవహారం బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోందా? కొన్ని నియోజకవర్గాల్లో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారా? కొందరు నేతలకైతే… అనుమానం వల్ల వచ్చిన భయంతో కూడిన టెన్షన్‌ పెరిగిపోతోందా? స్వయంగా పార్టీ అధిష్టానమే తమ కుర్చీల కింద బాంబులు పెట్టినట్టు ఫీలవుతున్నారా? పార్టీ సభ్యత్వ నమోదు అంటే నేతలు హ్యాపీగా ఫీలవ్వాలిగానీ… టెన్షన్‌ ఎందుకు? ఆ విషయంలో వాళ్లకున్న అనుమానాలేంటి? తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పునాదుల్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది బీఆర్ఎస్‌. అందులో భాగంగా సభ్యత్వ నమోదును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా కో ఆర్డినేటర్లను నియమించిన పార్టీ అధినేత కేసీఆర్‌…. తాజాగా నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను కూడా ఫైనల్‌ చేశారు. మొదటి నుంచి చెప్తున్నట్టుగానే…. ఎమ్మెల్యేలు, రెగ్యులర్‌ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లకు సభ్యత్వ బాద్యతలు అప్పగించలేదు.

అసలు వాళ్లెవరికీ సమాచారం లేకుండానే… కేవలం సభ్యత్వ నమోదు కోసం స్పెషల్‌ ఇన్ఛార్జ్‌లను తెర మీదికి తీసుకువచ్చారు. అసలు గుబులంతా ఇక్కడే మొదలైందట. అలా ఆ కొత్తవాళ్ల లిస్ట్ ప్రకటించగానే… కొంత మంది నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో సీనియర్స్‌కు కూడా మినహాయింపు లేదట. వాళ్లెవరో వస్తే… వీళ్ళకు భయమేంటని అంటే… అసలు కిటుకు అక్కడే ఉందన్నది ప్రస్తుతం పార్టీ టాక్‌. ప్రతి నియోజకవర్గానికి సభ్యత్వ ఇన్ఛార్జ్‌ పేరుతో ఒకర్ని నియమించారు బాగానే ఉందిగానీ…. వాళ్ళు ఆ పని మాత్రమే చూసుకుని వెళ్తారా? లేక లోకల్‌గా తిష్ట వేస్తారా అన్నది ఎక్కువ మంది భయం. మనకు ఢోకా లేదని అనుకునే వాళ్ళ సంగతి వేరుగానీ… రేపటి రోజున ఎక్కడో తేడా కొట్టి… ఏదో ఒక రూపంలో ఈ సభ్యత్వ ఇన్ఛార్జ్‌లే టిక్కెట్‌ రేస్‌లోకి వస్తే… మా గతేమవుతుందన్నది ఎక్కువ మంది కంగారు అని అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీలను ఇన్చార్జ్‌లుగా నియమించిన చోట లోకల్‌ నేతలకు టెన్షన్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు సభ్యత్వ నమోదు కోసం వచ్చిన వాళ్ళే… ఫిక్స్ అయిపోతారని భయపడుతున్నారట. పైగా…. అధినేత కేసీఆర్ స్వయంగా వీళ్ళని ఎంపిక చేసినందున రేపటి రోజున పరిస్థితులు ఎట్నుంచి ఎటు టర్న్‌ అవుతాయోనన్న భయం ఉందని చెప్పుకుంటున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్నే ఉదాహరణగా తీసుకుంటే… అక్కడ ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును ఇన్చార్జ్‌గా నియమించారు. దాంతో… అదే నియోజకవర్గం నుంచి ఈసారి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పాలేరుకు ఎమ్మెల్సీ తాతా మధును పార్టీ సభ్యత నమోదు ఇన్చార్జ్‌లుగా వేశారు.

దాంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ వీరికే ఏమోనన్న చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ను, కంటోన్మెంట్‌కు క్రిశాంక్, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్ రెడ్డికి సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించారు. దాదాపుగా వీళ్ళంతా ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశావహులే కావడంతో… ఫైనల్‌గా ఏదైనా జరగవచ్చన్న కంగారు ఆయా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఇన్ఛార్జ్‌ల్లో పెరుగుతోందట. అందుకు తగ్గట్టే వాళ్ళ అనుచరులు ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టేశారు. అటు మేడ్చల్ నియోజకవర్గంలో రాగిడి లక్ష్మారెడ్డికి సభ్యత్వ ఇన్ఛార్జ్‌గా ఇవ్వడంతో ఓవరాల్‌గా డౌట్స్‌ పెరుగుతున్నాయట. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉందట. కొన్ని చోట్ల నియోజకవర్గాలతో సంబంధం లేని వారికి బాధ్యతలు ఇచ్చినా… ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో…డైరెక్ట్‌గా లోకల్‌ పాలిటిక్స్‌తో సంబంధం ఉన్న, ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశిస్తున్న వారికి సభ్యత్వ బాధ్యతలు ఇవ్వడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.వేరే నియోజకవర్గాల్లో లేని ఆ తరహా నియామకాలు మా దగ్గర మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ కొందరు నాయకులు కంగారు పడుతున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లోపు వీరిని ఆయా నియోజకవర్గాల్లో బలోపేతం చేయడం కోసమే… సభ్యత్వ నమోదు ఇన్చార్జ్‌ల పేరుతో కేసీఆర్ బాధ్యతలు అప్పగించి ఉండవచ్చంటూ పార్టీలో చర్చ జరుగుతోంది.