ఆ రెండు పార్టీల మధ్య ఏపీ పొలిటికల్ లింక్ తెలంగాణలో వర్క్ అవడం లేదా? మనం మనం బరంపురం… ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే ఓటు, ఒకటే మాట అన్నట్టుండే బంధానికి బీటలు వారుతున్నాయా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇన్నాళ్లు తెగ చెప్పేసుకున్నవాళ్ళు ఇప్పుడు మరో ఎన్నికలో ఎవరికి వారే ఎందుకు అభ్యర్థుల్ని ప్రకటించుకుంటున్నారు? ఏవా రెండు పార్టీలు? ఇప్పుడొచ్చిన తేడా అంశాలవారీనా? లేక భవిష్యత్ సంకేతమా? జనసేన, బీజేపీ, టీడీపీ… కూటమిగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాయి. అయితే… తెలంగాణకు వచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. కొన్ని విషయాల్లో టీడీపీ వెనక్కి తగ్గగా… జనసేన, బీజేపీ మాత్రం కలిసే ముందడుగు వేయాలన్నట్టుగా ఉండేది వాతావరణం. కానీ… ఇన్నాళ్ళు అవి మాటలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు చేతలకు వచ్చేసరికి ఎక్కడో తేడా కొడుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. రెండు పార్టీల మధ్య అంత సఖ్యత లేనట్టుగా ఉందని అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోందని అంటున్నారు.
పొత్తులు మా చేతిలో ఉండవు, అంతా హై కమాండ్ చూసుకుంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు అంటూనే… కలిసి పొయ్యేది లేదని చెబుతున్నారు. ఇక బీజేపీలో ఇబ్బంది పడుతున్నవారు, పదవులు రాని వారు జనసేన గడప తొక్కుతున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జనసేన తన ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించేసింది. వచ్చే ఏడాది ఆరంభంలో తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు… వరంగల్- నల్గొండ- ఖమ్మం గ్రాడ్యుయేట్ సీటుకు కూడా ఎన్నిక జరగనుంది.
దీంతో ఆయా టిక్కెట్ల కోసం కమలం ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు కూడా. అయితే… మిత్రపక్షంతో సంబంధం లేకుండానే… జనసేన ఖమ్మం- నల్గొండ- వరంగల్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించేసింది. డాక్టర్ గడల శ్రీనివాస్ తమ పార్టీ తరపున బరిలో ఉంటారంటూ అధికారికంగా ప్రకటించేసింది గ్లాస్ పార్టీ. ఇన్నాళ్ళు పలు ఎన్నికల్లో, వివిధ సందర్భాల్లో బీజేపీకి మద్దతిస్తూ వచ్చిన జనసేన… ఇప్పుడు సొంత అభ్యర్థిని ప్రకటించడంతో ఇక ఆ రెండు పార్టీల మధ్య పొత్తు, దోస్తూ ఏదీ ఉండదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి రాజకీయవర్గాల్లో. బీజేపీ ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టబోతోంది. దీంతో… త్వరలో జరిగే 5 మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే పోటీకి దిగుతారా అన్న సందేహాలు పెరుగుతున్నాయి.
పొత్తు ఉండొచ్చని గతంలో ప్రచారం జరిగినా…. తాజా పరిణామాలతో ఇక అది ఉండక పోవచ్చనే మాట వినిపిస్తోంది. వాస్తవంగా చూస్తే…. జనసేనతో కలిసి నడవడం తెలంగాణ బీజేపీ నేతలకు అస్సలు ఇష్టం లేదట. కానీ… పవన్ కళ్యాణ్కు సెంట్రల్ బీజేపీ నేతలతో మంచి సంబంధాలు ఉండడం, ప్రధాని మోడీ పవన్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో… తప్పనిసరి పరిస్థితుల్లో… తలూపాల్సి వస్తోందేగానీ మనస్ఫూర్తిగా కాదన్నది కాషాయం టాక్. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తమను డ్యామేజ్ చేశాయన్న అభిప్రాయం సైతం తెలంగాణ కమలంలో ఉందట. ఇలా… వోవరాల్గా చూసుకుంటే… ఏపీ సంగతి ఎలా ఉన్నా… తెలంగాణలో మాత్రం బీజేపీ లీడర్స్ సోలో సాంగ్కే ప్రాధాన్యం ఇస్తున్నారట. రేపు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇదే కనిపించబోతోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.

