OTR : భూపాలపల్లి BRSలో మళ్లీ వర్గపోరు.. హరీష్ సమక్షంలోనే రచ్చ

Brs

Brs

అక్కడ గులాబీ యుద్ధం రసవత్తరంగా మారుతోందా? బీఆర్‌ఎస్‌ అగ్రనేత సమక్షంలోనే పరస్పర వ్యతిరేక నినాదాలు, అలకలు, బుజ్జగింపులు దేనికి సంకేతం? ఎమ్మెల్సీని పొలిటికల్‌గా సైడ్‌ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పథకం ప్రకారం పావులు కదుపుతున్నారా? ఎమ్మెల్సీ సైతం నేనేం తక్కువ తినలేదన్నట్టు అడుగులేస్తోంది ఎక్కడ? ఏంటా పొలిటికల్‌ వార్‌? భూపాలపల్లి బీఆర్‌ఎస్‌లో వర్గ పోరు పార్టీ అగ్రనేత హరీష్‌రావు సాక్షిగా మరోసారి బయట పడింది. నియోజకవర్గంలో మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారికి ప్రాధాన్యత తగ్గుతోందన్న అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. గండ్ర వెంకటరమణారెడ్డి, మధుసూదనాచారి మధ్య చాలా రోజులుగా వార్‌ నడుస్తున్నా…. ఇప్పుడు ఏకంగా హరీష్‌ సమక్షంలోనే అది ఓపెన్‌ అవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థను దోచుకుంటున్నారంటూ ఆందోళన బాట పట్టింది బీఆర్ఎస్‌. అందులో భాగంగానే ఇక్కడ జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హాజరయ్యారు హరీష్‌. బీఆర్ఎస్ భూపాలపల్లి ఇన్చార్జ్‌గా ఉన్న గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య ప్రతినిధులు ఈ మీటింగ్‌ పెట్టారు. మధుసూదనాచారి మినహా నియోజకవర్గంలోని అందరికీ ఇందుకోసం ఆహ్వానాలు అందాయట.

 

×
×
Ad

అదే… ఎమ్మెల్సీ ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు. సింగరేణి పరిరక్షణ సదస్సులో ముఖ్యనేతలంతా పాల్గొంటారంటూ వాళ్ళ పేర్లతో సగా… బొగ్గు బావుల దగ్గర కరపత్రాలు పంచారు, ఫ్లెక్సీలు పెట్టారు. కానీ…వాటిలో ఎక్కడా… మధుసూదనాచారి పేరు లేకపోవడం చర్చకు దారితీసింది. కావాలనే చారిని విస్మరించారంటూ ఆయన అనుచరగణం మండిపడింది. గండ్ర వెంకట రమణారెడ్డి కావాలనే మధుసూదనాచారిని పక్కన పెడుతున్నారంటూ విషయాన్ని… వాళ్ళు హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్ళారు. అలాగే….టీజీబీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ దృష్టికి కూడా మేటర్‌ని తీసుకెళ్ళినట్టు తెలిసింది. మధుసూదనాచారికి ప్రాధాన్యత తగ్గిస్తే…. తాము సదస్సును అడ్డుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారకముందే చర్యలు చేపట్టాలన్న హరీష్‌ సూచనల మేరకు కొప్పుల ఈశ్వర్ ద్వారా మధుసూదనాచారిని ఆహ్వానించారట. అందుకే సదస్సుకు ఒక్కరోజు ముందు చారి భూపాలపల్లికి చేరుకున్నారట. అలాగే… పలు చోట్ల ఫ్లెక్సీల్లో మధుసూదనాచారి ఫోటో లేకపోవడం కూడా వివాదానికి దారి తీసింది.

హరీష్‌రావు ఆయన క్యాంప్ ఆఫీస్‌కి చేరుకోగానే… వెంట వచ్చిన బొగ్గుగని కార్మిక నేతలు వెళ్లి పోవాలంటూ చారి అనుచరులు నినాదాలు చేశారు. డైరెక్ట్‌గా పార్టీ అగ్రనేత సమక్షంలోనే ఈ తతంగమంతా జరగడంతో…మధుసూదనాచారి జోక్యం చేసుకుని శాంతింప చేశారట. అలాగే… హరీష్‌రావు జోక్యంతో ఇతర ఫ్లెక్సీల్లో సైతం మాజీ స్పీకర్‌ ఫోటో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడితో శాంతించి అంతా కలిసి సింగరేణి పరిరక్షణ సదస్సుకు వెళ్లారు. అక్కడ ప్రసంగాల్లో సైతం మరోసారి విభేదాలు బయటపడ్డట్టు చెప్పుకుంటున్నారు. గండ్ర తన ప్రసంగంలో కనీసం చారి పేరు కూడా ప్రస్తావించలేదట. అలాగే… హరీష్‌రావు చొరవ తీసుకుంటే తప్ప మధుసూదనాచారికి మాట్లాడే అవకాశం కల్పించకపోవడాన్ని బట్టి చూస్తుంటే… ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారనే సంగతి అర్ధమవుతోందని బీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం గుర్తు చేస్తోంది. గతంలో పార్టీ అగ్ర నాయకులు ఇద్దరు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారని, ఒక పథకం ప్రకారం సీనియర్ లీడర్‌ని భూపాలపల్లి పొలిటికల్‌ స్క్రీన్‌ మీద లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చారి అనుచరులు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.. ఆధిపత్యం కోసం సిరికొండను తప్పించే ప్రయత్నంలో ఉన్నారన్నది ఆయన సన్నిహితుల మాట. ఈ పరిస్థితుల్లో స్థానిక గులాబీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.