OTR : బాలినేనిని జనసేన లైట్ తీసుకుంటుందా?

Balineni

Balineni

బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన్ని పార్టీకి ఆత్మీయుడిగా భావించడం లేదా? పార్టీలో ఉంటే ఏంది? పోతే ఏందన్నట్టుగా వ్యవహారం మారిపోయిందా? పార్టీలో చేరిన రెండేళ్ళ తర్వాత అసలిప్పుడీ చర్చ ఎందుకు వచ్చింది? ఆత్మీయతలు, అనుబంధాల గురించి మాజీ మంత్రి అనుచరులు ఎందుకు మాట్లాడుతున్నారు? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో ప్రాధాన్యం తగ్గుతోందంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా విస్తృత చర్చ మొదలైంది. అలా ఎందుకంటే… తాజాగా జరిగిన పార్టీ నేతల ఆత్మీయ సమావేశాన్నే ఉదాహరణగా చెబుతున్నారు. ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆధ్వర్యంలో… స్థానిక సంస్ధల ఎన్నికల అవ‌గాహ‌నా కార్యక్రమం, ఆత్మీయ సమావేశం జరిగింది. కానీ.. ఆ మీటింగ్‌కు బాలినేనికి ఆహ్వానం లేదట. అదే విధంగా ఇటీవల పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో కూడా ఆయనకు స్థానం దక్కలేదు.

దీంతో వివిధ వర్గాల్లో అనుమానాలు మొదలైపోయాయి. రెండేళ్ల క్రితం వైసీపీని వీడి జనసేనలో చేరినప్పటి నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రయాణం అంత సాఫీగా లేదన్నది విస్తృతాభిప్రాయం. జనసేనలో చేరే సమయంలోనే.. తన అనుచరులతో కలిసి భారీ కార్యక్రమం పెట్టాలని బాలినేని…. కొన్ని ప్రత్యేక కారణాలతో మాజీ మంత్రి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి, 21 మంది కార్పొరేటర్లకు మాత్రమే పవన్ కల్యాణ్ కండువాలు కప్పారు. తర్వాత ఒంగోలులో భారీ సభ నిర్వహించి.. బాలినేని అనుచరులను జనసేనలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ప‌వ‌న్ వైపు నుంచే వ‌చ్చినా.. అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని గుర్తు చేసుకుంటున్నారు ఆయన వర్గీయులు. ఒక దశలో బాలినేని జనసేనకు దూరంగా ఉండటంతో తిరిగి వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం సైతం జరిగింది. అప్పుడే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల డీ లిమిటేషన్ బాధ్యతలను అప్పగించింది గ్లాస్‌ అధిష్టానం. ఆ నివేదికను పవన్ ప్రశంసించడంతో… ఇక పార్టీలో కీలక పాత్ర ఖాయమన్న అంచనాలు పెరిగాయి. తీరా చూస్తే… ఇప్పుడు సీన్‌ రివర్స్‌లో కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి బాలినేనికి ఆహ్వానం అందకపోవడం ఏంటన్న దగ్గరే సరికొత్త సందేహాలు వస్తున్నాయట. సీనియర్ నాయకుడైన మాజీ మంత్రికి కనీసం ఆహ్వానం కూడా లేకపోవడంపై ఆయన అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం.. ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే.. బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత తగ్గిందని భావిస్తున్నారు కొందరు. ఆయన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినట్టు ఎక్కడా కనిపించకపోయినా… ప్రాధాన్యత త‌గ్గటానికి అసలు కారణం ఏంటన్నదే క్వశ్చన్‌. సీనియర్ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ కావాల‌నే కొన్ని కార్యక్రమాల‌కు శ్రీనివాసరెడ్డిని దూరంగా పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన కొంతమంది జ‌న‌సేన నాయకులు. ఒక్క బాలినేనినే కాకుండా… రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సీనియర్స్‌ని కూడా ఒక ప్లాన్‌ ప్రకారం నాదెండ్ల సైడ్‌ చేస్తున్నారన్నది వాళ్ళ వెర్షన్‌. మరోవైపు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలు కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి.

శ్రీనివాసరెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఈ అంశంపై బహిరంగంగా స్పందించలేదు. అదే సమయంలో బాలినేనికి, ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు షేక్ రియాజ్ వ‌ర్గానికి మధఅయ ఉన్న గ్యాప్‌ను తగ్గించే ప్రయత్నం జరక్కపోవడం గురించి కూడా మాట్లాడుకుంటున్నాయి గ్లాస్‌ శ్రేణులు. పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఒంగోలులో అటు బాలినేని ప్రణీత్‌రెడ్డి, ఇటు షేక్ రియ‌ాజ్‌ విడివిడిగా ర్యాలీలు నిర్వహించినా అధిష్టానం నుంచి క‌నీస స్పంద‌న లేద‌ని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని పార్టీలో ఉండమంటున్నారా? లేక పొమ్మనకుండా పొగబెడుతున్నారా అంటూ ఫైరైపోతోంది బాలినేని అనుచరగణం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నదాన్ని బట్టి క్లారిటీ వస్తుందని కూడా వాళ్ళే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రెండు మూడు నెలలు అత్యంత కీలకమేనని అంటున్నారు మాజీ మంత్రి అనుచరులు.