ఆయన జిల్లాపై మంచి పట్టున్న నేత. పార్టీలోనూ… ప్రభుత్వంలోనూ… మంచి ఇమేజ్ ఉంది. పోలిటికల్గా పట్టు సడలకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తారు. కానీ రాను రాను పరిస్థితులు మారుతున్నాయట. ఆ అమాత్యుని సొంత జిల్లాలోనే సొంత పార్టీ కార్యకర్తలే స్వరం సవరిస్తున్నారట. ఆ మంత్రి మౌనంగా ఉండటం… గ్రూపు రాజకీయాలకు కారణం అవుతుందా..? ఇంతకీ ఎవరా నేత..? పార్టీలో నెలకోన్న పరిస్థితులు ఏంటి..? శ్రీకాకుళం రాజకీయాల్లో కింజరాపు కుటుంబం ఆధిపత్యం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కింజరాపు అచ్చెన్నాయుడు కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. సిక్కోలు రాజకీయాలలో తనదైన ముద్రవేస్తున్న నేత కింజరాపు అచ్చెన్నాయుడు. గత ఎన్నికల్లో పట్టుబట్టి మరీ తన అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఉమ్మడి జిల్లాను క్వీన్ స్వీప్ చేసింది కూటమి. రాష్ట్ర మంత్రివర్గంలో అచ్చెన్నాయుడు క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే… మంత్రిగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న అచ్చెన్నాయుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో పట్టించుకోలేకపోతున్నారట. అచ్చెన్నాయుడు బిజీగా ఉన్నారా… లేదంటే జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టడంలేదో కానీ… క్షేత్ర స్థాయిలో అంతా గజిబిజిగా మారుతోందట. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో… అందునా టీడీపీలో అచ్చెన్నాయుడుకు తెలియకుండా ఏమీ జరగదు. అయితే… ఈ రెండేళ్లలో పార్టీలో అనేక అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నాయట. పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట, పాలకొండ నియోజకవర్గాలలో అసమ్మతి సెగ రాజుకుంటోందనే మాట వినిపిస్తోంది. దానిని ఆదిలోనే ఆర్పేయాల్సిన అచ్చెన్నాయుడు అదేమీ తెలియదన్నట్లు వదిలేస్తుండటంతో తెలుగు తమ్ముళ్లు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నెలకోందంట. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే టీడీపీలో… ఇలా నేతలు రోడ్లపైకి రావడంతో వేళ్లన్నీ నాయకత్వంవైపే చూపిస్తున్నాయట. తాజాగా శ్రీకాకుళంలో దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాల అంశం రచ్చగా మారింది. విగ్రహాల ఏర్పాటుకు నిర్మించిన రెండు బేస్మెంట్లు తొలగించడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
పాతపట్నం నియోజకవర్గంలో ఎరువుల కొరత అంశంపై టీడీపీ సీనియర్ నేతలు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లాలో భాగమైన పాలకొండలో నియోజకవర్గ ఇన్ఛార్జ్కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టడం, నరసన్నపేటలో బగ్గు వర్సెస్ తెలుగు యువత అధ్యక్షుడు దాసునాయుడు వర్గాలతో పార్టీలో అంతర్గతంగా డ్యామేజ్ అవుతోందట. అటు ప్రభుత్వం… ఇటు పార్టీ… రెండింటిపై మంచి పట్టున్న అచ్చెన్నాయుడు దృష్టిలో ఇవన్నీ చిన్న సమస్యలా లేదంటే పట్టించుకునే తీరిక ఆయనకు లేదా..? అనే చర్చ టీడీపీలో జరుగుతోందట. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన డ్యామేజ్ ఎంత..? అనేది లెక్కలేసుకుంటే తగిన సమాధానం రావచ్చు. డ్యామేజీ కంట్రోల్ చేయటానికి కూడా అచ్చెన్నాయుడు జిల్లా పార్టీకి సమయం ఇవ్వడం లేదన్న టాక్ టీడీపీలో వినిపిస్తోంది. ఆరు నెలలు గడుస్తున్నా జిల్లా టీడీపీ అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగనేలేదట. ఆనవాయితీ ప్రకారం నడిచే ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేదో తెలియదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అచ్చెన్నాయుడుకి వ్యతిరేకంగా సై అంటే సై అనేలా తయారైన ఆమదాలవలస ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డ టీడీపీ జిల్లా అధ్యక్షుడి నియామకం తరువాతే పార్టీ గాడి తప్పడం మొదలైందట. అదే సమయంలో పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న చిన్న చిన్న తప్పులకు కూడా రోడ్డెక్కుతున్నారట తెలుగు తమ్ముళ్లు. ఈ వ్యవహారాలన్నింటిని అచ్చెన్నాయుడు ఏ విధంగా చూస్తున్నారో అర్థం కావడంలేదంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజరాపు ప్యామిలీ పాత్ర సుస్పష్టం. సొంత నియోజకవర్గం టెక్కలితో పాటు జిల్లా అంతటా అనుచరగణం ఉంది. అచ్చెన్నాయుడు మాటకు తిరుగుండదు. కానీ మంత్రి సైలెంట్ కావడంతో కేడర్ వైలెంట్గా మారుతోందట. అందుకే అచ్చెన్నా ఒక్కసారి పార్టీ దిక్కు చూడన్నా అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడకముందే రిపేర్ వర్క్ మెదలెట్టాలని కోరుతున్నారట. అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారో..? ఆయన మౌనంగా ఎందుకు ఉంటున్నారో..? తెలియక తలలు పట్టుకుంటున్నారట

