Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు

Ganga

Ganga

ఆ టీడీపీ ఎమ్మెల్యే… కేవలం ఒకే సామాజికవర్గానికి చెందిన సహచరుల్నే ఎందుకు వరుసబెట్టి టార్గెట్‌ చేస్తున్నారు? తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందన్న సంగతి వదిలేసి… పక్క చూపులు చూడ్డం వెనకున్న ప్లాన్‌ ఏంటి? చివరికి కులం పేరుతో పార్టీ అధినాయకత్వాన్ని కూడా డిఫెన్స్‌లోకి నెట్టాలనుకుంటున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఏ సామాజికవర్గం ఎమ్మెల్యేల గురించి వరుసబెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు? చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్‌ వ్యవహారశైలిపై లోకల్‌గా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఆయన గురించి ఇప్పుడు జనరల్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌కంటే… సొంత పార్టీలోనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారట. అసలు ఎమ్మెల్యే లక్ష్యం ఏంటి? ఆయన ఏం చేయాలనుకుంటున్నారంటూ… డిఫరెంట్‌ యాంగిల్స్‌లో డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. లోకల్‌గా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆయన అనుచరులు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారన్నది బహిరంగ రహస్యంగా మారింది. పాత టీడీపీ వాళ్ళని కాదని, వైసీపీ నుంచి వచ్చిన వారితో కోటరీని ఏర్పాటు చేసుకున్నారంటూ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందట. ఈ అంతర్గత విభేదాలు ఇలా ఉండగానే.. ఎమ్మెల్యే థామస్ అకస్మాత్తుగా రూట్ మార్చి మరో కొలికపూడిలా మారే ప్రయత్నంలో ఉన్నారంటూ జీడీ నెల్లూరు టీడీపీలో చర్చ జరుగుతోందట. వరుసగా థామస్‌ చేస్తున్న వ్యాఖ్యలే అందుకు ఊతమిస్తున్నాయని అంటున్నారు. మొన్నటికి మొన్న…. దళితుడినన్న కారణంతోనే… ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్‌లో తనను వెనక్కి నెట్టారంటూ బాంబ్‌ పేల్చారాయన. నేను ఎస్సీ కాకుండా… వేరే కులం ఎమ్మెల్యేనై ఉంటే నాకు ఫస్ట్‌ ర్యాంకు వచ్చేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరో ఆడుగు ముందుకేసి ఒకే సామాజిక వర్గం టార్గెట్‌గా ఎమ్మెల్యే చేస్తున్న కామెంట్స్‌ జిల్లాలో కులకలం రేపుతున్నాయి. థామస్ వ్యూహాత్మకంగా… వరుసబెట్టి కమ్మ ఎమ్మెల్యేలనే లక్ష్యం చేసుకుని మాట్లాడుతున్నట్టు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. తొలుత చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసిన థామస్…. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలా సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్లు నేను చేయనని అన్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన టార్గెట్‌ లిస్ట్‌లో చేరారట. చంద్రగిరి, నగరి నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ… ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, అక్కడి అక్రమాలను పట్టించుకోకుండా…. గంగాధర నెల్లూరులో జరిగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. స్థానికంగా ట్రాక్టర్లలో ఇసుక తీసుకుపోతుంటే…. దాన్ని చెన్నైకి తరలించేస్తున్నారంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే అభ్యంతరం. తన వరకు తాను వివరణఇవ్వడం బాగానే ఉన్నా… ఇప్పటిదాకా ఆయన వేలెత్తి చూపిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురూ కమ్మ సామాజికవర్గానికి చెందిన వాళ్లే కావడంతో… అనుమానాలు పెరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

ఆ మధ్య సత్యవేడు ఎమ్మెల్యేపై సానుభూతి చూపిస్తూ… అగ్రకుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోరంటూ పార్టీని ఇరికించిన థామస్.. ఇప్పుడు మరోసారి ఒకే వర్గాన్ని టార్గెట్ చేయడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట. అటు థామస్‌ కామెంట్స్‌పై నగరి, చంద్రగిరి టీడీపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. నువ్వు అంటించుకున్న బురదను మాకు పూయాలంటే ఏమాత్రం ఒప్పుకోబోమంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మొదటి నుంచి వైసీపీ నేతలతో కలిసి ఇసుక, గ్రావెల్ సహా ఇతర వ్యాపారాలు నడిపించిన థామస్.. కొంతకాలంగా పార్టీ పెద్దలు అక్షింతలు వేయడంతో రూటు మార్చారని, నేను మంచి వాడిని… మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళని చెప్పుకునే ప్లాన్‌లో ఉన్నారని అంటున్నారు తమ్ముళ్లు. ఇంకొందరైతే…. ​మంత్రి పదవి కోసం తాను మంచి మార్కులు కొట్టేయడానికి పార్టీని, ఇతర ఎమ్మెల్యేలను ఇంతలా డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నట్టు సమాచారం. గతంలో జీడీ నెల్లూరు నుంచి నగరి వైపు వెళ్తున్న ఇసుక లారీలను లోకల్ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ అడ్డుకోవడంతో పాటు పోలీసులకు చెప్పి సీజ్ చేయించారు. ఇక మీదట నా నియోజకవర్గం మీది నుంచి అలాంటి లారీలు వెళితే ఒప్పుకునేది లేదని క్లారిటీగా చెప్పేశారట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇక చంద్రగిరి, చిత్తూరు ఎమ్మెల్యేలు కూడా థామస్ చేస్తున్న పనులపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతోనే… ఇప్పుడు ఇలా రివర్స్ అటాక్‌ మొదలు పెట్టారన్నది ఇంకో వెర్షన్‌. ​జీడీ నెల్లూరుకు పక్కనే ఉండే పూతలపట్టు నియోజకవర్గంలో ఓ రేంజ్‌లో ఇసుక దందా నడుస్తున్నా….ఆ పేరు ఎత్తని థామస్‌… కేవలం కమ్మ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలనే టార్గెట్ చేయడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న మాటలు జిల్లా‌ టిడిపిలో వినిపిస్తున్నాయి. తన ఆదాయం తగ్గిపోవడానికి వాళ్లు ఒక కారణం అయితే…రాబోయే క్యాబినెట్ విస్తరణ రేస్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారన్నది ఇంకో మాట. టీడీపీ అధిష్టానాన్ని కూడా డిఫెన్స్‌లో పడేయాలనేది ఆయన ప్లాన్ అన్న వాయిస్‌ సైతం వినిపిస్తోంది. నియోజకవర్గంలో తాను పని చేస్తున్నా… కేవలం కుల వివక్ష కారణంగానే మంచి ర్యాంక్‌ రాలేదని చెప్పడం ద్వారా పార్టీ హైకమాండ్‌పై వత్తిడి తీసుకురావాలనుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు. కానీ… థామస్‌ సొంత అజెండా కోసం… పార్టీపై బురద చల్లుతూ… బద్నాం చేయడం, ప్రత్యర్థుల చేతికి అస్త్రాలు అందించడం ఏంటంటూ మధనపడుతున్నారట జీడీ నెల్లూరు తెలుగుదేశం కార్యకర్తలు. ఆయన విషయంలో అధిష్టానం ఎలా రియాక్ట్‌ అవుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నారు.