OTR : అనంతపురం మేయర్ పీఠం ఎవరిది..? రిజర్వేషన్ల సస్పెన్స్‌తో టీడీపీలో ఉత్కంఠ!

Anan

Anan

ఆ కార్పొరేషన్ పోరులో ముందెన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠాన్ని అధిరోహించే ఆ కింగ్ ఎవరనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు ప్రత్యక్ష ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతుండగా… మరోవైపు రిజర్వేషన్ల సస్పెన్స్ అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. కుర్చీ ఎస్సీలకు దక్కుతుందా..? బీసీలను వరిస్తుందా..? లేదంటే ఓసీలకే వస్తుందా..? అనే సమీకరణాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే ఎవరికి వారు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారక్కడ. అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కాబోయే మేయర్‌ ఎవరు..? కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కాబోయే మేయర్ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం మేయర్ పీఠానికి నేరుగా ఎన్నికలు జరగడమే. అనంతపురం సిటీలో మొదట కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి గట్టి పట్టు ఉండేది. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మొత్తం 50 డివిజన్లలో 48 స్థానాలను కైవసం చేసుకోగా.. రెండు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ తర్వాత వారు కూడా వైసీపీకే మద్దతు పలికారు. దీంతో 50 మంది వైసీపీ వారే కార్పొరేటర్లుగా ఉన్నారు. అందుకే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐదేళ్లపాటు మేయర్‌గా వసీం కొనసాగారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి చెందినవారే మేయర్‌ అవుతారనే అంచనాలున్నాయి. తాజాగా డివిజన్ల పునర్విభజనతో 50 డివిజన్లు కాస్తా 62కు పెరిగాయి. దీంతో మొత్తం 62 మంది కార్పొరేటర్లు ఉండబోతున్నారు. కానీ మేయర్ స్థానానికి నేరుగా ఎన్నికలు జరుగుతుండటంతో సార్వత్రిక ఎన్నికల స్థాయి ప్రాధాన్యత కనిపిస్తోంది. అయితే మేయర్ ఎవరన్నది ఇప్పుడు అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట. వైసీపీ తరఫున ఎవరు అన్నది ఇంకా డిసైడ్ కానప్పటికీ ఆ పార్టీలో ఎవరి ముందుకొస్తారన్నది చూడాల్సి ఉంది. అధికార పార్టీలో మాత్రం దీనిపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. దీనికి ప్రధానమైన కారణం ఇప్పటివరకు రిజర్వేషన్లు ఖరారు కాకపోవడమే. ఓసీ రిజర్వేషన్ అయితే బలిజ సామాజిక వర్గానికి చెందినవారిని బరిలోకి దించే దిశగా అధిష్టానం ఆలోచించవచ్చని అనంతపురం టీడీపీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఒకరిద్దరు నాయకులు ఆ దిశగా బలంగా ప్రయత్నాలు చేస్తున్నారట కూడా.

బీసీకి రిజర్వ్‌ అయితే ఒక నాయకుడి పేరు ప్రధానంగా వినిపిస్తోందట టీడీపీలో. ఎస్సీ అయితే మరొక నాయకుడు పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారని సైకిల్‌ పార్టీలో టాక్‌ నడుస్తోందట. క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టే మేయర్ ఎవరన్నది డిసైడ్ కాబోతోందని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంతవరకు పోటీ ఇస్తుందనే విషయాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ లెక్కచేయడం లేదట. కేవలం సొంత పార్టీలో ఉన్న పోటీపైనే టీడీపీ నాయకులు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారట. వైసీపీతో పోటీ ఉన్నప్పటికీ విజయం మాత్రం తామే సాధిస్తామన్న ధీమాలో ఉన్నారట టీడీపీ నాయకులు. రిజర్వేషన్లు ఖరారైతే కానీ ఏ సామాజిక వర్గానికి మేయర్ పదవి దక్కుతుందనేది క్లారిటీ వచ్చే అవకాశంలేదు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం కూడా క్యాస్ట్‌ లెక్కలు వేస్తోందట. ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని దించాలి..? వారి బలం ఏంటి..? బలహీనతలు ఏంటి..? అనే అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తోందట. ఇప్పటికే మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ఒక అంచనాకు కూడా వచ్చినట్లు అనంత టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా కొందరు నాయకుల పేర్లను అధిష్టానానికి సూచించారట. ఇప్పటికే కొందరు నేతలకు టచ్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే… రిజర్వేషన్లను బట్టి ఫలానావారు నిలబడే ఛాన్స్ ఉందంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ అనంతపురం మేయర్ పీఠం విషయంలో టీడీపీలో టెన్షన్‌ చాలా ఎక్కువగానే ఉందని సమాచారం.