వైసీపీలో అంబటి రాంబాబు ఒంటరి అయ్యారా? ఆయన్ని సీరియస్గా పరిగణించే పరిస్థితి లేదా? ఆయన కుటుంబ సభ్యుల్ని స్వయంగా జగన్ పరామర్శించారు. ఇతర నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. మరి మధ్యలో కొత్తగా ఈ ఒంటరి వాదనేంటి? అసలా మాటలు అన్నది ఎవరు? అంబటి ఇంటి దగ్గర గంటల తరబడి టీడీపీ కేడర్ స్వైర విహారం చేసినా…. లోకల్ వైసీపీ కార్యకర్తలు ఎవరూ పెద్దగా రాలేదు ఎందుకు? గుంటూరు వైసీపీలో ఏం జరుగుతోంది? గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్ దాడి సరికొత్త సందేహాలను లేవనెత్తుతోంది. సీఎం చంద్రబాబు మీద అంబటి వివాదాస్పద వ్యాఖ్యలు, అందుకు రియాక్షన్గా టీడీపీ శ్రేణుల దాడిని కాసేపు అలా ఉంచితే… ఆ టైంలో వైసీపీ గుంటూరు నాయకులు, కార్యకర్తల రియాక్షన్ విషయంలో కొత్త కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి రాజకీయవర్గాల్లో. ఈ ఎపిసోడ్తో వైసీపీలో విభేదాలు బయటపడ్డాయన్న చర్చ జరుగుతోంది. ఫ్లెక్సీ వివాదం, ఆ సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆ తర్వాత ఇంటి దగ్గరకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు మాజీ మంత్రి. ఈ వయసులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది చెప్పారు. ఆ టైంలో టీడీపీ, వైసీపీ మహిళా కార్యకర్తల మధ్య వాదులాట, తోపులాటలు జరిగాయి.
పోలీసులు కల్పించుకుని వాళ్ళని పంపించేశాక వివాదం సద్దుమణుగుతోందనుకుంటున్న టైంలో అసలు కథ మొదలైంది. తర్వాత కొద్ది సేపటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అంబటి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గుమిగూడారు. దాదాపు రెండు గంటలపాటు అంబటి రాంబాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు మూకుమ్మడిగా చేసిన దాడిలో ఇల్లు, కార్లు ధ్వంసమయ్యాయి. సరిగ్గా ఇక్కడే సరికొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాధానం లేకుండా చాలామంది మెదళ్ళను తొలుస్తున్నాయి.
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు దాదాపు రెండు గంటలపాటు అక్కడే ఉన్నా, విధ్వంసం జరుగుతున్నా… స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ అటువైపు కూడా ఎందుకు తొంగి చూడలేదన్నది క్వశ్చన్. అంబటి ఇంటి మీద దాడి జరిగే అవకాశం ఉందని ముందే ప్రచారం జరిగినా కూడా… ఎవ్వరూ అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయలేదని చెప్పుకుంటున్నారు. తమ పార్టీ నాయకుడి ఇంటి దగ్గర ప్రత్యర్థులు హంగామా చేస్తుంటే… సదరు నేత కేడర్, ఆ పార్టీ లీడర్స్ అండగా నిలబడటం సహజం. కానీ…. గుంటూరులో అంబటి ఇంటి దగ్గర అంతసేపు హై టెన్షన్ నెలకొన్నా… ఎవరూ అటు వైపుగా రాకపోవడం ఏంటన్న చర్చ ఇప్పుడు వైసీపీలో కూడా జరుగుతోందట. అంబటి ప్రెస్ మీట్ సమయంలో గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నూర్ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ వంటి నేతలు మాత్రమే వచ్చారు తప్ప మిగతా ఎవ్వరూ కనిపించలేదు. వైసీపీ కీలక నాయకులు చాలామంది గుంటూరులో ఉంటారు. రాంబాబు ఇంటి దగ్గర జరుగుతున్న హంగామా గురించి బయటికి తెలియకుండా పోలేదు. టీవీ ఛానళ్ళు లైవ్ టెలికాస్ట్లో చూపిస్తూనే ఉన్నాయి. అలా గంటల తరబడి ఆందోళనలు జరుగుతున్నా….వెళ్ళకపోవడం, ఒకవేళ తాము వెళ్లలేకున్నా అనుచరుల్ని మద్దతుగా పంపకపోవడం ఏంటి? దీని వెనకున్న మేటర్ ఏంటని ఫ్యాన్ లీడర్సే ఆరా తీస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఉన్నవాళ్లు కొద్దిగా ప్రతిఘటించినా…. పరిస్థితి ముందుగానే ఊహించి ఉంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఉంటే పోలీసులు ముందు జాగ్రత్తగా రెండు వర్గాలను పంపించి ఉండేవారంటున్నారు.
వైసీపీలో ఇలాంటి చర్చలు జరుగుతుంటే మరోవైపు గతంలో ఆ పార్టీ తరపున గెలిచి ప్రస్తుతం జనసేనలో ఉన్న నాయకుడు కిలారి రోశయ్య చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం రేపుతున్నాయి. వైసీపీలో అంబటి రాంబాబు ఒంటరివాడయ్యాడని, ఆయన్ని బలిపశువును చేశారన్నారు కిలారు. అంబటి టైగర్ అని జగన్ అంటున్నారేగానీ…. వాస్తవంలో ఆయనో బలిపశువు, లోపల ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసునన్న కిలారు వ్యాఖ్యలు సరికొత్త సందేహాలను రేపుతున్నాయట. సత్తెనపల్లిలో రాంబాబును ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారన్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉన్నా…. పెత్తనం చేసేది మాత్రం వేరొకరంటూ సంచలన ఆరోపణలు చేశారు కిలారు. అంబటి ఇంటికి సమీపంలోనే ఉన్న స్థంభాలగరువు, కొరిటపాడు ప్రాంతాల్లో వైసీపీకి క్యాడర్ ఎక్కువగానే ఉందని, అక్కడి నుంచి నాయకులు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. టీడీపీ దాడికంటే… ఎక్కువగా ఇప్పుడు కిలారి రోశయ్య వ్యాఖ్యల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారట వైసీపీలో. అంతర్గత విబేధాలున్నాయని పక్క పార్టీకి చెందిన నాయకుడు చెప్పడం ఏంటి? నిజంగానే అలా జరుగుతోందా అంటూ… గుంటూరు వైసీపీ కింది స్థాయిలో కూడా మాట్లాడుకుంటున్నారట. ఇందుకు పార్టీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో, పర్యవసానాలు ఎలా మారతాయో చూడాలి.
