Site icon NTV Telugu

Off The Record : అంబటి రాంబాబు ఆలా ఎలా ఇరుక్కున్నాడు..?

Ambati

Ambati

రండి…చూసుకుందాం…! దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోండి. నేను ఎక్కడికీ పోను, ఇక్కడే ఉంటానంటూ వీర లెవల్లో స్టేట్‌మెంట్స్‌ ఇచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈసారి అలా ఎలా బుక్కయి పోయారు? గతంలో రెండు మూడు సార్లు అరెస్ట్‌ అంచులదాకా వచ్చినా ఎందుకు ఆగింది? ఈసారి ఎక్కడ తేడా కొట్టింది? అరెస్ట్‌కు భయపడబోనన్న నేత చివరికి అడ్డంగా బుక్‌ అవడం వెనక ఏం జరిగింది? అదేంటీ…. అంబటి రాంబాబు అలా ఎలా ఇరుక్కున్నారు….? మామూలుగా అయితే…. ఆయన అట్టా దొరికిపోయే టైప్‌ కాదే…. పొలిటికల్‌ పంచ్‌లైనా, ప్రత్యర్థుల మీద విమర్శలైనా… సెటైరికల్‌గా మాట్లాడుతూ…. ఒంటికి నూనె రాసుకున్నట్టు జారిపోతుంటారే….. ఇప్పుడేమైందబ్బా….? ఇదీ ప్రస్తుతం ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. వైసీపీ వాయిస్‌ కమ్‌ లౌడ్‌ స్పీకర్‌గా చెప్పుకునే అంబటి రాంబాబు గతంలో చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పోలీస్‌ అధికారులతో గొడవపడ్డారు కూడా. అయినా అప్పుడెప్పుడూ లేనిది ఇప్పుడు మాత్రమే అరెస్ట్‌ దాకా ఎందుకు వెళ్ళిందన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో గతానికి, ప్రస్తుతానికి ఉన్న తేడా గురించిన విశ్లేషణలు సైతం జోరుగా ఉన్నాయి. అంతకు ముందు రాంబాబు ఏం మాట్లాడినా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా…. అవి ఒక పరిధికి లోబడే ఉండేవని, ఈసారి మాత్రం తనకు తాను సహనం కోల్పోయి, గీత దాటి ఇంతదాకా తెచ్చుకున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న అంబటి… 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ తరపున గెలిచి జగన్ క్యాబినెట్‌ సెకండ్ ఫేజ్‌లో మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో అదే సత్తెనపల్లిలో ఓడిపోయి… తర్వాత గుంటూరు షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక చాలామంది నాయకులు సైలెంట్‌ అయిపోగా…. అంబటి రాంబాబు మాత్రం మొదట్నుంచి యాక్టివ్‌గానే ఉంటున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టారంటూ ఫిర్యాదు చేసి పోలీసులు కేసు నమోదు చెయ్యలేదంటూ ఏకంగా స్టేషన్ ముందే ధర్నా చేశారాయన. అప్పుడు కేసు బుక్‌ అయింది.

ఇక జగన్‌ రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా పోలీస్‌ రూల్స్‌ని ఉల్లంఘించారంటూ గుంటూరు, సత్తెనపల్లిలో కేసులు పడ్డాయి. ఇక అప్పటినుంచి తనను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని చెప్పుకుంటూ వస్తున్నారు రాంబాబు. అలాగే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగంగా ఆందోళనలు చేపట్టినప్పుడు రెండుసార్లు పట్టాభిపురం సీఐతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అయితే రెండోసారి పట్టాభిపురం పోలీసులు కేసు పెట్టినప్పుడు తనపై గట్టి సెక్షన్లు నమోదు చేశారని, తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని కూడా చెప్పారు అంబటి. అయినా… అప్పుడెప్పుడూ అరెస్ట్‌ ప్రయత్నాలు జరగలేదు. ఇక తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూడా దూకుడుగానే వ్యవహరించారాయన. తిరుమల లడ్డూ మహాపాపం పేరుతో కూటమి నేతలు గోరంట్ల చిల్లీస్ దాభా సెంటర్‌లో ఫ్లెక్సీలు పెట్టారు. వాటి మీద మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి ఫొటోలు వేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీల దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు రాంబాబు. 24గంటల్లోపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారే తొలగించాలని… లేకపోతే తానే తీసేస్తానని కూడా వార్నింగ్‌ ఇచ్చేశారు. మరుసటి రోజే ఆ ఫ్లెక్సీల సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో…. కూటమి నేతలకు మంచి బుద్ది ప్రసాదించాలంటూ పూజలు చేశారు. అయితే ఫ్లెక్సీలు చించడానికి అంబటి ప్రయత్నిస్తారని భావించిన కూటమి నాయకులు ముందే అలర్ట్‌ అయిపోయారు. పూజల అనంతరం అంబటి కారు ఫ్లెక్సీల సమీపంలోకి వచ్చినప్పుడు అక్కడే ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి కారును అడ్డుకున్నారు. సరిగ్గా అక్కడే కథ అడ్డం తిరిగింది. అంబటి వెనక్కు తగ్గకుండా రివర్స్ అవడంతో పాటు….. గతానికి భిన్నంగా ఈసారి సహనం కోల్పోయి మాట్లాడ్డంతో మేటర్‌ మొత్తం తేడా కొట్టింది.

కూటమి కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆయన కూడా కంట్రోల్ తప్పి నోటికి పని చెప్పడం, ఏకంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించే అనుచిత వ్యాఖ్యలు చేసి…. అవకాశం కోసం ఎదురు చూస్తున్నవాళ్ళ చేతికి ఆయనే కత్తి అందించారన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా సంభోదిస్తూ… ఆ స్థాయి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే… ఇప్పుడు ఇంతదాకా వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్లెక్సీ ఎపిసోడ్‌ తర్వాత మీడియాతో మాట్లాడిన రాంబాబు సీఎం చంద్రబాబు విషయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. కానీ…. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ తనను అరెస్ట్ చేసి జైలుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని, తన ఇంట్లో కుక్క కూడా రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదని అన్నారు. ఇక ఆ తర్వాతే అసలు బీభత్సం జరిగిపోయింది. పూర్తిగా సహనం కోల్పోయి మాజీ మంత్రి వాడిన పదజాలంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు అంబటి ఇల్లు, ఆఫీసును ధ్వంసం చేశారు. నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో రాంబాబు గతానికి భిన్నంగా ఈసారి సంయమనం కోల్పోయి అడ్డంగా బుక్కయ్యారని చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. గతంలో సీరియస్‌ వ్యాఖ్యలు చేసినప్పుడు, పోలీసులతో గొడవపడినప్పుడు కూడా పరిస్థితి ఇంతదాకా వెళ్ళలేదని, ఈసారి మాత్రం సీఎంను ఉద్దేశించి వాడిన అభ్యంతరకరమైన పదజాలంతోనే దొరికిపోయారన్నది పొలిటికల్ టాక్‌.

Exit mobile version