Site icon NTV Telugu

Off The Record : బీజేపీ రెండు నియోజకవర్గాల్ని పోలీసులు డిఫరెంట్గాగా ట్రీట్ చేస్తున్నారా?

Bjp

Bjp

బీజేఎల్పీ నేత సొంత జిల్లాలో పోలీస్‌ ఉన్నతాధికారిని ఎందుకు టార్గెట్ చేశారు? అదే జిల్లాలో పార్టీ నాయకులు వరుసబెట్టి ఖాకీల మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినలేదా? లేక నిజంగానే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయా? మతలబేంటి? ఏకంగా సభాహక్కుల మాటలు కమలం నేతల నోటి నుంచి ఎందుకు వచ్చాయి? ఏ ఉమ్మడి జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? ఖద్దర్‌ వర్సెస్‌ ఖాకీ వార్‌ ఎలా మొదలైంది? నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసన సభా పక్షనేత మహేశ్వర్‌రెడ్డికి పోలీసుల మీద కోపం వచ్చింది. ఏకంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారాయన. కింది స్థాయి పోలీసుల పనితీరుకు, ఇటీవల ఒక ఎస్ ఐ ఏసీబీకి పట్టబడడానికి ఎస్పీనే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు పొలిటికల్‌, అటు పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే ఎస్పీ మీద రకరకాల విమర్శలు చేస్తున్న బీజేఎల్పీ లీడర్‌… తాజాగా ఓ అడుగు ముందుకేసి ఎస్పీ పనితీరు మార్చుకోవాలి, లేదంటే సీఎం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించడంతో హీట్‌ పెరిగింది.

పైగా శాసన సభాపక్ష నేతగా అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా, మీరు చేసే ప్రతీ పని మాకు తెలుసని అనడం ఇంకా ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్మల్‌లో గంజాయి, డ్రగ్స్ మాఫియాను ఎందుకు అరికట్టడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించడం పోలీస్ వర్గాల్లో చర్చకొస్తోంది. అన్నిటికీ మించి హిందూ పండగలకే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారంటూ ఆయన ప్రశ్నించడంతో… మేటర్‌ ఎట్నుంచి ఎటు పోతోందన్న చర్చలు మొదలయ్యాయి. పైగా… నిర్మల్ బంద్‌కు పిలుపునివ్వడం, పాటించడంతో అసలేం జరుగుతోంది? బీజేఎల్పీ నేతతో ఇంకెవరైనా మాట్లాడిస్తున్నారా..లేక ఆయనే ఏదో మనస్సులో పెట్టుకుని ఎస్పీని టార్గెట్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిర్మల్ జిల్లాలో మాత్రం రెండు నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల విషయంలో ఎస్పీ కాస్త డిఫరెంట్‌గా వ్యవహరిస్తున్నారన్నది బీజేపీ మాట.

అందుకే ఎస్పీని ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటూ డిమాండ్‌ పెడుతున్నారు కమలం లీడర్స్‌. నిర్మల్ జిల్లా ఎస్పీగా జానకీ షర్మిల 2024, జనవరిలో బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుండి శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ అక్క, టీమ్ శివంగి’ వంటి మహిళా భద్రతకు సంబంధించిన వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారామె. అయితే… ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిలను కించపర్చేలా మాట్లాడరనే వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అయ్యాయి. అయితే పోలీసులు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎవరో కావాలని బద్నాం చేస్తున్నారంటూ పోలీస్‌ శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే… దాంతో సంబంధం లేకుండా తాజాగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అదే సబ్జెక్ట్‌ మీద కామెంట్స్‌ చేయడం కలకలం ఆసక్తికరంగా మారింది.

అలాగే మరో బీజేపీ నేత,నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ సైతం ఆదిలాబాద్ జిల్లా పోలీసుల తీరుపై ఇటీవల విమర్శలు గుప్పించారు. పోలీసుల అతితో చివరికి రైతులు పొలం వెళ్లాలన్నా భయపడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో కామెంట్స్‌ చేశారాయన. దీంతో… వరుసబెట్టి బీజేపీ నాయకులు ఉమ్మడి జిల్లా పోలీసుల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారన్న చర్చలు మొదలయ్యాయి. వీళ్ళు చెప్పినట్టు పోలీసుల వినలేదా? లేకుంటే… తప్పును చేసిన వారిని కాపాడబోతే అడ్డుపడ్డారా అంటూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో పోలీసులు కూడా వీళ్ళు ఆరోపిస్తున్న తీరుగా వ్యవహరిస్తున్నారా అన్నది ఇంకొందరి డౌట్‌. అయితే… కారణాలు ఏవైనాసరే…. బీజేఎల్పీ స్థాయి నేత జిల్లా ఎస్పీని టార్గెట్ చేయడం, వివిధ రకాల ఆరోపణలు చేయడం మాత్రం హాట్‌ టాపిక్‌ అవుతోంది. శాసనసభ్యుడి ఆరోపణల మీద పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

Exit mobile version