పార్టీ పేరు విషయంలో కల్వకుంట్ల కవిత తొందరపడ్డారా? కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుని ప్రకటించేదాకా ఆగకుండా ఇబ్బందుల్ని తెచ్చుకున్నారా? ఇప్పుడు టీఆర్ఎస్ పేరు మార్చక తప్పదా? ఆ పేరుపై సీఈసీ లేవనెత్తిన అభ్యంతరాలేంటి? మార్చమని చెప్పడానికి చెబుతున్న కారణాలేంటి? ఈ పరిస్థితుల్లో కవిత ఏం చేయబోతున్నారు?
తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు టీఆర్ఎస్ అన్న పేరును ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ… ఇప్పుడు అదే పేరు చుట్టూ… వివాదాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి… భారత రాష్ట్ర సమితిగా మారడంతో… ప్రస్తుతం టీఆర్ఎస్ టైటిల్ దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత తన పార్టీ…పేరు తెలంగాణ రక్షణ సేన అంటూ…. టీఆర్ఎస్ అర్ధం వచ్చేలా ప్రకటించేశారు. కానీ… ఆ జోరుకు కేంద్ర ఎన్నికల సంఘం
బ్రేకులేసింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మార్చి తీరాల్సిందేనంటూ తాజాగా కవితకు లేఖ రాసింది. టీఆర్ఎస్ పేరుపై ఇప్పటికి వెయ్యికిపైగా అభ్యంతరాలు రావడంతో దాన్ని పక్కనపెట్టి 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని సీఈసీ నుంచి కవితకు సమాచారం అందింది. వాస్తవానికి కొత్తగా పార్టీ పేరు రిజిస్టర్ చేసే సమయంలో చాలా ప్రాసెస్ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. అప్పటికే ఉన్న పార్టీల పేరు రాకుండా, లేదంటే షార్ట్ ఫామ్లో ఒకేలా ధ్వనించకుండా జాగ్రత్తపడాలి. అలా చేయకుంటే అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆగిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కవిత తెలంగాణ రక్షణ సేన విషయంలో కూడా అదే జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిని షార్ట్ఫామ్లో టీఆర్ఎస్ అని పిలిచేవారు. ఇప్పుడు కవిత పార్టీకి కూడా షార్ట్ఫామ్లో అదే సౌండ్ వస్తోంది.ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి గులాబీ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడే… పాత టైటిల్ను ఎవ్వరికీ కేటాయించవద్దంటూ
ఈసీకి లేఖ రాసింది.
అదే ఇప్పుడు కవిత పార్టీ పేరుకు ఆటంకం అవుతోందట. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు గురించి రోజు రోజుకు హాట్ డిస్కషన్స్ పెరిగిపోతున్నాయి. ఆ రకంగా తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్న కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరుకు ఆరంభంలోనే ఎండ్ కార్ట్ వేసింది ఈసీ. టీఆర్ఎస్ పేరు మీద వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చినందున అందుకు బదులు మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని కవితను కోరింది కేంద్ర ఎన్నికల సంఘం. వాటిని కూడా…. 15 రోజుల్లోగా పంపకపోతే…. ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను మూసేస్తామని కూడా ఈసీ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ… అధికారంలోకి వచ్చాక 2022లో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్తో విభేదించిన కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కవిత గత ఫిబ్రవరిలో ఐదు పేర్లను సూచిస్తూ సీఈసీకి లేఖ రాశారు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి అనే పేర్లను ప్రతిపాదించారు. అయితే ఏప్రిల్ 25న మునీరాబాద్లో కొత్త పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రకటించేశారు. ఏప్రిల్ 28న కవిత కొత్త పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ప్రాథమికంగా గుర్తిస్తూ నెల రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని పత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. అయితే తాజా పరిణామ క్రమంలో…
పార్టీ పేరు మార్చబోనని, న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారట కవిత.

