OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?

Otr

Otr

పేరుకు ఉమ్మడి సంసారమేగానీ… అక్కడ ఒకరితో ఒకరికి వీసమెత్తు పొత్తు కూడా కుదరడం లేదట. వాతావరణం చూస్తుంటే… రేపు మున్సిపల్‌ ఎన్నికల్లో… ఎవరో వచ్చి ఓడించాల్సిన పనిలేదు. మనల్ని మనమే ఓడించుకుంటామంటూ కూటమి కేడర్‌ కామెంట్‌ చేస్తోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏయే నియోజకవర్గాల్లో అంత భయం పెరుగుతోంది? పొచ్చు పోట్లకు సిద్ధమవుతున్న ఆ నాయకులు ఎవరు?

కర్నూలు జిల్లా ఆదోని, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి పార్టీలు ఒక్కరోజు కూడా కలసి నడిచినట్టు కనిపించలేదు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా కూటమి సంసారంలో కలతలు తప్పలేదట. టీడీపీ, బీజేపీ, జనసేన రాష్ట్ర స్థాయిలో ఒకలా ఉంటే…ఈ రెండు చోట్ల మాత్రం కాస్త తేడాగా ఉందంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూటమికి ప్రత్యర్థి పార్టీ కంటే ఇంటిపోరే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆదోనిలో టీడీపీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఎమ్మిగనూరులో మూడు ముక్కలాట అడుతున్నారు. ఈ నియోజకవర్గం టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మామూలుగా లేవని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. దీంతో… రెండు చోట్ల అధికార పార్టీల కుమ్ములాటలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ స్కెచ్‌ వేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. శ్రేణులను కూడా సమాయత్తం చేస్తున్నాయి అన్ని పార్టీలు. దీంతో… మున్సిపల్ ఎన్నికలు వస్తే ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందంటూ… కూటమి పార్టీల ముఖ్యనేతలు, క్యాడర్‌లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ కుమ్ములాటలు, అంతర్గత పోరు ఇలాగే ఉంటే… రేపు మున్సిపల్‌ ఫలితాలు దారుణంగా ఉంటాయన్న భయం కేడర్‌ని వెంటాడుతోందట. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి, టీడీపీ ఇన్ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య విబేధాలు ఏ రేంజ్‌లో ఉన్నాయి. రెండు వర్గాలు గతంలో రోడ్డెక్కి బహిరంగ విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ పెద్దలు జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు లేదట. కలసి పనిచేయడం, లేదా కలసి కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యం కాదని కేడర్‌ మాట్లాడుకుంటోంది. ఇక ఇంటర్నల్‌గా టీడీపీలోనూ వర్గాలున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి అనుకూలంగా ఒకవర్గం, వ్యతిరేకంగా మరో వర్గం పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో… మున్సిపల్ ఎన్నికలు ఆదోని కూటమికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయంటున్నారు. ఈ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉండగా పునర్విభజనలో మరో 10దాకా పెరగవచ్చు.

ఇక కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక, వార్డుల పంపిణీ లాంటి అంశాల్లో బీజేపీ, టీడీపీ మధ్య తీవ్ర ప్రతిష్టంభన తప్పేలా లేదంటున్నారు. ఆదోని లేదా ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని బీజేపీ అడుగుతోందట. పెద్దల జోక్యంతో ఆ సమస్య పరిష్కారం అయినా… ఎన్నికల్లో పరస్పరం సహకరించుకునే పరిస్థితి మాత్రం లేదన్న మాటే గట్టిగా వినిపిస్తోంది. వెన్నుపోట్లు తప్పేలా లేవంటూ ఎవరికి వారు భయపడుతున్నట్టు సమాచారం. ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ… రెండు పార్టీల్లోనూ ఇంటర్నల్‌ గ్రూపులు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డికి అనుకూల, వ్యతిరేకవర్గాలు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అటు బీజేపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎమ్మెల్యేకి అనుకూలంగా, మరొకటి వ్యతిరేకంగా పని చేస్తుంటే…. ఇక థర్డ్‌ గ్రూప్‌ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా వైసీపీకి వత్తాసు పలుకుతోందని కాషాయ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా పునర్విభజనలో మరో 10 దాకా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేతో విభేదించిన టీడీపీ నాయకులు కొందరు బీజేపీలోకి, కొందరు వైసీపీ లోకి వెళ్లారు. పార్టీలో కొనసాగుతున్న వారిలోనూ అసంతృప్తి వాదులు ఉన్నారట. ఇలాంటి వాతావరణంలో….. రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఎలా వస్తాయంటూ సొంతోళ్ళే ప్రశ్నిస్తున్నారు. అసలు పెద్దలు జోక్యం చేసుకున్నా… స్థానిక విభేదాలతో వీళ్ళంతా ఐక్యంగా పనిచేసేది డౌటేనని అంటున్నారు కార్యకర్తలు. వాళ్ళు సెట్‌ అవుతారా లేదా అన్న సంగతి పక్కనబెట్టి… ఇప్పటి నుంచే ముఖ్య నాయకులు రంగంలోకి దిగితే…. ఎంతోకొంత ప్రయోజనం ఉండొచ్చన్నది కేడర్‌ వాయిస్‌.