ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలూ చావోరేవో అని తేల్చుకోవాల్సిన సమయం ఇది. కానీ అధికార టీడీపీలోనే ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయట. ఎమ్మెల్యేల వ్యవహారాలు పార్టీకి తలనొప్పిగా మారాయట. మరోసారి కొందరు ఎమ్మెల్యేలకు క్లాస్ తప్పదేమోననే మాట వినిపిస్తోంది.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలకు టార్గెట్ కానున్నాయా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీలో. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల మూడు నెలలు అయింది. దాదాపు ఏడాది కాలంగా సీఎం చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి పనితీరు ఘోరంగా ఉందని టీడీపీలోనే చర్చ జరుగుతోందట. 30 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారట. మరో 40 మంది పరిస్థితి అంతంత మాత్రంగా ఉందట. మరోవైపు ముఖ్యమంత్రి మాత్రం స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేల తీరు అలా ఉంటే… లోకల్ పోల్స్లో పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళన టీడీపీ అధిష్టానంలో కనిపిస్తోందట. 40కి పైగా ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఆ ఎమ్మెల్యేలకు మరోసారి క్లాస్ తప్పదా..? అని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయట. ఎమ్మెల్యేలు కౌన్సెలింగ్కు రెడీ కావాల్సిన పరిస్థితి వచ్చిందని చర్చ జరుగుతోందట.
స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. టీడీపీ ఎమ్మెల్యేలందరికీ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న నేతలను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు పనిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పెర్ఫామెన్స్ కీలకం కానుంది. ఎమ్మెల్యేలు చెమటోడ్చి కష్టపడి పనిచేసి ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ సాధించలేకపోతే పరిస్థితి సీరియస్గా మారే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు అలెర్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలకు మరో దఫా కౌన్సెలింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌన్సెలింగ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెర్ఫామెన్స్ చూపించాలని చెప్పడం, పార్టీ లక్ష్యాలను స్పష్టంగా వివరించడం మొదటి పార్ట్. ఎమ్మెల్యేలు తమ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పడం రెండో పార్ట్. లోకల్ ఎన్నికల్లో పని చేయకపోయినా.. సరైన ఫలితాలు సాధించలేకపోయినా.. పద్దతి మార్చుకోలేకపోయినా తీసుకోబోయే చర్యలు మూడో పార్ట్. అని తెలుస్తోంది. ఇలా కౌన్సిలింగ్ ఇచ్చి తీరుగా సరిగాలేని కొంతమంది ఎమ్మెల్యేలను సెట్ రైట్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నారట.
రెండేళ్లు పైబడిన కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటనేది స్థానిక సంస్థలు ఎన్నికల ఫలితాలు బయటపెట్టనున్నాయి. అయితే… అధికారంలో ఉన్నందున కొంత అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అయినా కూడా ఎమ్మెల్యే ల పనితీరు సరిగా లేకపోతే స్థానిక నేతలతో సమన్వయం కష్టం. దీంతో ఆయా ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుని వారి తీరు మార్చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది టీడీపీలో.

