OTR: ఏపీ హోం మంత్రి అనిత ఎక్కడ? వరుస ఘటనలపై ఎందుకీ సైలెన్స్?

Aphomeminister

Aphomeminister

ఏపీ హోం మంత్రి ఎక్కడున్నారు…? ఏం చేస్తున్నారు…? స్టేట్‌లో కొన్ని ఘటనలు వైలెంట్‌గా ఉంటున్నా… ఆమె మాత్రం సైలెంట్‌ మోడ్‌లో ఉండటానికి కారణాలేంటి? చివరికి మిత్ర పక్షాల నేతలు సైతం పెదవి విరవడానికి కారణాలేంటి? మొదట్లో యాక్టివ్‌గా కనిపించిన అనిత ఇప్పుడెందుకు స్థాయికి తగ్గట్టు రియాక్ట్‌ అవడం లేదు? చూస్తా ఉంటే.. మేస్తా పోద్ది అన్న సామెతను బాగా ఒంటబట్టించుకున్నారా? ఏపీ హోం మినిస్ట్రీలో ఏం జరుగుతోంది?

ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా… అత్యంత కీలకమైనది హోం శాఖ. హోం శాఖ మంత్రి అంటే… సీఎం తర్వాత అంత కీలకమైన వ్యక్తి. అయితే…. ఏపీ హోం మినిస్టర్‌ వంగలపూడి అనిత ఆ స్థాయి పాత్ర పోషిస్తున్నారా అన్న సందేహాలు పెరుగుతున్నాయట పలు వర్గాల్లో. ప్రాధాన్యతా నిర్ణయాల సంగతి తర్వాతగానీ…. ముందసలు వివిధ ఘటనలకు సంబంధించి ఆమె నుంచి కనీస స్పందనలు కూడా ఎందుకు ఉండటం లేదన్న చర్చలు జరుగుతున్నాయి. బయటి జనమేకాదు… మిత్రపక్షాలతో పాటు సొంత పార్టీలో కూడా ఇవే అనుమానాలు పెరుగుతున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా ఆమె తన స్థాయికి తగ్గట్టు స్పందించడంలేదన్నది విమర్శకుల మాట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే హోం శాఖ పనితీరు మీద పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏపీ హోం శాఖలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించారాయన. అయితే… మంత్రి అయిన తొలి రోజుల్లో తన శాఖకు సంబంధించి ఏ సమస్య వచ్చినా.. వెంటనే రియాక్ట్‌ అయ్యేవారు అనిత. ఎక్కడ ఏ ఘటన జరిగినా ఆఘమేఘాల మీద వెళ్లేవారు. తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆదేశాలిచ్చేవారు. కానీ… క్రమంగా పరిస్థితి మారిపోయింది. హోం మంత్రిలో ఆ చురుకుదనం తగ్గినట్టు అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

అదే సమయంలో శాంతి భద్రతలతో పాటు వివిధ కీలక అంశాలపై హోం మంత్రి రియాక్షన్‌ ముఖ్యమని, అది ఆశించిన స్థాయిలో లేకుంటే… ప్రజల్లోకి ప్రభుత్వం మీద వ్యతిరేక సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం మిత్రపక్షాల్లో కూడా ఉందట. అసలు ఇప్పుడైతే… ప్రజల సంగతేమోగానీ… సొంత కేబినెట్ సహచరుల్లోనే ఆ అభిప్రాయం కనిపిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ వ్యాఖ్యల తర్వాత ఆయన్ని కలిసి వివరణ ఇచ్చుకున్నారు అనిత. అయినాసరే… ఆ తర్వాత కూడా పద్ధతిలో మార్పు లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రజలతో డైరెక్ట్‌గా కనెక్ట్‌ అయి ఉండేది శాంతి భద్రతల అంశం. ఎక్కడ ఏ ఘటన జరిగినా ప్రజల్లో చర్చ మొదలవుతుంది. ప్రభుత్వం వేగంగా స్పందించకపోతే ప్రతికూలత రావటం ఖాయం. దాని ప్రభావం వెంటనే కనిపించకున్నా… ఒక్కొక్కటిగా జరిగే ఘటనలు ప్రజల్లో అసంతృప్తి పేరుకుని పోయేలా చేస్తాయి. అంతిమంగా పోలింగ్‌ బూత్‌లో అది సైలెంట్‌ రెవల్యూషన్‌ అవుతుంది. అంతటి కీలకమైన శాఖను నిర్వహిస్తున్న మంత్రి అసలిప్పుడు ఏం చేస్తున్నారంటూ కూటమి వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయట.

ఇటీవల ప్రకాశం జిల్లాలో ఏకంగా పోలీసులు వెళ్తున్న కారులోనే గంజాయి దొరికింది. ఆ విషయంలో హోం మంత్రి వెంటనే స్పందించి చర్యలకు ఆదేశించి ఉంటే రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఉండేది కాదనే అభిప్రాయం బలంగా ఉంది. అదే విధంగా రాజమండ్రిలో మెడికో ప్రియాంకను తాగుబోతులు పాశవికంగా కారుతో యాక్సిడెంట్ చేసి.. చంపినా హోం మంత్రి సీరియస్‌గా స్పందించలేదన్న విమర్శలున్నాయి. గుంటూరులో కేవలం మంచినీళ్ళ కుళాయి వివాదంతో ఒక మహిళను వివస్త్ర చేసిన ఘటనపైనా హోంమంత్రిగా అనిత సకాలంలో స్పందించకపోవటం ప్రతిపక్షానికి అవకాశంగా మారిందని అభిప్రాయపడుతున్నారు ఎక్కువ మంది. అలాగే… ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న వివిధ సంఘటనలకు సంబంధించి కూడా హోం మంత్రి రియాక్షన్‌పై విమర్శలున్నాయి. అయితే… అనిత తన శాఖ మీదకంటే ప్రతిపక్షం మీదనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారని, విపక్ష నేతల్ని విమర్శించడం ద్వారా… ప్రభుత్వ పెద్దల మెప్పు పొందితే సరిపోతుందన్న ఫీలింగ్‌లో ఉన్నాయని చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు.

ఏతావాతా… తొలిసారి హోం శాఖ దక్కించుకున్న అనిత… ఆశించిన స్థాయిలో పనితీరు కనపరచలేకపోకతున్నారంటూ కూటమి వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయట. వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యల తర్వాత ఏపీ హోం మంత్రి పనితీరు మీదికి ఎక్కువ మంది దృష్టి మళ్ళింది. దానికి తోడు ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలు కూడా ఇబ్బందికరంగా మారడంతో మినిస్టర్‌ పర్ఫార్మెన్స్‌ రిపోర్ట్‌ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కొన్ని ఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. అలాంటివి ఎవరి చేతిలో ఉండవు. కానీ…ఒక ఘటన జరిగాక హోం మంత్రి ఎలా రియాక్ట్‌ అవుతారు? ఎంత త్వరగా చర్యలకు ఆదేశిస్తారన్నదాన్ని బట్టే… సదరు మంత్రితో పాటు ప్రభుత్వ పని తీరుకు కూడా జనం మార్కులు వేస్తుంటారు. కానీ… అనిత మాత్రం పొలిటికల్‌ యాక్టివిటీలో ఉన్నంత స్పీడ్‌గా శాఖ నిర్వహణలో మాత్రం ఉండటం లేదని, అంతిమంగా అది కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తుందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.