Site icon NTV Telugu

Off The Record: అక్కడ మహేష్ వర్సెస్ సంజయ్

Maxresdefault (2)

Maxresdefault (2)

తెలంగాణలో ఆ నియోజకవర్గం కోసం పోట్ల గిత్తల్లా కొట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు | OTR | Ntv

కాంగ్రెస్‌ పార్టీకి కుమ్ములాటలు కొత్త కాకున్నా… తెలంగాణలో ఇప్పుడొక అసెంబ్లీ నియోజకవర్గం కోసం పోట్ల గిత్తలు పోరాడుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటున్నాయి. కొత్తగా వచ్చిన పాత నేత ఒకరు కాగా… పార్టీలోనే ఉండి రాష్ట్ర స్థాయి పదవి దాకా ఎదిగారు మరొకాయన. ఇంతకీ ఎక్కడుందా అసెంబ్లీ నియోజకవర్గం? ఎవరా ఇద్దరు నాయకులు? వాళ్లలో ఖచ్చితంగా ఒకరికే కాంగ్రెస్‌ టిక్కెట్‌ వస్తుంది గనుక మరొకరు ఏం చేసే ఛాన్స్‌ ఉంది?

కాంగ్రెస్‌లో నిజామాబాద్‌ అర్బన్‌ కాక
తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగిన తాజా పరిణామాలు నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాక రేపుతున్నాయి. ఈ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్సెస్ కావడంతో.. ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్నారట పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్. ఈ సారి అర్బన్ నాదేనంటూ కాంగ్రెస్ పెద్దలకు హింట్ కూడా ఇచ్చేశారట. కానీ.. పరిణామాలు ఊహించని విధంగా మారిపోయాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ పార్టీలో చేరడంతో.. మహేష్ గౌడ్‌కు ఊపిరి సలపడంలేదట. అసలు జిల్లాకు చెందిన తనకు సమ్మతం లేకుండా ఆయన్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని పీసీసీ, ఏఐసీసీ పెద్దలను అడగడంతోపాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట మహేష్‌. డీఎస్ పార్టీలో చేరకుండా చివరి వరకు ప్రయత్నం చేశారట. ఐతే అదిష్ఠానం ఆదేశాలతో ఇక ఇష్టం లేకున్నా స్వాగతించారట. అంత వరకు సరే అనుకున్నా… సంజయ్ నిజామాబాద్‌ అర్బన్ టికెట్టు మీద కన్నేశారని జరుగుతున్న ప్రచారం పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. తాను పోటీ లో ఉన్నానని అదిష్ఠానం పెద్దలకు ఒకవైపు గుర్తు చేస్తూనే… పార్టీలో చేరిన అందరికీ టిక్కెట్‌ హామీ ఉండదని ప్రచారం మొదలుపెట్టేశారట. ఆ విధంగా తాను రేసులోనే ఉన్నానని కేడర్‌కు సంకేతాలు పంపుతున్నారట మహేష్‌ గౌడ్‌.

డీఎస్‌కు, మహేష్‌కు 2009 నుంచి విభేదాలు?
సీనియర్‌ లీడర్‌ డీఎస్‌కు, మహేష్ కుమార్ గౌడ్ కు మధ్య 2009 నుంచి రాజకీయ విబేధాలున్నాయి. డీఎస్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో..తాను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడ్డారని అసంతృప్తితో ఉన్నారట మహేష్ కుమార్ గౌడ్. జిల్లా పరిషత్ ఛైర్మన్ అవకాశం ఉన్నా జడ్పీటీసీ టికెట్టు రాకుండా, 2009 లో రూరల్ ఎమ్మెల్యే టికెట్టు రాకుండా అడ్డుపడ్డారట డీఎస్‌. ఆందుకే ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఆ గ్యాప్‌ కొనసాగుతూనే ఉంది. పార్టీ నుంచి డీఎస్ వెళ్లి పోయాక మళ్లీ రాకుండా మహేష్ గౌడ్ అధిష్ఠానానికి లేఖలు రాసి అడ్డుపడ్డారట. కొద్ది నెలల పాటు డీఎస్‌ను అడ్డుకోగలిగిన మహేష్‌ ఇప్పుడు ఆయన కుమారుడి చేరిక పై అసంతృప్తితో ఉన్నారట. డీఎస్‌ ఇటీవలే కాంగ్రెస్‌లో తిరిగి చేరి మరుసటి రోజే తూచ్… నాకు సంబంధం లేదంటూ రాజీనామా లేఖ ఇచ్చారు. అయినా ఆయన కుమారుడు సంజయ్‌ మాత్రం కొనసాగుతున్నారు.

ఉన్న గ్రూపులకు తోడు మరో గ్రూపు వార్
ఈసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా… సంజయ్‌కి అర్బన్ టికెట్టు ఎలా వస్తుందో చూస్తానని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట మహేష్‌. దీంతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్న గ్రూపులకు తోడు మరో గ్రూపు వార్ మొదలైనట్టయింది. అర్బన్ టికెట్టు ఆశిస్తున్న మహేష్ కుమార్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కేశ వేణు, మైనార్టీ నేత తాహేర్ బిన్ హందాన్ ఒక వర్గంగా తయారై… మనలో ఎవరికి టికెట్టు వచ్చినా ఓకే కానీ.. ఆయనకు మాత్రం రానివ్వకూడదని జట్టు కట్టారట.ఇటు సంజయ్ సైతం అర్బన్ సీటు పై కన్నేసి ఫోకస్ పెట్టేశారట. పార్టీలో చేరిక వివాదంగా మారడంతో ఏం చేయాలో తోచక ప్రస్తుతానికి సైలైన్స్ మోడ్ లోకి వెళ్లారట సంజయ్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో అర్బన్ టికెట్టు పై రాజుకున్న వివాదం ఎటు వైపునకు దారితీస్తుందో చూడాలి. అసలే వంద రకాల సమస్యలతో సతమతమ అవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి నిజామాబాద్‌ అర్బన్‌ రూపంలో మరో తలనొప్పి మొదలైంది. గ్రూప్‌ గొడవలు పీక్స్‌కు చేరుతున్నందున ఎవరికి టిక్కెట్‌ ఇస్తే.. ఎవరు సహకరించకుండా మొండికేస్తారోనన్న టెన్షన్‌ కూడా పార్టీ నాయకత్వంలో ఉందట.

Exit mobile version