Off The Record: మచిలీపట్నం ఎంపీ సీటు విషయమై ఇప్పుడు వైసీపీలో కొత్త చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సింహాద్రి చంద్రశేఖర్ ఓడిపోయారు. అంతకు ముందు 2019లో ఇక్కడి నుంచే ఇదే వైసీపీ నుంచి తరపున పోటీ చేసిన బాలశౌరి విజయం సాధించారు. ప్రస్తుతం జనసేన తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. వైసీపీ ఏర్పాటు తర్వాత ఒక్కసారి మాత్రమే బందరులో గెలవగలిగింది. కాపు సామాజికవర్గం ప్రయోగంతో బాలశౌరి రూపంలో ఒకసారి గెలిచి, సింహాద్రి చంద్రశేఖర్ రూపంలో మరోసారి ఓడిపోవడంతో…. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఇవ్వాలన్న అంశంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాపు, గౌడ సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ గౌడ సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ళ నారాయణకు మూడుసార్లు టిక్కెట్ ఇవ్వగా రెండు విడతలు గెలిచారాయన. 2019లో మూడోసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. వైసీపీ కూడా మొదట బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్థసారధికి టికెట్ కేటాయించింది.
ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోగా… 2019లో కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరికి ఇచ్చారు.ఆయన గెలవడంతో… అదే ఫార్మాట్ను ఫాలో అవుతూ… 2024లో కాపు కులానికే చెందిన సింహాద్రి చంద్రశేఖర్కు ఇచ్చి ఓటమి చవిచూసింది. ఈ పరిస్థితుల్లో… వచ్చే ఎన్నికల్లో బీసీ లేదా ఓసీ… ఏ వర్గానికి టికెట్ ఇవ్వాలన్న అంశంపై ఆల్రెడీ పార్టీలో చర్చ మొదలైంది. అదే సమయంలో గత ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు విషయంలో జరిగిన పొరపాటు గురించి కూడా మాటలు నడుస్తున్నాయట. అప్పట్లో…. ముందు అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ పేరును ప్రకటించింది పార్టీ. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆయన సోదరుడు చంద్రశేఖర్ను బరిలో దింపింది. అభ్యర్థి ఓటమికి కారణాల్లో ఈ గందరగోళం కూడా ఒకటని చెబుతున్నారు వైసీపీ లీడర్స్. అందుకే ఈసారి ఎక్కవ నాన్చకుండా… బీసీనా ఓసీనా అన్నది ముందే తేల్చేసి….ప్రకటించమన్న డిమాండ్ పెరుగుతోంది.
ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా… ఈసారి వాటిలో ఒక బీసీ, ఒక ఎస్సీ, నాలుగు టిక్కెట్లు ఓసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే… ఎంపీ సీటును బీసీలకు ఇచ్చే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందట. ఆకోటాలో.. గత ఎన్నికల్లోనే మాజీ మంత్రి జోగి రమేష్ను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించాలని చర్చ జరిగిందట. కానీ అది ఆచరణలోకి రాలేదు. చివరి నిమిషంలో… సింహాద్రికి టిక్కెట్ ఫైనల్ అయింది. ఈ క్రమంలో ఈసారి బీసీల విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… మీరు టిక్కెట్ ఎవరికైనా ఇవ్వండిగానీ… ఆ ఎవరన్నది ముందే తేల్చండి.. గందరగోళపు నిర్ణయాలతో నష్టపోతున్నామంటూ స్థానిక నాయకులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది.

