NTV Telugu Site icon

Off The Record: వందల కోట్లకు బినామీ..! ఈఎన్సీ హరిరామ్‌ వెనుక ఉన్న అసలు నేత ఎవరు..?

Enc Hariram

Enc Hariram

Off The Record: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక రికార్డు అయితే అందులో పని చేసిన ఇంజనీర్లది మరో రకం రికార్డు. ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన బ్యారేజ్‌ల కుంగుబాటుకు నాసిరకం నిర్మాణమే కారణమని కేంద్ర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాయి. అలాగే…కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కీలక ఇంజనీర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్‌పై ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు హరిరామ్‌. ప్రాజెక్ట్‌ అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన కీలకంగా వ్యహరించినట్లు గుర్తించారు దర్యాప్తు అధికారులు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్నారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖలోని వాలంతరి డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఉన్నారామె. ఈ క్రమంలో…. ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. ఏప్రిల్ 26న ఉదయం నుంచే ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

Read Also: Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..

షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్‌లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు జరిగాయి. అందులో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ సోదాల్లో భాగంగా షేక్‌పేట, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్, నార్సింగిలో ఫ్లాట్లు, మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో భూములు, శ్రీనగర్ కాలనీలో ఇళ్ళు, బొమ్మలరామారంలో మామిడి తోట, ఫామ్‌హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం లాంటి వాటిని గుర్తించారు. అయితే… ఇందులో కొన్ని ఆస్తులు బినామీల పేర్లపై ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు నలుగురు బినామీల వివరాలను ఏసీబీ సేకరించగా.. మిగతావారి కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఈఎన్సీ హరిరామ్ కెరీర్ మొత్తం అవినీతి పుట్ట అని తేలుతోందట. ఇరిగేషన్ శాఖలో కీలక పదవుల్లో కొనసాగుతూ వస్తున్న హరిరామ్ వెనక ఓ మహిళా ఐఏఎస్ ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో ఓ వెలుగు వెలిగిన సదరు ఆఫీసర్‌ అండతోనే హరిరామ్‌ చెలరేగినట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Suspicious Death: వివాహిత అనుమానాస్పద మృతి.. తిరువూరులో ఉద్రిక్తత..

కాళేశ్వరమే కాకుండా గతంలో నిర్మించిన పలు ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకుని హరిరామ్‌ వందల కోట్లు వెనుకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన అక్రమ సంపాదనకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని జలసౌధలో చర్చించుకుంటున్నారు. ఆ ఐఏఎస్ అండదండలతో హరిరామ్ విర్రవీగే వాడని ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఉద్యోగులు. ఆమె అవినీతి బాగోతం కూడా బయటపడకుండా ఉండేందుకు…తనకు నమ్మకస్తుడైన హరిరామ్ ను ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. సదరు ఐఎఎస్‌కు విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటారన్న పేరు రావడంతో…అవినీతి, అక్రమాల విషయంలో ఎవరికీ అనుమానం రాలేదట. కానీ…. ఇప్పుడు ఈఎన్‌సీ బాగోతం బయటపడం, ఇద్దరి ఆర్థిక సంబంధాలపై గుసగుసలు పెరిగిపోవడంతో… హవ్వ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. సదరు ఐఏఎస్ వీకెండ్ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు హరిరామ్‌కు చెందిన ఫామ్‌హౌజ్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించుకునే వారని చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం పనులకు సంబంధించి ఈఎన్సీ హరిరామ్ కమిషన్ తీసుకుని బిల్లులు పాస్ చేసేవారని, కొన్ని కీలక బిల్లుల విషయంలో ఆ ఐఎఎస్‌ ఆదేశాలు జారీ చేసే వారని చర్చించుకుంటున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలో… హరిరామ్ వెనుక ఉన్న అసలు యజమాని, కమ్‌ ఐఏఎస్ పేరు బయటికి వస్తుందా రాదా అని ఉత్కంఠగా చూస్తున్నారు పరిశీలకులు.