Off The Record: 2024 సార్వత్రిక ఎన్నికలు ఇటు వైసీపీ…అటు తెలుగుదేశం పార్టీల్లో ఎంతో మంది నేతల తలరాతలు మార్చేశాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ తమ ప్రాంతాల్ని శాసిస్తున్న వారిని ఎటూ కాకుండా చేశాయి. ఇలాంటి వారిలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని కొందరు టీడీపీ సీనియర్ నాయకుల గురించి చెప్పాలి. ఇందులో టీడీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసి.. పార్టీకి అండగా నిలబడ్డారు.. ఇంతకీ ఎవరా నేతలంటే.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జితేంద్ర గౌడ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి…టీడీపీలో చాలా సీనియర్ నాయకులు. పార్టీకి మంచి విధేయులు. ఇందులో ముందుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురించి చెప్పాలి. దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రభాకర్ చౌదరి పని చేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ గా, ఎమ్మెల్యేగా పని చేశారు. ఇబ్బందులు ఎదురైనా పార్టీనే నమ్ముకొని పని చేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో అనంతపురంలో తెలుగుదేశం పార్టీ బలంగా నిలిపారు. పార్టీ కేడర్ చెల్లాచెదురుకాకుండా కాపాడుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ కు టికెట్ ఇచ్చింది. ఆయన విజయం సాధించారు. మరోవైపు అసెంబ్లీ టికెట్ రాకపోయినప్పటికీ…ప్రభాకర్ చౌదని పార్టీ కోసం శ్రమిస్తున్నారు. కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.
ఇక మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విషయానికొస్తే.. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, చీఫ్ విప్ గా పని చేశారు. పార్టీకి అత్యంత విధేయుడు, సౌమ్యుడు. అయితే గడిచిన ఎన్నికల్లో ఆయనకు కాకుండా ఆయన కోడలుకు టికెట్ ఇచ్చారు. అధిష్టానం ఆదేశాలు కావడంతో నో చెప్పలేకపోయారు. అయితే ఇన్నేళ్ల పొలిటికల్ కెరియర్ చూసిన రఘునాథ్ రెడ్డి భవిష్యత్తు పై ఆశలు పెట్టుకున్నాడు. అటు గుంతకల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ విషయానికొస్తే.. ఆయన కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి బలంగా పని చేస్తోంది. 2014లో ఎమ్మెల్యే అయిన జితేంద్ర గౌడ్ 19లో ఓడిపోయారు. అయితే 2024లో టికెట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా గెలిచే వారు. కానీ పక్క జిల్లాకు చెందిన గుమ్మనూరు సడన్ గా గుంతకల్లుకు తీసుకొచ్చి పెట్టారు. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి ప్రియార్టీ లేకుండా పోయింది. మడకశిర నియోజకవర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామి…గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. ఆయనకు గత రెండు పర్యాయాలు ఏదో పదవి ఇస్తారని…గడిచిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా అది దక్కలేదు. ప్రస్తుతం బీసీ నాయకుడుగా పార్టీలో కీలకంగా ఉన్నారు. సీనియర్ నేతలు పార్టీ కోసం ఎంతో చేసినా.. వారికి మాత్రం న్యాయం జరగలేదన్న ప్రచారం ఉంది. పైగా టికెట్లు త్యాగం చేసినందుకు పార్టీలో కీలక పదవులు వస్తాయని భావించారు. కానీ వారికి నిరాశ ఎదురయింది. ఇన్ని జరుగుతున్న అధిష్టానం ఏదో ఒక రోజు న్యాయం చేయకపోదా అనే ఆశలో ఉన్నారు. ఇందులో ఒకరిద్దరు వారసులు కూడా రాజకీయాల్లో కీలకంగా ఉండేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని రోజులు వీరు పడ్డ శ్రమకు, చేసిన త్యాగానికి ఫలితం ఇంతేనా.. అని మౌనంగా కాలం వెళ్లదీస్తున్నారు.