Off The Record: కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను ఆగస్ట్ ఒకటిన ఆయన సొంతూరు కిర్లంపూడిలో నిర్వహించబోతున్నారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా… ముద్రగడ అభిమానుల పేరుతో ఈ కార్యక్రమం జరగబోతోంది. చనిపోయాక తనకు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని ముందుగానే కుటుంబ సభ్యులకు చెప్పారట మాజీ మంత్రి. అందుకు అనుగుణంగా ఈ సంతాప సభలో వాళ్ల జోక్యం ఉండటం లేదు. ఇక పార్టీలు, కులాలతో కూడా సంబంధం లేకుండా సంస్మరణ సభకు అంతా హాజరవ్వాలని కోరుతున్నారు ఆయన సన్నిహితులు. ముద్రగడకు ఇచ్చే చివరి నివాళి ఇదేనంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా అందరితోపాటు టిడిపి నేతలకు కూడా పిలుపులు వెళుతున్నాయి. అయితే ఈ కార్యక్రమం అంటేనే తమ్ముళ్లు ఉలిక్కి పడుతున్నారట. ప్రస్తుతం టిడిపిలో జరుగుతున్న పరిణామాలతో అనవసరంగా రచ్చ చేసుకోవడం అవసరమా అంటున్నట్టు సమాచారం. బోండా ఉమా వ్యవహారంతో విషయం పీక్స్ కు చేరింది.. పార్టీ అధిష్టానం కూడా బోండాను వివరణ అడిగిన పరిస్థితి. అదే సమయంలో వైసీపీ నేతలతో కలిసి వేదికలు పంచుకోవద్దని సున్నితంగానే హెచ్చరించింది అధిష్టానం. దీంతో… క్లైమేట్ ఇంత ఘాటుగా ఉన్నప్పుడు అటువైపు వెళ్లకపోవడం ఉత్తమం అని టీడీపీ నాయకులు అనుకుంటున్నట్టు సమాచారం. కాదని మరీ స్పీడ్ అయిపోతే పార్టీలో బాడ్ అయిపోతామని చర్చించుకుంటున్నారట. అదే సమయంలో పార్టీలోనే మరో వర్గం వాదన ఇంకో రకంగా ఉంది.
రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సంబంధాలు ఉండవా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. బోండా ఉమా కాంట్రవర్సీ కామెంట్ చేశారు కాబట్టి వివాదం అయిందని, అలాంటి వాటి జోలికి పోకుండా… మామూలుగా వెళ్లి నివాళులర్పిస్తే తప్పేంటని చర్చించుకుంటున్నారట. కార్యక్రమం ఉద్దేశం ప్రకారం కనెక్ట్ అవ్వాలి గానీ… అనవసరంగా కెలుక్కుంటే పరిస్థితులు అలాగే వరస్ట్ అవుతాయని గుర్తు చేస్తున్నారు కొందరు టీడీపీ లీడర్స్. చనిపోబోయే ముందు వైసీపీలో ఉన్నా… ముద్రగడ సుదీర్ఘకాలం టిడిపిలో పనిచేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీలో తొలినుంచి ఉన్న వాళ్ళతో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి.. అలాంటప్పుడు వెళ్లి చివరి కార్యక్రమానికి అటెండ్ అవడంలో తప్పేండన్నది వాళ్ళ ప్రశ్న. మరోవైపు పద్మనాభం చనిపోయిన రోజు టిడిపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రమే వెళ్లారు. మిగతా వాళ్ళంతా అక్కడ వైసిపి ఫ్లేవర్ వచ్చేస్తుందంటూ కనీసం అటు వైపు తొంగి చూడలేదు. తర్వాత యనమల స్టార్ట్ చేయడంతో ఒక్కొక్కరిగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చేస్తామన్నది కొందరు టీడీపీ నేతల మాట. అయితే…ఇది పేరుకి ముద్రగడ అభిమానులు, అనుచరుల కార్యక్రమంగానీ… వెనకాల ఉన్నది వైసీపీ నేతలే అనేవాళ్ళు సైతం లేకపోలేదు. అలాంటి ప్రోగ్రామ్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకంటూ ప్రశ్నిస్తోంది ఒకబ్యాచ్.
కానీ… అక్కడ ఎవరు ఉంటే మనకేంటి, మన కంట్రోల్ లో మనం ఉంటే సరిపోదా అనే వాళ్ళు సైతం గోదావరి జిల్లాల టీడీపీలోనే ఉన్నారు. అందుకే… ఎవరికి వారు మీరు వెళ్తున్నారా అంటూ గుచ్చి గుచ్చి అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఎవరు ఎవర్ని అడిగినా ప్రస్తుతానికైతే సరైన సమాధానం మాత్రం రావడం లేదట. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందామని విషయాన్ని క్లోజ్ చేసేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ముద్రగడ సంస్మరణ సభ విషయంలో తెలుగు తమ్ముళ్లు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారన్నది క్లియర్. వెళ్తే పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందోనని, వెళ్లకపోతే ఆమాత్రం వ్యక్తిగత సంబంధాలు ఉండవా అన్న యాంగిల్లో గందరగోళ పడుతున్నారట. అధిష్టానం హీట్ మీద ఉంది కాబట్టి ఆ రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండడం బెటర్ అన్నది ఇంకొందరి ఆలోచనగా తెలుస్తోంది. ఇదంతా చూస్తున్న, ఆసక్తిగా గమనిస్తున్నవాళ్లు మాత్రం ముద్రగడ పద్మనాభం చనిపోయాక కూడా టీడీపీని తిప్పలు పెడుతున్నారంటూ చమత్కరించుకుంటున్నారు.

