Off The Record: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు మాట ఎప్పుడో మర్చిపోయిందట. అయినాసరే…. పార్టీలో గ్రూప్ తగాదాల్ని ఏ మాత్రం మరువకుండా అదే టెంపో మెయిన్టెయిన్ చేస్తున్నారంటూ సెటైరిక్ మాట్లాడుకుంటున్నారు సొంత పార్టీ కార్యకర్తలు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి రాఘవేంద్రారెడ్డి వర్గాల మధ్య నిత్యం వర్గపోరు నడుస్తోంది. వైసీపీతో అంటకాగుతూ…, టీడీపీ కార్యకర్తలను అణచివేస్తున్నారని తిక్కారెడ్డి వర్గం, నియోజకవర్గ ఇన్చార్జ్గా నా మాట నెగ్గాలని రాఘవేంద్రారెడ్డి వర్గం వీధికెక్కుతున్నట్టు చెబుతున్నారు. అది ప్రభుత్వ కార్యాలయాలయమైనా, పార్టీ కార్యక్రమమైనా నో మ్యాటర్. రెండు గ్రూపుల మధ్య రచ్చ జరగాల్సిందేనట. ఇటీవల మహానాడు వేదికగా కూడా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాఘవేంద్ర రెడ్డి, తిక్కారెడ్డి వర్గాలు ఎవరికి వారే మంత్రాలయంలో మహానాడు సభలు నిర్వహించారు. పార్టీలో అందరిని కలుపుకొని వెళ్లడం లేదని, ఒంటెత్తు పోకడలకు పోతున్నారని రాఘవేంద్ర రెడ్డి పై తిక్కారెడ్డి వర్గం ఆరోపణలు చేస్తుండగా.. వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తున్నారన్నది రాఘవేంద్ర రెడ్డి అభియోగం.
రెండు వర్గాల మధ్య సమన్వయం లేక ప్రతి కార్యక్రమాన్నిఎవరికి వారే వేర్వేరుగా నిర్వహించడం పార్టీ బలహీనతను తెలియజేస్తోందంటూ మండిపడుతున్నారు కార్యకర్తలు. నియోజకవర్గంలో టీడీపీ కంటే వైసీపీ ఎమ్మెల్యే అనుచరులకే ఈజీగా పనులు చేస్తున్నారని, తెలుగు తమ్ముళ్లను శత్రువుల్లాగా చూస్తున్నారన్నది తిక్కారెడ్డి వర్గం ఆరోపణ. మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కోసిగి పంచాయతీ కార్యాలయంలో రెండు వర్గాలు ఏకంగా కొట్టుకునేంత వరకు వచ్చింది. మాటమాటా పెరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సర్పంచుల పదవీకాలం పూర్తయినా…పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచ్ పనులు చేయిస్తున్నారంటూ తిక్కారెడ్డి వర్గం అభ్యం తరం వ్యక్తం చేసిందట. దాంతో మాటా మాటా పెరిగి కొట్టుకునే స్థితిలో కోసిగి పోలీసులు ఎంటరై ఇరువర్గాల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇక కోసిగి తహశీల్దార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాఘవేంద్రరెడ్డి వర్గానికి మాత్రమే పనులు చేస్తున్నారని పరోక్షంగా ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు తిక్కారెడ్డి మనుషులు. తహశీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అధికార పార్టీ నాయకులే గవర్నమెంట్ ఆఫీస్ ముందు వంటావార్పు చేయడం హాట్ టాపిక్ అయింది. ఇలా మంత్రాలయం నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు అంతకంతకూ పెరుగుతోంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ప్రత్యర్థులు ఓడించాల్సిన అవసరం లేదని, రెండు వర్గాల మధ్య పోరు చాలంటూ సెటైర్లు గట్టిగానే పడుతున్నాయి.

