Off The Record: పితాని మౌనంపై ఉమ్మడి జిల్లాలో రకరకాల చర్చలు..

  • పితాని మౌనంపై ఉమ్మడి జిల్లాలో రకరకాల చర్చలు..
  • వ్యూహాత్మకమా? లేక సీన్‌ అయిపోయిందన్న క్లారిటీనా?..
  • పితాని సత్యనారాయణ తదుపరి అడుగులపై ఆసక్తి..
  • మరోసారి మంత్రి దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారా?..
  • తన రోజు కోసం కామ్‌గా ఎదురు చూస్తున్నారా?..
  • ఆశించింది దక్కకుంటే అప్పుడు చూద్దామని అనుకుంటున్నారా?..
  • యువ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో టీడీపీ అధిష్టానం..
  • ఇప్పుడు సీనియర్స్‌కు కీలక పదవులు దక్కుతాయా అన్న డౌట్స్‌..
  • పితాని సత్యనారాయణ ఆశలపై సవాలక్ష సందేహాలు ..
Otr Pitani Satyanarayana

Otr Pitani Satyanarayana

Off The Record: పితాని సత్యనారాయణ. ఏపీ పాలిటిక్స్‌లో సీనియర్‌ లీడర్‌. పార్టీలు మారినా, అధికారంలో ఎవరున్నా…తన పరపతికి ఢోకా లేకుండా చూసుకోవడంలో దిట్ట అన్న పేరుంది. అలాంటి లీడర్‌ ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా…. మౌనం పాటించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇది వ్యూహాత్మక మౌనమా? లేక సీన్‌ అయిపోయిందా అంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. 2004, 2009లో గెలిచి YS రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో, 2014లో టీడీపీ తరపున గెలిచి చంద్రబాబు కేబినెట్‌లోనూ మంత్రిగా పనిచేశారాయన. అలాంటి సీనియర్‌ ఇప్పుడు సైలెంట్‌ అవడానికి ప్రధాన కారణం ఆశించిన పదవి దక్కకపోవడమేనా అన్న డౌట్స్‌ పెరుగుతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. అదే నిజం, అందులో డౌట్‌ ఎందుకు అనే వాళ్ళు సైతం ఉన్నారు. దీంతో పితాని నెక్స్ట్‌ స్టెప్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది. కాంగ్రెస్‌ టైంలో ముఖ్యమంత్రులు మారినా… తన మంత్రి పదవికి ఢోకా లేకుండా చూసుకున్నారు పితాని. కీలక సమయాల్లో సైతం ఢోకా లేకుండా చూసుకోగలిగిన తాను… ఇప్పుడు ఏం చేయలేకపోతున్నానని ఫ్రస్ట్రేట్‌ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఏపీ కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ మాటలు వినిపిస్తున్న టైంలో… ఇప్పుడు అలర్ట్‌గా ఉండి మరోసారి మంత్రి పదవి దక్కించుకోవాలన్నది ఆయన వ్యూహంగా చెప్పుకుంటున్నారు. తనకంటూ ఒకరోజు కచ్చితంగా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారట. అందుకే…. తన సహజమైన దూకుడు వైఖరికి బదులు కాస్త సైలెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. మన టైమ్ వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూద్దాం, ఆశించింది దక్కుంటే… తర్వాత సంగతి తర్వాత చూద్దామన్న ఆలోచనే మాజీ మంత్రి ప్రస్తుత మౌనానికి కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కీలకమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణకు గతంలో సీనియారిటీ కోటాలో పదవులు వచ్చి వాలిపోయేవి. కానీ…. ఇప్పుడు సీన్‌ ఛేంజ్‌ అవుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో, మరీ ముఖ్యంగా టీడీపీలో సీనియర్ నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం అంతంత మాత్రమేనన్న అభిప్రాయం ఉంది. అసలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2024 ఎన్నికల్లోనే చాలామంది సీనియర్ నేతలను పక్కనపెట్టిన తెలుగుదేశం ఆయా స్థానాలను జనసేనకు కేటాయించింది.

భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని యువనేతలకు ప్రాధాన్యత పెంచాలన్న లక్ష్యంతో ఉన్నారు పార్టీ పెద్దలు. ఈ పరిస్థితుల్లో సీనియర్స్‌కు కీలక పదవులు దక్కుతాయా అన్న అనుమానాలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఆ జాబితాలోనే పితాని సత్యనారాయణ ఉండటం, ఆయన నియోజకవర్గం ఆచంటకు సమీపాన్నే పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు సైతం ఉండటంతో…పితాని ఆశలు ఎంతవరకు నెరవేరతాయన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి పదవుల కోసం పోరాడుతున్న వారి జాబితా ఎక్కువగా ఉండటంతో సీనియర్ నేత పితాని ఆశలు మరోసారి నెరవేరతాయా అన్న డౌట్స్‌ అనుచరగణంలో సైతం ఉన్నాయట. ఈ పరిణామక్రమంలో ఆయన కూడా సైలెంట్‌గా పావులు కదుపుతున్నారని, ఆ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో చూడాలని అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు.