Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?

  • పలాస ఏరియాలో కార్గో ఎయిర్‌పోర్ట్‌ ప్రతిపాదన..
  • భూ సేకరణ విషయంలో కొత్త సమస్యలు..
  • పార్టీలకు అతీతంగా ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక ఉద్యమం..
  • కార్గో ఎయిర్‌పోర్ట్‌తో ఉపాధి అవకాశాలు పెద్దగా రావన్న అభిప్రాయం..
  • ఉపాధిలేని దాని కోసం తోట భూములు ఇవ్వబోమంటున్న రైతులు..
  • వేల ఉద్యోగాలిచ్చే ఫ్యాక్టరీ తీసుకురండి, మేం సిద్ధమంటున్న రైతులు..
  • ఎమ్మెల్యే శిరీషకు రాజకీయ పరిణితి లోపంవల్లే సమస్య అన్న టాక్‌..
  • మూలపేట పోర్ట్‌ దగ్గర వేల ఎకరాలు ఉందంటున్న వైసీపీ..
  • సిద్ధంగా ఉన్న భూమి వదిలేసి దగ్గర్లోనే మరో సేకరణ ఎందుకన్న ప్రశ్న..
Otr Palasa Tdp

Otr Palasa Tdp

Off The Record: సిక్కోలు రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉంటోంది గౌతు కుటుంబం. ఈ ఫ్యామిలీ మూడో తరం నాయకురాలిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు గౌతు శిరీష. ఇప్పుడు ఆమెకే నియోజకవర్గంలో సరికొత్త సమస్యలు ఎదురవుతున్నాయట. పార్టీ పవర్‌లో ఉండటం, తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన, జిల్లా వాసి కింజరాపు రామ్మెహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉండటంతో…. పలాసకు ఓ మంచి ప్రాజెక్ట్ తీసుకురావాలని భావించారట ఎమ్మెల్యే. ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పూర్తి చేయటంతో పాటు ఉపాధి అవకాశాలు సృష్టించేలా ప్రాజెక్ట్‌ కోసం ప్రయత్నించారామె. ఆ క్రమంలోనే….పలాస ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్ట్ పెట్టాలని నిర్ణయించారు. ఇక్కడికి ఆ ప్రాజెక్ట్‌ వస్తే… ఉద్దానం ప్రాంతం అభివృద్ధి అవుతుందంటూ ప్రచారం మెదలు పెట్టారు. అందుకు అవసరమైన భూ సేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేగా గౌతు శిరీష కూడా స్థానికులతో మాటాడే ప్రయత్నం చేస్తున్నారట. కానీ… పాలకులు చెబుతున్న అభివృద్ధి మాటల్ని స్థానికులు విశ్వసించడం లేదు. పైగా… పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కార్గో ఎయిర్ పోర్ట్‌ వ్యతిరేక ఉద్యమం మొదలైంది. మాకసలు అది వద్దే వద్దంటూ…. పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారుల సమావేశాల్లో సైతం మా ప్రాంతానికి కార్గో ఎయిర్‌పోర్ట్‌ అవసరం లేదని చెప్పేస్తున్నారు. అందుకు వాళ్ళ రీజన్స్‌ వాళ్ళకు ఉన్నాయి. పెద్దగా ఉపాధి అవకాశాలు ఇవ్వని కార్గో ఎయిర్ పోర్టు కోసం వేలాది ఎకరాల్లో ఉన్న జీడి, కొబ్బరి, మామిడి తోటల్ని పణంగా పెట్టేలేమన్నది స్థానిక రైతుల మాట. దీని గురించే ఇప్పుడు పలాసతో పాటు శ్రీకాకుళం జిల్లాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలోని పల్లెల్లో చాపకింద నీరులా కార్గో వ్యతిరేక ఉద్యమం విస్తరిస్తోంది. పచ్చని తోటల్ని కొట్టివేయడం తమకు ఇష్టం లేదని అంటున్నారు రైతులు. కొందరైతే… కాస్త డిఫరెంట్‌గా, ఇంకాస్త గట్టిగా తమ వాదన వినిపిస్తున్నారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీ లాంటిది ఏదైనా వస్తే… ఇష్టం లేకున్నా… భవిష్యత్‌ కోసం భూములు ఇస్తాంగానీ…. కేవలం కార్గో ఎయిర్‌పోర్ట్‌ పేరుతో పరిమితమైన ఉపాధి దక్కుతుందంటే అలాంటి ప్రయోజనం లేని త్యాగాలకు మేం సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. పైగా…మా భూమిని లాక్కుని భూ బ్యాంక్ సిద్ధం చేసుకుంటామంటే ఒప్పకునే ప్రసక్తే లేదని అంటున్నారు.

×
×
Ad

ఈ వ్యవహారం మొత్తం అటుచేరి ఇటు చేరి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు చుట్టుకుంటోందట. దశాబ్దాలుగా గౌతు ఫ్యామిలీకి అండగా నిలుస్తున్నారు ఇక్కడి ప్రజలు. సర్దార్‌ గౌతు లచ్చన్నకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కుమారుడు గౌతు శివాజీ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేయటంతో పాటు, మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. కానీ… శివాజీ కుమార్తె అయిన శిరీషకు రాజకీయ పరిణితి లోపించిందని, ప్రజల మనోగతాన్ని తెలుసుకోలేకపోతున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వెళితే… వాళ్ళకు మంచి చేయాలనుకోవడం ఏమోగానీ… భవిష్యత్‌లో ఇబ్బందులు మాత్రం తప్పవంటూ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులే హెచ్చరిస్తున్నారు. దీనిపై వైసీపీ కూడా ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. మూలపేట పోర్ట్‌ దగ్గర వేలాది ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నప్పుడు దానికి దగ్గర్లోనే… ఇలా మరో భూ సేకరణ అవసరమా అన్నది ఫ్యాన్‌ క్వశ్చన్‌. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా… తమ ప్రాంతానికి వచ్చిన ప్రాజెక్ట్‌ విషయంలో అడుగు ముందుకేయాలా? లేక ప్రజాభీష్టం పేరుతో ఆపేయాలో అర్ధంగాక గందరగోళంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.