NTV Telugu Site icon

Off The Record: ఆ వైసీపీ ఎంపీ పార్టీ మారుతున్నారా..?

Mp Golla Baburao

Mp Golla Baburao

Off The Record: గొల్లబాబూరావు.. పబ్లిక్ సర్వెంట్ టర్న్‌డ్‌ పొలిటీషియన్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ. అంతకు మించి వైఎస్‌ కుటుంబానికి వీర విధేయుడు. ఇవన్నీ ఎంత నిజ మో.. ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఆయనకు ఆశించిన స్ధాయిలో గౌరవం దక్కలేదన్నది అంతే నిజం. కేబినెట్లో స్ధానం కోసం ఎదురు చూసిన బా బూరావుకు చేదు అనుభవమే మిగిలింది. తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు సభ్యుడి పదవిని అధినాయకత్వం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. దీంతో రెండు అవకాశాలు మిస్‌ అయిపోయాయి. ఈ క్రమంలో అధినాయకత్వంతో గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం విస్త్రతంగా జరిగింది. అందుకు తగ్గట్టుగానే గొల్ల బాబూరావు సిట్టింగ్ సీటైన పాయకరావుపేటలో అంతర్గత వర్గపోరు పరాకాష్టకు చేరింది. ఆ క్రమంలోనే ఆయనకు ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్‌ కూడా దక్కలేదు. అయితే… మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం,.విధేయత, సామాజిక సమీకరణల లెక్కలు వేసుకుని అధిష్టానం ఊహించని ఛాన్స్‌ ఇచ్చింది ఆయనకు. రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ పంపింది. అటు, బాబూరావు కూడా రాజ్యసభ ఎంపీగా కొత్తల్లో జోష్‌గా కనిపించారు.

కానీ క్రమంగా సీన్‌ మారుతోందని అంటున్నారు. పార్టీ అధిష్టానంతో పాత ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ కుదరడం లేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు గోల్డెన్‌ ఛాన్స్ దక్కిందని అనుకుంటున్నా… రాజకీయంగా తాను మరింత బలోపేతం కావడం, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ దిశగా ఆయన బాధలేవో ఆయన పడు తుంటే… ఊహించని రీతిలో కొత్త కొత్త ప్రచారాలు… సొంత పార్టీలోనే అనుమానపు చూపులు ఎంపీగారి మనోభావాలను దెబ్బతీస్తున్నాయట. అది కూడా ఎటువంటి సంబంధంలేని వ్యవహారాలతో ముడిపెట్టడంపై గుస్సా అవుతున్నారట గొల్ల. ఇటీవల వైసీపీ రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి, బీద మస్తాన్ రావులు రాజీనామాలు చేశారు. రాజకీయంగా ఆ పరిణామం వైసీపీ అధిష్టానాన్ని కలవరపెట్టింది. దీంతో తర్వాత పార్టీకి గుడ్ బై కొట్టేసేది ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ఇంటాబయట అనుమానపు చూపులు బయలుదేరగా… ఈ ఎపిసోడ్‌తో ఎటువంటి సంబంధం లేకపోయినా గొల్ల బాబూరావుకు మాత్రం అగ్నిపరీక్షగా మారిందట.

ఫైర్ బ్రాండ్ ఇమేజ్ లేకపోయినా ఐడెంటిటీకి భంగం కలిగినప్పుడు తిరగబడే తత్వం బాబూరావుది.అదే చిత్ర విచిత్రమైన ప్రచారాలకు కారణం అవుతోందంటున్నారు సన్నిహితులు. ఆయనకూడా పార్టీ మారిపోతారన్న ప్రచారం ఓ రేంజ్‌లో జరగడం ఎంపీసాబ్‌ని చికాకు పెడుతోందట. ఎవరైనా తన ముందు ఈ అంశాన్ని ప్రస్తావించినా…మీడియా ప్రతినిధులు వివరణ అడిగినా శివాలెత్తిపోతున్నారట. వెనుకబడిన వర్గాలకు చెందిన వాడిని కాబట్టే రాజకీయ పన్నాగం పన్ను తున్నారని కౌంటర్ ఎటాక్ చేయడం ద్వారా జరుగుతున్న ప్రచారాలకు చెక్ పేట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు. దీంతో బాబూరావు వేదన అంతులేని కథ కంటే ఎక్కువగా వుందని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అదే సమయంలో గొల్ల సైతం గంభీరంగా మాట్లాడుతున్నారే తప్ప తాను వైసీపీలోనే ఉంటానని, అధినాయకత్వం ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తానని కరాఖండీగా చెప్పడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం ఏముందని ఒకసారి…కాలం,కారణం కుదరాలని మరోసారి మాట్లాడుతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదన్నది రాజకీయ వర్గాల మాట. దీనిని బట్టి చూస్తే పార్టీ మారాలనే ఆలోచన లేకపోయినప్పటికీ తన ఐడెంటిటినీ కాపాడుకోవడం కోసం బాబూరావు కొంత కుషన్ పెట్టుకుని ఉండవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఏది నిజమో తేలాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.