Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో మళ్లీ రచ్చ మొదలైందా..! ఇన్నాళ్లు కూల్గా ఉన్న పార్టీలో వివాదాల అలజడి రిపీటవుతోందా అంటే… ఔను అన్నదే రాజకీయవర్గాల సమాచారం. గాంధీ భవన్ వేదికగా.. మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. తన మీద వరుసగా వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇస్తూనే… దీని వెనకాల ఉన్నది ఎవరంటూ కొత్త ప్రశ్న సంధించారాయన. అది సొంత పార్టీ నేతల కుట్రనేనని కామెంట్ చేస్తూ…. మరింత స్పష్ట ఇవ్వడానికి మొగ్గు చూపారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళ వల్లనే ఇదంతా జరుగుతోందన్న అంశాన్ని ప్రస్తావించారు ఎమ్మెల్యే. ఈ క్రమంలో పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు… మంత్రి వివేక్ మధ్య చాన్నాళ్ళుగా వివాదం రగులుతూనే ఉంది. మొదట్నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు ప్రేమ్సాగర్రావు. ఆదే విషయాన్ని ఇప్పుడు కూడా ప్రస్తావిస్తూ…. నేను రేస్లో ఉన్నాను కాబట్టి కేబినెట్ విస్తరణ అన్న ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నాపై ఆరోపణలు చేయడం కామన్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏమీ లేకపోయినా… పనిగట్టుకుని నామీద దుష్ప్రచారం చేయిస్తున్నారన్నది ఆయన మాట. దీంతో ఉమ్మడి జిల్లాలో మంత్రి వివేక్ వర్సెస్… ప్రేమ్ సాగర్ రావు వ్యవహారం మరోసారి గాంధీభవన్ సాక్షిగా చర్చనీయాంశం అయింది. ప్రెస్మీట్లో పేరు ప్రస్తావించకుండా మంత్రి వివేక్ను ఎమ్మెల్యే టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. వివేక్కు మంత్రి పదవి వచ్చినప్పటి నుండి… ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అది ఇప్పుడు ముదిరి పాకాన పడిందని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పని చేసింది… కాపాడుకుంటూ వచ్చింది నేను… కానీ, మధ్యలో వచ్చిన వాళ్ళు అప్పనంగా పదవులు పొందటంతో పాటు… మా పై ఆరోపణలు చేయిస్తున్నారంటూ మండిపడ్డారాయన. అలాగే తన అప్పులపై కూడా క్లారిటీ ఇచ్చారు ప్రేమ్ సాగర్ రావు. ఐతే… ఇప్పటి వరకు ఆయన కామెంట్స్ పై మంత్రి వివేక్ నేరుగా స్పందించలేదు. తన అప్పుల ఎపిసోడ్ బయటకు రావడం వెనక కూడా పార్టీలోని ప్రత్యర్ధి నేతలే ఉన్నారని ప్రేమ్సాగర్రావు చెప్పడంతో ఉమ్మడి జిల్లాల్లో మళ్ళీ రాజకీయం రంజుగా మారింది. ఐతే ఇది ఎటు దారి తీస్తుందోనని గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

