Site icon NTV Telugu

Off The Record : కనిగిరి వైసీపీలో దద్దాల వర్సెస్ బుర్రా..

Otr Kanigiri Ysrcp Politics

Otr Kanigiri Ysrcp Politics

Off The Record : ప్రకాశం జిల్లా వైసీపీలో క‌నిగిరి రాజకీయం రసవత్తంగా నడుస్తోంది. ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్‌ ద‌ద్దాల నారాయ‌ణ, కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నిక‌ల్లో క‌నిగిరి నుంచి గెలిచిన మ‌ధుసూదన్‌ యాద‌వ్‌ను గ‌త ఎన్నిక‌ల్లో కందుకూరుకు షిఫ్ట్‌ చేసింది వైసీపీ అధిష్టానం. కానీ…. అక్కడ ఓడిపోయాక తిరిగి త‌న పాత నియోజ‌క‌వ‌ర్గం మీదికే బుర్రా మనసు మళ్ళింది. కనిగిరి అయితేనే త‌న‌కు సేఫ్ అన్న ఉద్దేశ్యంతో…. ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తాన‌ని స‌న్నిహితులకు చెబుతున్నారట. ఆ విషయం తన చెవిన పడ్డాక దద్దాల నారాయణ రగిలిపోతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో కనిగిరి నుంచే పోటీ చేసి ఓడిపోయారాన. హనుమంతునిపాడు జడ్పీటీసీగా ఉన్న దద్దాల అనూహ్యంగా 2024లో ఇక్కడ సీటు దక్కించుకున్నారు. ఇక ఓటమి తర్వాత కూడా కనిగిరి ఇన్ఛార్జ్‌గానే కొనసాగుతూ… ఏదో, అలా అలా బండి కూల్‌గా నడిచిపోతోందని అనుకుంటున్న టైంలో బుర్రా బాంబు పేల్చడం దద్దాల వర్గానికి అస్సలు మింగుడు పడ్డంలేదని అంటున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా….. బుర్రా మ‌ధు తరచూ క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న స‌న్నిహితులతో పాటు ద‌ద్దాల నారాయ‌ణ‌ వ్యతిరేక వర్గంతో కూడా తరచూ టచ్‌లోకి వెళ్ళి అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే తాను నియోజ‌క‌వ‌ర్గ భాద్యత‌లు తీసుకుంటున్నానని ఇటీవల తరచూ చెప్పడంతో తెర వెనక ఏదో జరిగిపోతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇన్నాళ్ళు క్లోజ్ సర్కిల్స్‌కే పరిమితం అయిన బుర్రా మాటలు ఈ మధ్య కాలంలో ఓపెన్‌ అయిపోవడంతో… దద్దాల నారాయణ వర్గం కూడా అలర్ట్‌ మోడ్‌లోకి వచ్చేసింది. దీంతో మేటర్‌ మాంఛి రసకందాయంలో పడుతోంది. ఇదే సమయంలో ఇంకో ట్విస్ట్‌ కూడా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. నేను కందుకూరులోనే ఉంటా. ఈసారి కనిగిరి, కందుకూరు రెండు సీట్లు కావాలని అడుగుతున్నా…. అధిష్టానం కూడా అందుకు సిద్ధంగా ఉంది….. నేనొక చోట, నా కుమారుడు ఇంకో చోట పోటీ చేస్తామని చెప్పడం ఇంకా ఆసక్తికరంగా మారింది. బుర్రా ప్రెస్‌మీట్‌లో చెప్పిన ఆ మాటల్ని కందుకూరులో పెద్దగా ప‌ట్టించుకోక‌పోయినా…. క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని కొంద‌రు ఆయ‌న అనుచ‌రులు పార్టీ గ్రూపుల్లో స‌ర్క్యులేట్‌ చేయ‌టం వివాదాస్పదంగా మారింది. నేను ఆల్రెడీ ఇన్ఛార్జ్‌గా ఉన్నప్పుడు బుర్రా అలా మాట్లాడ్డం ఏంటంటూ…ద‌ద్దాల నారాయ‌ణ ఫైరైపోతున్నట్టు స‌మాచారం.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతి నుంచే మధుసూదన్‌యాదవ్‌ వ్యవహారం ఇలాగే ఉందని, వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ కనిగిరిలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారాయన. ఈ పరిణామాలన్నిటినీ పార్టీ అధ్యక్షుడు జగన్‌ దృష్టికి తీసుకువెళ్ళే ప్లాన్‌లో ఉందట దద్దాల వర్గం. బుర్రాతో ఇక అమీతుమీ తేల్చుకుంటానని కూడా అంటున్నట్టు చెప్పుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే ప్రతిసారి ఇలాగే మాట్లాడుతుంటే కేడర్‌లో కూడా గందరగోళం పెరుగుతుందని, అందుకే పార్టీ పెద్దలు వీలైనంత త్వరగా ఈ విషయంలో క్లారిటీ ఇస్తే మంచిదన్నది నారాయణ అభిప్రాయం. కనిగిరి క్వశ్చన్స్‌కు ఆన్సర్స్‌ దొరుకుతాయా? లేక అధిష్టానం వీలైనంత ఎక్కువ కాలం నానబెడుతుందా అన్నది చూడాలి.

Exit mobile version