Off The Record: వైసీపీ జోరుతో ఆ సీనియర్ నేత అజ్ఞాతం వీడి బయటికొస్తున్నారా..?

  • పార్టీ ఓటమి తర్వాత సైలెంట్‌ అయిపోయిన ధర్మాన..
  • రాజకీయాల మీద ఆసక్తి పోతోందని ఎన్నికల టైంలో వ్యాఖ్యలు..
  • ఎలక్షన్స్‌ ముగిశాక పూర్తి అజ్ఞాత వాసం..
  • ఇన్నాళ్ళు పార్టీ ప్రోగ్రామ్స్‌లో ఎక్కడా కనిపించని ధర్మాన..
  • తాజాగా తెర మీదికి, మెడికల్‌ కాలేజీలపై ప్రభుత్వానికి ప్రశ్నలు..
  • ఇన్నాళ్ళు వ్యూహాత్మకంగానే మౌనం పాటించారా?..
  • ఇప్పుడు పార్టీ పుంజుకుంటోందని అనిపించే బయటికి వచ్చారా?..
Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Off The Record: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తలపండిన నేత ధర్మాన ప్రసాదరావు. ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తనదైన మార్క్‌తో పాలిటిక్స్‌ను శాసిస్తూ వచ్చారాయన. 2024 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నా…పార్టీ ఓటమి తర్వాత ఆయనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. తనకు రాజకీయాల మీద ఆసక్తి పోతోందని ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దాంతో… ఒకవేళ తేడాపడితే… ఆయన పూర్తిగా పాలిటిక్స్‌ నుంచి తప్పుకుంటారా అన్న అనుమానాలు అప్పట్లోనే చాలామందికి వచ్చాయి. అందుకు తగ్గట్టే… ఎలక్షన్‌ తర్వాత ధర్మాన ప్రసాదరావు పాలిటిక్స్‌లో అసలు ఉన్నారా లేదా అన్నట్టుగా వ్యవహరించడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ముఖ్య నేతలకు సైతం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం లాంటివి జరిగాయి. ప్రతిపక్షంలోకి వచ్చాక వైసీపీ నిర్వహించిన విద్యుత్ నిరసన, యువత పోరు, వెన్నుపోటు దినం, ఛలో మెడికల్ కాలేజీలు… ఇలా ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు ధర్మాన.

అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి సైలెంట్ మోడ్‌ బటన్ ఆన్‌ చేయడం, ఎన్నికల సమయంలో అన్న మాటల్ని గుర్తు చేసుకున్నవాళ్ళు… సార్‌ ఇక సర్దుకున్నట్టేనని ఫిక్స్‌ అయ్యారట. కానీ… సడన్‌గా ఇప్పుడు ఆయన తెర మీదికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించడం, అదీకూడా… మెడికల్‌ కాలేజీలకు సంబంధించి కావడం ఆసక్తి రేపుతోంది. అదే మెడికల్ కాలేజీల ఆందోళ కార్యక్రమంలో పాల్గొనకుండా… ఆ తర్వాత నింపాదిగా తెర మీదికి వచ్చి ప్రశ్నలేయడంపై డౌట్స్‌ వస్తున్నాయి. నియోజకవర్గ సమావేశం పెట్టి క్యాడర్‌ను ఉత్సహపరచడం గురించి కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. పైగా..తనకుమారుడు రాంమనోహర్ నాయుడును ముందు పెట్టి.. కార్యక్రమాలు నిర్వహించే ప్లాన్‌లో ఉన్నారట. దీంతో… ఇన్నాళ్ళు మాజీ మంత్రి వ్యూహాత్మకంగానే మౌనం పాటించారా? ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ పికప్, జనం రియాక్షన్‌ ఇలా అన్నిటినీ చూసుకుని, కూడికలు, తీసివేతలు వేసేసుకుని… ఇక ఫర్వాలేదని అనిపించాకే బయటికి వచ్చారా అన్న అనుమానాలు వస్తున్నాయట పార్టీ కేడర్‌లో. పార్టీ పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టే… తెర మీదికి వచ్చారుగానీ…. లేదంటే రాకపోయేవారా అని కూడా మాట్లాడుకుంటున్నారట కార్కర్తలు. సరే… కారణం ఏదైనా…ధర్మాన తిరిగి యాక్టివ్ కావడంతో జిల్లా పార్టీలో కూడా జోష్‌ పెరుగుతోందని అంటున్నారు.