Narsapur Congress: అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.. ఇప్పుడు సీన్ రివర్స్

Narsapur Congress

Narsapur Congress

అప్పట్లో ఆ నియోజకవర్గం హస్తానికి కంచుకోట.ఇందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ చెప్పుకోదగ్గ నేత ఒక్కరూ కనిపించటం లేదట. ఒక్కరైనా దొరకరా అని అధిష్టానం ఎంత వెతికినా ప్రయోజనం లేదట. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎంపిక చేయటం ఆ పార్టీ పెద్ద టాస్క్‌లా మారిందట..

మెదక్‌ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉండేది. కాంగ్రెస్ తరపున సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడు సార్లు వరుసగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు.

Read Also: Nagari YCP: రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సొంత జిల్లాలో తప్పని చిక్కులు

ఎప్పడైతే సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారో, అప్పటి నుంచి నర్సాపూర్‌ కాంగ్రెస్‌లో బలమైన నేత లేకుండా పోయారట. దీంతో చాలాకాలంగా కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే స్థాయి లీడర్ కోసం వెతుక్కుంటున్నారట. ఎంత వెతికినా ఇప్పటివరకు ఆ స్థాయి నాయకుడు దొరకలేదట. కనీసం ఎన్నికల నాటికైనా గట్టి నాయకుడు దొరుకుతాడో.. లేదో అనే టెన్షన్‌ లో హస్తం కేడర్‌ ఉందట.

అయితే నర్సాపూర్‌ కాంగ్రెస్‌లో చోటా మోటా నాయకులున్నా ఎమ్మెల్యే స్థాయి నాయకులు లేరనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతో పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాల నేతలు నర్సాపూర్‌కు వస్తూ పోతున్నారు. కానీ, స్థానిక నేతలకు అవకాశం దక్కకపోవటం అక్కడి క్యాడర్‌కి రుచించడం లేదట. ఎవరో మాకెందుకు స్థానిక నాయకుల్లో ఒకరిని ఇతనే మీ నాయకుడు అని చెప్పేస్తే మిగతాది మేం చూసుకుంటా అంటున్నారట పార్టీ కార్యకర్తలు.

వాస్తవానికి నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట ఈ నియోజకవర్గం. ఇప్పటికి పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తులు ఉన్నా, వారిని ముందుండి నడిపించే నాయకుడు లేకపోవటం లోపంగా మారింది. అలాంటి నేత కోసం స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు ఎదురు చూస్తున్నా, ఫలితం లేకుండా పోతోందనే టాక్‌ నడుస్తోంది.

Read Also: Rajole YCP: రాజోలు వైసీపీలో రచ్చ.. బొంతు వర్సెస్ రాపాక