ఆ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఒకే సామాజిక వర్గం కూడా. పూర్వాశ్రమంలో ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగారు. మరి.. పాత పార్టీలు వారికి మద్దతుగా నిలుస్తాయా.. లేక ఒకరివైపే మొగ్గు చూపుతాయా?
టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పూర్వం కమ్యూనిస్ట్లే..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల పేరు ప్రముఖంగా వినిపించేది. ఇప్పుడు ఆ పార్టీది టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత ప్లేస్. ఉనికి కాపాడుకోవడానికి గట్టిపోరాటమే చేస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ వైఖరి ఏంటన్నది ఒక చర్చ. ఆ రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరూ బరిలో లేకపోయినా.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న తాతా మధు.. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుల పూర్వ రాజకీయ వాసనలు కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నాయి. పాత స్నేహాలు గుర్తొచ్చి వీళ్లలో ఎవరికైనా మద్దతిస్తారా? లేక ఒకరికే జై కొడతారా? లేక తటస్థంగా ఉండే సాహసం చేస్తారా అన్నది రాజకీయ వర్గాల ప్రశ్న.
జిల్లాలో ఏడు వందల పైచిలుకు ఓటర్లు..!
సీపీఐ ఓటర్లు 34.. సీపీఎం ఓటర్లు 26
బరిలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థులిద్దరూ లెఫ్ట్ పార్టీల మద్దతు కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గతంలో సీపీఎంలో ఉన్నారు. SFIలోనూ పనిచేశారు. మధు తండ్రి, తాతలు వామపక్ష వాదులే. కొన్నాళ్లు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారు. 2014లో టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు తాతా మధు. ఆ జిల్లా మంత్రి టీఆర్ఎస్ అభ్యర్థి మధును వెంటబెట్టుకుని తన తండ్రి, వామపక్ష నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు దగ్గరకు తీసుకెళ్లి మద్దతుకోరారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు సైతం సీపీఎంలో పనిచేశారు. ఆ తర్వాత పీఆర్పీ.. ఆపై కాంగ్రెస్లోకి వచ్చారు. నాగేశ్వరరావు కుటుంబసభ్యులు సీపీఎంలో ఇంకా కొనసాగుతున్నారు. అందుకే ఇద్దరూ పాత కామ్రేడ్ల మద్దతు ఆశించారు. వాస్తవానికి జిల్లాలో ఏడు వందల పైచిలుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్ బలం దాదాపు ఐదొందలు పైనే. కాంగ్రెస్ ఓటర్లు వంద నుంచి నూట ఇరువై ఉండొచ్చని ఒక అంచనా. ఇక కామ్రేడ్ల బలం సీపీఐ 34, సీపీఎం 26. బలాబలాల పరంగా కాంగ్రెస్ చాలా వెనకబడి ఉంది. లెఫ్ట్ కలిసొచ్చినా.. రైట్కొట్టడం సాధ్యమా అన్నది ప్రశ్న. కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకోవడంతో ఫలితాలపై ఆసక్తి పెరుగుతోంది.
క్యాంపుల్లో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు..!
ఎందుకైనా మంచిదని ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించేశారు. ఇటు కాంగ్రెస్ కూడా తమ ఓటర్లు జారిపోకుండా జాగ్రత్త పడుతోంది. కీడెంచి మేలెంచాలన్నట్టుగా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఈ సమయంలో ఎవరు ఎటు జారిపోయినా.. లెఫ్ట్ పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను కూడా కీలకంగా భావిస్తున్నాయి టీఆర్ఎస్, కాంగ్రెస్. తమ పార్టీ ఓటర్లనుఈ సమయంలో ఏ విధంగా చూసుకుంటున్నారో.. అదే విధంగా లెఫ్ట్ పార్టీ ఓటర్లను గౌరవిస్తున్నట్టు సమాచారం. అయితే స్థానిక రాజకీయ పరిస్థితులు.. సమీకరణాలు.. పార్టీ అవసరాలకు అనుగుణంగా కామ్రేడ్లు నిర్ణయం తీసుకోవచ్చని చర్చ జరుగుతోంది. మరి.. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరికి ఎర్ర తివాచీ పరుస్తాయో చూడాలి.
