అసలు కంటే కోసరు ఎక్కువ అన్నట్టు.. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే PAలే పవర్ఫుల్. PAల ఓవరాక్షన్.. రియాక్షన్ ఇస్తున్నా.. ఎమ్మెల్యేకు పట్టడం లేదట. దీంతో అధికారపార్టీలో చర్చగా మారారు ఆ ఎమ్మెల్యే.
పీఏల అత్యుత్సాహం.. పడిపోయిన ఎమ్మెల్యే గ్రాఫ్?
రెడ్డి శాంతి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే. ఆమె తాత సాయిబాబు నాయుడు, తండ్రి రాజశేఖర్, తల్లి రుక్మిణమ్మ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మరెన్నో ఉన్నత పదవుల అనుభవించిన కుటుంబం నుంచి వచ్చినా.. ఆ స్థాయి రాజకీయం రెడ్డి శాంతికి వంటబట్టలేదని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం PAల అత్యుత్సాహం వల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోయిందనేది అధికారపార్టీ వర్గాల వాదన.
జడ్పీటీసీగా ఓడిన ఎమ్మెల్యే తనయుడు
ప్రస్తుతం వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రెడ్డి శాంతి కూడా వైసీపీ ఎమ్మెల్యేనే. ఇటీవల జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అధికారపార్టీ తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది. ఇంతటి హవాలోనూ పాత్నపటంలో వైసీపీ ఎదురుగాలి వీచింది. కుమారుడు శ్రవణ్ను హిరమండలం జడ్పీటీసీగా బరిలో దింపి గెలిపించుకోలేకపోయారు రెడ్డి శాంతి. దీంతో నియోజకవర్గంపై ఎమ్మెల్యే పట్టు సడలిందనే ప్రచారం ఊపందుకుంది.
ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే ఎంపీపీల ఎంపిక
పాతపట్నం నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే LN పేట, పాతపట్నం మినహా మిగిలిన మూడు చోట్ల ఎమ్మెల్యే సూచించిన వాళ్లు కాకుండా వ్యతిరేకవర్గం పైచెయ్యి సాధించింది. హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో MPPలు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రమేయం లేకుండానే ఎన్నికయ్యారు. జిల్లాలో 38 జడ్పీటీసీలు ఉంటే 37 చోట్ల వైసీపీ గెలిచింది. ఓడిన ఆ ఒక్క జడ్పీటీసీ రెడ్డి శాంతి తనయుడి సీటే.
పీఏల కారణంగానే పార్టీ నేతలతో ఎమ్మెల్యేకు గ్యాప్
వంశధార నిర్వాసితుల సమస్య ప్రతికూల పవనాలకు ఒక కారణమైతే.. రెడ్డి శాంతి పీఏలుగా ఉన్న వినయ్, రాంబాబుల వైఖరి కూడా ఈ పరిస్థితికి కారణంగా లోకల్ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి శాంతి విజయానికి కృషి చేసిన సొంత సామాజికవర్గం నేతలు సైతం ఎమ్మెల్యేకు దూరం అవుతున్నారట. అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి మాట్లాడే పరిస్థితులు లేవట. ఇక సీనియర్ నాయకులు నో ఎంట్రీ. ఎమ్మెల్యేలతో మాట్లాడే సమయంలో PAలు కూడా ఉండాలని చెబుతుండటంతో.. చాలా మంది మాట్లాడటానికి వెనకడుగు వేస్తున్నారట. దీంతో PAల కారణంగా పార్టీ నేతలతో రెడ్డి శాంతికి గ్యాప్ వచ్చినట్టు సమాచారం. మరి.. పాతపట్నం పరిస్థితులను చక్కదిద్దేందుకు వైసీపీ పెద్దలు ఫోకస్ పెడతారో లేదో చూడాలి.
.
